తెలంగాణ

హైదరాబాద్‌లో సోషల్‌ట్రేడ్ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆన్‌లైన్ ప్రకటనలు క్లిక్ చేస్తే లక్షల రూపాయలు ఆదాయం వస్తుందంటూ మోసాలకు పాల్పడిన సోషల్‌ట్రేడ్ సంస్థ హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని వేలాది మంది ఐటి ఉద్యోగులు సుమారు రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసపోయామంటూ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేసే ఇంజనీర్లు, ఉద్యోగులు, వారి బంధువులు దాదాపు 4,500 మందికిపైగా ప్రధాని మోదీకి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16 కేసులు నమోదయ్యాయి. బాధితులు ఎవరైనా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్)లో ఫిర్యాదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ ఎం మహేందర్‌రెడ్డి సూచించారు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు దాదాపు 64 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రకటనలకు ఒక్క క్లిక్‌కు రూ. 5 చొప్పున రోజుకు రూ. 500, రూ. 1000 వరకూ లాభం వస్తుందని నమ్మిన సభ్యులు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉన్నారని పోలీస్ వర్గాలు అంచనా వేశారు. సోషల్‌ట్రేడ్ (3డబ్ల్యు డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్) డైరెక్టర్ అనుభవ్ మిట్టల్‌ను రెండు రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కంపెనీలో సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సోషల్‌ట్రేడ్‌లో హైదరాబాద్‌కు చెందిన వారు రూ. 300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని పోలీసుల అంచనా. సాఫ్ట్‌వేర్ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోషల్‌ట్రేడ్ బృందాలున్నాయి. సోషల్‌ట్రేడ్ వెబ్‌సైట్ ఈనెల 3 నంచి పనిచేయకపోవడంతో రాచకొండ పోలీసులకు ఐదుగరు, సైబరాబాద్‌లో పదకొండు మంది ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సోషల్‌ట్రేడ్, బాధితులకు మధ్య లావాదేవీల సాక్ష్యాధారాలు తీసుకున్న తరువాత కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఫ్రెండ్జ్‌అప్‌గా మారిన కంపెనీ...
సోషల్‌ట్రేడ్ కంపెనీ నిర్వాహకుడు అనుభవ్ మిట్టల్ తనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అనుమానంతో జనవరి 25న ఫ్రెండ్జ్‌అప్‌గా కంపెనీ పేరు మార్చాడు. సోషల్‌ట్రేడ్‌లో ఉన్న సభ్యులందరూ ఫ్రెండ్జ్‌అప్ కంపెనీకి మారిపోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఇకపై ప్రకటనలు కూడా ప్లిప్‌కార్ట్, అమెజాన్ తరహలో వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తామని, వస్తువులు కొనుగోలు ద్వారా వచ్చే పాయింట్లను నగదుగా మార్చుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఇది ఈకామర్స్‌గా మారిపోతున్న నేపథ్యంలో సభ్యులకు ప్రస్తుతం కన్నా ఎక్కువ లాభాలొస్తాయంటూ వివరించారు. దీంతో ఐటి ఉద్యోగులు, పలు సంస్థల్లోని అధికారులు రూ. 2 లక్షల నుంచి 15 లక్షల వరకు పెట్టుబడులు పెట్టినట్టు ఓ ఐటి ఉద్యోగి తెలిపాడు. పెట్టుబడులపై క్లిక్‌లు కొట్టిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో సభ్యులకు నమ్మకం ఏర్పడిందని, రెండు,మూడు నెలల్లోనే సభ్యత్వం మొత్తంలో 20 నుంచి 30 శాతం వరకు తిరిగి వస్తుండడంతో రోజురోజుకూ సభ్యత్వాల సంఖ్య పెరిగింది. హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో 500 మంది ఇంజనీర్లు, సిబ్బంది ఆరు నెలల క్రితం సభ్యులుగా చేరారు.
సోషల్‌ట్రేడ్ బాధితులు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. కొన్ని నెలలుగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతోన్న ఆన్‌లైన్ ప్రకటనలు క్లిక్‌ల బండారం బయటపడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాము మోసపోయమంటూ గ్రహించిన బాధితులు రాచకొండ కమిషనరేట్‌కు వస్తున్నారు. ఇప్పటి వరకు సరైన ఆధారాలతో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 16 కేసులు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు.
సిసిఎస్‌లో ఫిర్యాదు చేయండి
సోషల్‌ట్రేడ్ ద్వారా మోసపోయినవారు హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. కేసుల నమోదు అనంతరం నోయిడా (ఉత్తరప్రదేశ్) పోలీసులతో మాట్లాడి తదుపరి చర్యలు చేపడతామన్నారు. సోషల్‌ట్రేడ్ బాధితులు ఎవరైన సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్లు సందీప్ శాండిల్య, మహేశ్ ఎం భగవత్ తెలిపారు.