ఆంధ్రప్రదేశ్‌

ర్యాంకుల్లో అమరావతి వీక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 30: అమరావతికి అంతర్జాతీయ స్థాయి ప్రచారం ఇస్తున్నప్పటికీ అక్కడి అధికారుల పనితీరు నత్తలనే ఈర్ష్య పడేలా చేస్తోంది. అమరావతి జిల్లాకు ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ముఖ్యమంత్రి ఇచ్చిన రేటింగుల్లో జిల్లా స్థానాలు అథమంగా ఉన్నాయి. రుణ సౌకర్యాల కల్పనలో తప్ప మిగిలిన అన్ని అంశాల్లోనూ ముచ్చటగా మూడో స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఇదీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి జిల్లా ‘గొప్పతనం’!
ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా నిర్మాణం కానున్న అమరావతి అభివృద్ధిలో మాత్రం ఎవరినీ ఆకర్షించలేకపోతోంది. జిల్లా నుంచి పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, జిల్లా కలెక్టర్ రెండేళ్లకు పైబడి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నారు. కానీ రాజధాని నగర జిల్లా అయిన గుంటూరు, అభివృద్ధిలో ప్రకాశం వంటి వనరులు లేని జిల్లా కంటే వెనుకబడిపోవడం విమర్శలకు తావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ రంగాల అభివృద్ధి పనులపై నిరంతరం గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని ప్రతిసారీ హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల్లో మార్పురావడం లేదనడానికి స్వయంగా సిఎం ఇచ్చిన రేటింగులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పనితీరు, అభివృద్ధి, వినియోగించిన వనరుల ఆధారంగా జిల్లాలకు రేటింగు ఇచ్చారు. దానితోపాటు మూడునెలల కోసం నిర్దేశించిన లక్ష్యాలు సాధించిన ప్రగతి ప్రాతిపదికన ఈ రేటింగులు కేటాయించారు. ఆర్థిక సూచిక కింద గ్రోత్ ఇంజన్స్, రుణ ప్రణాళిక, పరిశ్రమలు, మినరల్ రెవెన్యూని రేటింగులకు ప్రాతిపదికగా నిర్ణయించారు. నీటి సూచిక కింద నీరు-చెట్టు, ఎన్‌టిఆర్ జలసిరి, సేద్యపు గుంటలు, బోర్‌వెల్స్ ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన విస్తీర్ణం, సాధారణ సూచిక కింద ఫిర్యాదుల పరిష్కారం, ఫైళ్ల క్లియరెన్సు, ‘మీ కోసం’ ఫిర్యాదుల పరిష్కారం, సామాజిక సూచిక కింద వ్యవసాయం, రైతు ఉత్పాదక సంఘాలు, విద్య, ఆరోగ్యం, ఉద్యానవనం, గ్రాణ నీటి సరఫరా, ఉపాధి హామీని తీసుకుని వీటిలో జిల్లాలు చూపిన పురోగతి ప్రకారం రేటింగులు ఇచ్చారు. అయితే, వీటిలో రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లా ఏ ఒక్క అంశంలోనూ కనీసం మూడవ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. పైన పేర్కొన్న అన్ని అంశాల్లోనూ అమరావతి జిల్లాకు వచ్చింది కేవలం ఐదవ స్థానమే. పెద్దగా ప్రచారం లేని కృష్ణా జిల్లా ఈ అంశాల్లో 4వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆర్థిక సూచిక కింద మూడవ స్థానం, సామాజిక సూచిక కింద 7వ స్థానం, కూలీలకు ఉపాథి హామీ పని దినాల కల్పనలో 5వ స్థానం, ఫైళ్ల క్లియరెన్సులో 6వ స్థానం, నీటి సూచికలో 10వ స్థానంలో నిలిచింది. ఆర్ధిక, సామాజిక, సాధారణ, నీటిలభ్యత ఆధారంగా ఇచ్చిన రేటింగుల్లో విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు ఏ-డబుల్ ప్లస్, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఏ-ప్లస్, అనంతపురం, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏ రేటింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు జిల్లాకు ఇద్దరు మంత్రులున్నా సమీక్షలు నిర్వహించడం, అధికారుల నుంచి పనులు తీసుకోవడం, వారితో పనులు చేయించడం, సమన్వయం చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేటింగుల్లో ఇదే స్థానాలు కొనసాగితే అమరావతి జిల్లా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.