సబ్ ఫీచర్

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిభక్త కరీంనగర్, నేటి జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమయమైన, మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ ‘‘త్రిలింగాల’’ మధ్యస్థ ప్రాంతమైనందున త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపుదిద్దుకున్నదని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు మహారాష్ట్ర ఉండగా, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4కిలోమీటర్ల దూరానే కాళేశ్వరం ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని శైవ క్ష్రేతాలైన ‘శ్రీశైలం’ మల్లికార్జునుడు, ‘ద్రాక్షారామం’ లోని భీమేశ్వరుడు, ‘కాళేశ్వరం’ లోని కాళేశ్వర, ముక్తీశ్వరులు మహిమాన్వితులు. దేశంలో సరస్వతీ ఆలయాలు మూడు మాత్రమే ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’లో జ్ఞాన సరస్వతి, ‘కాశ్మీర్’లో బాలసరస్వతితో పాటు ‘కాళేశ్వరం’లో మహా సరస్వతి ఉన్నాయి. అలాగే సూర్య దేవాలయాలు మూడే ఉంటే వాటిల్లో ఒరిస్సాలోని ‘కోణార్క్’, శ్రీకాకుళంలోని ‘అరిసెవెల్లి’తో కూడి ‘కాళేశ్వరం’ ఒకటిగా ఉంది. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహ తీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞాన తీర్థం, వాయు తీర్థం, సంగమ తీర్థాదులకు నెలవై ఉంది. కాళేశ్వర దేవాలయంలో దేశంలో మరెచ్చటనూ కానరాని విధంగా ‘‘ఒకే పానవట్టంపై శివుడు, యముడు’’ వెలసి ఉన్నారు. ఇక్కడ ‘‘గోదావరి, ప్రాణహిత’’ నదులతో పాటుగా ‘‘అంతర్వాహినిగా సరస్వతీ నది’’ ప్రవహించడం మూలాన ‘‘త్రివేణీ సంగమ తీరం’’గా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందుతున్నది. ఈ క్షేత్రంలో శుభానంద దేవి, శ్రీ సరస్వతి, శ్రీరామ, శ్రీ ఆదిముక్తీశ్వర, శ్రీసంఘమేశ్వర, దత్తాత్రేయ, ఆంజనేయ, సూర్య దేవాలయాలు ఉన్నాయి. ప్రధానాలయంలో ఒకే పానవట్టంపైన కాళేశ్వర, ముక్తీశ్వరులు వెలసి ఉండగా, ముక్తీశ్వరునికి రెండు నాసికా రంధ్రాలున్నాయి. ఈ రంధ్రాలలో ఎంత నీరు పోసినా, పైకి రాదు. త్రివేణీ సంగమంలో అట్టి నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాలు స్పష్టపరుస్తున్నాయి. కాళేశ్వరుని ముందు పూజించి, తర్వాత ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గప్రాప్తి తప్పక కలగగలదని భక్తుల విశ్వాసం. కాళేశ్వర ప్రధానాలయానికి పశ్చిమ దిశన యమగుండం మీద సుమారు ఒక కిలోమీటరు దూరాన ఆది ముక్తీశ్వరాలయం ఉంది. దానికి చుట్టూరా ప్రకృతి సిద్దంగా విభూతిరాళ్ళు లభించడం విశేషం. కాళేశ్వర తీర్థ, క్షేత్రంశిల్ప కళానిలయం. బయటపడిన అనేక శిల్పాలు గత వైభవ చిహ్నాలుగా నిలిచాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో బౌద్ధ విహారాల పునాదులు, గోడలు, మహా స్థూపాలు, కంచు సంబంధిత బుద్ధ భగవానుని విగ్రహాలు లభించాయి. ఆలయ ప్రవేశ ప్రదేశంలో ఉన్న యమకోణం నుండి బయటకు వెళితే యమదోషం పోగలదని భక్తుల నమ్మకం. ఇక్కడ హిందూ ముస్లింలు సోదర భావంతో సహజీవనం చేసినట్లు కాకతీయుల శిలా ఫలకాలు తెలుపుతున్నాయి. కలియుగ ప్రారంభం నుండీ ప్రసిద్ధ శైవ క్షేత్రమని కాళేశ్వర ఖండంలో పేర్కొబడింది. క్రీ.శ.1140లో చాళక్య జగదేక మల్లుని అధికార సుస్థిర ప్రయత్నంలో మంథెనను ఏలుతున్న గుండరాజును ఓడించి, కాకతీయ రెండవ ప్రోలరాజు ఈ ప్రాంతాన్ని తన రాజ్యంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. అంతకు ముందు ఈ ప్రాంతం వేములవాడ చాళుక్య రాజుల పాలనలో ఉండినట్లు చె న్నూరు శాసనం ద్వారా తెలుస్తున్నది. తర్వాత కాలాన పశ్చిమ చాళుక్యుల రాజ్యంలో మంత్రపురి (మంథని) ప్రాంతాధిపతుల పాలన కింద ఉండేదని, కాకతీయుల పాలనలో చేరిన అనంతరం, కాకతి రుద్రదేవుడు, తన మంత్రియైన ఎల్లంకి గంగాధరుని పాలకునిగా నియమించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. గంగాధరుడు కాళేశ్వరంలో శివాలయమును నిర్మించినట్లు క్రీ.శ.1171 నాటి నగునూరు శాసనంలో పేర్కొన బడింది. మార్చి 3నుండి 5వరకు మహా శివరాత్రి ఉత్సవాలకు చైర్మన్ బొమ్మెర వెంకటేశం, ఈఓ ఎండపల్లి మారుతి, అర్చకులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.

చిత్రం..ఒకే పానవట్టంపై వెలసిన కాళేశ్వర, ముక్తీశ్వరులు

- సంగనభట్ల రామకిష్టయ్య