తెలంగాణ

ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 20: చిన్నారులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను విస్మరించి, అభంశుభం ఎరుగని ఓ విద్యార్థినిని (మైనర్)కి మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకమిది. ఈ ఉదంతం బట్టబయలు కావడంతో ఆ ఉపాధ్యాయుడిపై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిరికొండ మండలం వాల్గొట్ గ్రామానికి చెందిన పి.గంగదాస్ ఇదే మండలంలోని రావుట్ల గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రావుట్లకు చెందిన ఓ విద్యార్థిని (16) మూడేళ్ల నుండి ఈ పాఠశాలలోనే చదువుతూ గతేడాది పదవ తరగతి ఉత్తీర్ణురాలైంది. ఆమె ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసింది. సదరు బాలిక పాఠశాలను వీడి వెళ్లినప్పటికీ, ఆమెపై మోజు పెంచుకున్న గంగదాస్ తరుచూ బాలికను కలసి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పేవాడు. అప్పటికే గంగదాస్‌కు వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆ బాలికను ప్రలోభాలకు గురిచేసి వశపర్చుకునేందుకు ప్రయత్నించేవాడు. మూడు రోజుల క్రితం సదరు బాలికను బలవంతంగా అజ్ఞాత ప్రాంతానికి తీసుకెళ్లిన అతను ఆదివారం రాత్రి తిరిగి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా వదిలిపెట్టి పారిపోయాడు. అప్పటికే బాలిక కోసం తీవ్రంగా గాలిస్తున్న ఆమె కుటుంబ సభ్యులకు, విద్యార్థిని ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకుని ఎక్కడికెళ్లావంటూ ఆరా తీశారు. దీంతో ఆ బాలిక జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో సోమవారం ఉదయం వారు సిరికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో నిర్భయ చట్టంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసి, పరారీలో ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నామని సిరికొండ ఎస్‌ఐ తెలిపారు.