మెయన్ ఫీచర్

ప్రమాదంలో పాత్రికేయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పనిచేయగల జర్నలిజం అత్యంత కీలకమని మనందరికీ తెలుసు. పత్రికాస్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. ఏ దేశంలో అయితే మీడియా స్వేచ్ఛగా, పార దర్శకంగా, వత్తిడులు లేకుండా పనిచేయగలదో ఆ దేశం లో ప్రజాస్వామ్యం పరిపుష్టి చెందగలదని భావిస్తుంటాం. ప్రజాస్వామ్యాన్ని మనం ఒక సైద్ధాంతిక అంశంగా కోరుకోవడం లేదు. మానవ సమగ్ర వికాసానికి, సంతులన అభివృద్ధికి, శాంతియుత సహజీవనానికి ప్రజాస్వామ్యం అత్యంత ఆవశ్యకమని మనమంతా నమ్ముతున్నాం. నిరంకుశ వ్యవస్థలు తాత్కాలికంగా కొంత ప్రగతి చూపిం చినా, అక్కడ మానవ జీవనం అత్యంత దుర్భరంగా మారుతూ ఉండడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము.
జర్నలిజం పట్ల అసహనాన్ని, శత్రుత్వ భావనను ప్రకటించడం అంటే ప్రజాస్వామ్య వౌలిక అంశాల పట్ల తీవ్ర ప్రతికూలత నెలకొన్నట్టే. ప్రపంచ వ్యాప్తంగా జర్నలిస్ట్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వ భావనలను ‘సరిహద్దులు లేని రెపోరేటర్లు’ (ఆర్‌ఎస్‌ఎఫ్) సంస్థ సంక లనం కావించిన ‘2018 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక’ వెల్లడిస్తోంది. రాజకీయ నాయకులు ఒక వంక మీడియా పట్ల శత్రుత్వ భావనను ప్రోత్సహిస్తూ ఉంటె, మరో వంక నిరంకుశ వ్యవస్థలు తాము కోరుకొనే జర్నలిజం విలువలను ఎగుమతి చేస్తూ ఉండడం ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించినట్లు ఈ సూచిక స్పష్టం చేస్తున్నది. గత 16 ఏళ్లుగా ఏటా 180 దేశాలలో పత్రికా స్వాతంత్య్రం స్థాయిని ఈ అంతర్జాతీయ మీడియా నిఘా సంస్థ తన వార్షిక సూచికలో తెలుపుతున్నది. ఈ సూచికల ప్రకారం మీడియా పట్ల విద్వేష వాతావరణం క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడి అవుతున్నది. నిరంకుశ వ్యవస్థలు ఉన్న టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలకే ఈ జాడ్యం పరిమితం కావడం లేదు. ఇటువంటి దేశాలలో జర్నలిస్ట్‌లను ఉగ్రవాదులుగా నిందిస్తూ, పాలకుల పట్ల విశ్వాసం ప్రకటించని వారిని జైళ్లలో వేయడం సర్వసాధారణం. ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకొనే దేశాలలో సహితం నేడు- ‘మీడియా ప్రజాస్వామ్యంలో అత్యవసరమైన అంతర్భాగం’- అనే దృష్టితో చూడటం లేదు. తమ అక్రమాలను వెలికి తీసే శత్రుపక్షంగా భావిస్తూ వీలు చిక్కినప్పుడల్లా మీడియా పట్ల తమ విముఖతను పాలకులు ప్రదర్శిస్తూ వస్తున్నారు.
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ హయాంలో ఆ దేశపు సూచిక రెండు స్థానాలను దిగజారి 45వ స్థానంలో నిలిచింది. ఒకప్పుడు రష్యాలో జోసెఫ్ స్టాలిన్ మీడియా పట్ల తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వారిని ‘ప్రజలకు శత్రువులు’ అంటూ వాడిన పదజాలాన్ని నేడు అమెరికాలో ట్రంప్ వాడుతూ ఉండడం గమనార్హం. నేడు ప్రపంచంలో మీడియా పట్ల పదాలతో హింసకు పాల్పడ డానికి, భౌతిక దాడులకు మధ్య ఉన్న సన్నటి గీత చెరిగి పోతున్నది. ఫిలిప్పీన్స్‌లో ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటీర్ట్ తరచూ జర్నలిస్ట్ లను అవమాన పరచడమే కాకుండా, ‘హత్యాకాండ నుండి వారికేమి మినహాయింపు లేదు’- అంటూ బహిరంగంగా బెదిరిస్తున్నారు.
భారత దేశంలో అయితే జర్నలిస్ట్ లను లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు సోషల్ మీడియా లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. పలు సందర్భాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన ‘రహస్య సైనికులు’ అందులో నిమగ్నమవుతున్నారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరం ఏమిటంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య విలువలకు పెట్టని కోటలుగా తమ దేశాలను పేర్కొంటూ ఉంటె ఐరోపా దేశాలలో సహితం మీడియాకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు భాషాపర దాడులకు దిగుతూ ఉండటం పెరుగుతున్నది. స్లోవేకియా ప్రధాన మంత్రి రాబర్ట్ ఫీకో అయితే జర్నలిస్ట్‌లను ‘దుర్మార్గపు స్లోవాక్ వ్యతిరేక వేశ్యలు’ అంటూ అత్యంత దారుణంగా దుర్భాషలాడారు. మాల్టాలో కారుబాంబులో గాలిజియా అనే జర్నలిస్ట్ ను చంపిన నాలుగు నెలలకే స్లోవాక్ లో గత ఫిబ్రవరిలో జాన్ కుసిక్ అనే జర్నలిస్ట్ ను ఇంటివద్దనే కాల్చి చంపారు.
జర్నలిస్ట్‌ల పట్ల విద్వేషం పెరుగుతూ ఉండడం నేడు ప్రజా స్వామ్య దేశాలకు ఎదురవుతున్న అత్యంత అధ్వానమైన ముప్పు అని ఆర్‌ఎస్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ క్రిస్టోఫే దెలియర్ పేర్కొన్నారు. అందుకు జర్నలిస్ట్ ల పట్ల విద్వేషాన్ని వ్యాపింపచేసే రాజకీయ నాయకులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఎందుకంటె వాస్తవాల ఆధారంగా జరగవలసిన బహిరంగ చర్చ ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేస్తూ కేవలం తమ రాజకీయ ప్రచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని విమర్శించారు. అస లు జర్నలిజం చట్టబద్దతనే ప్రశ్నించే విధానం అత్యంత ప్రమాదకరమైన- నిప్పుతో చెలగాట మాడటంగా అభి వర్ణించారు.

మొదటి స్థానంలో నార్వే..
ఆర్‌ఎస్‌ఎఫ్ వార్షిక సూచిక ప్రకారం వరుసగా రెండో సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛలో నార్వే మొదటి స్థానంలో ఉంది. స్వీడన్ రెండో స్థానం కాపాడుకొంది. సాంప్రదాయపరంగా నోర్డిక్ దేశాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ వస్తున్నా మొత్తం మీద ఈ దేశాలలో కూడా పత్రికా స్వేచ్ఛ ప్రమాణాలు దిగజారుతున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఒక జర్నలిస్ట్‌ను తన వార్తాకథనాల గోప్యత వెల్లడించమని బెదిరించడంతో గత సంవత్సరం మూడో స్థానంలో ఉన్న ఫిన్లాండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో నెదర్లాండ్స్ వచ్చింది. ఈ సూచికలో చిట్టచివరిదైన 180వ స్థానంలో ఉత్తర కొరియా ఉంది. కొన్ని దేశాల్లో బలమైన నేతలుగా ఆవిర్భ విస్తున్నవారు మీడియా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. స్వదేశంలో స్వతంత్ర మీడి యా స్వరాలను అణచివేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఆర్‌టి, స్పుత్నిక్ వంటి మీడియా సాధనాల ద్వారా తన ప్రజాసామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు కూడా విస్తరింప చేస్తున్నాడు. సూచికలో రష్యా 148వ స్థానంలో ఉండగా, చైనా 176 స్థానంలో, వియత్నాం 175 స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సమాచారాన్ని మొత్తం ఆసియాలో చైనా అధ్యక్షుడు క్సీజిం పింగ్ వ్యాపింప చేస్తున్నారు. ఐరోపాలో పత్రికా స్వాతంత్య్రం సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నా ప్రాంతీయ సూచికలు మాత్రం ఈ సంవత్సరం ఆందోళనకరంగా మారుతున్నాయి. ఐదు ఐరోపా దేశాలు ఈ సూచికలో గణనీయంగా దిగ జారాయి. మాల్టా 18 నుండి 76కు, చెక్ రిపబ్లిక్ 11 నుండి 34కు, సెర్బియా 10 నుండి 76కు, స్లోవేకియా 10 నుండి 27కు దిగజారాయి. ఐరోపాలో జర్నలిస్టులు హత్యలకు గురవుతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత సంవత్సరం ఐదు నెలల కాలంలో ఇద్దరు జర్నలిస్ట్ లు హత్యకు గురి కావడంతో పాటు, పరిశోధక జర్నలిస్ట్ లు తీవ్ర బెదిరింపులకు గురవుతున్నారు. మీడియా పట్ల విద్వేష పూరిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. పుతిన్ మార్గాన్ని అనుసరిస్తూ సీజెక్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ మిలోస్ జమాన్ కూడా జర్నలిస్ట్ లను అంతమొందించే వలసిందే అంటూ హెచ్చరించారు. స్వతంత్ర మీడియాకు మద్దతు అందిస్తున్న హంగరీలో జన్మించిన అమెరికా బిలియనీర్ దాత జార్జ్ సోరోస్‌ను ‘ప్రజలకు మొదటి శత్రువు’ అం టూ ప్రధాన మంత్రి విక్టర్ ఒర్బాన్ నిందించాడు. ప్రపంచం దృష్టిలో దేశం పరువు, ప్ర తిష్టలకు భంగం కలిగిస్తున్నదని అంటూ వాపోయాడు.
సెర్బియాలో ప్రధానమంత్రి అలెగ్జాండర్ ఉసీకి దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి ప్రభుత్వ అనుకూల మీడియాను ఉపయోగించుకొని జర్నలిస్ట్‌లను ‘దేశద్రోహులు’గా, ‘విదేశీ గూఢచారులు’గా అభివర్ణిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. అల్బేనియాలో ప్రధానమంత్రి ఇదిరామ జర్నలిస్ట్‌లను ‘అజ్ఞానులు’, ‘విషపూరితులు’, ‘ప్రజలకు శత్రువులు’ అంటూ నిందించారు. సంస్కరణల పేరుతో పలు దేశాలు పత్రికా స్వాతంత్య్రాన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లో ఎన్నికల సమయంలో ‘నకిలీ వార్తల’ను కట్టడిచేసే పేరుతో తీసుకురాదలచిన బిల్లు వివాదాస్పదమైంది. కొందరు దానిని పత్రికా స్వేచ్ఛకు భంగకరం అని వ్యతిరేకించగా, మరో కొందరు జర్నలిజంలో విలువలు పెంపొందించే కృషిగా స్వాగతించారు.
జర్మనీలో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం సోషల్ నెట్‌వర్క్‌లలో విద్వేషపూరిత ప్రసంగాలను గుర్తించిన వెంటనే సత్వరం తొలగించని పక్షంలో భారీ జరిమానాలు విధించే వీలు కల్పించారు. రష్యా, ఫిలిప్పీన్స్‌లో అణచివేత చట్టాలుగా భావిస్తున్న ‘డేటా బ్లాకింగ్’ను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నారు. యుకె ప్రధాని థెరెసా మే జాతీయ భద్రత పేరుతో మీడియా పట్ల కఠిన ధోరణి అవలంబిస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణలో ఉండే వార్తలు, సమాచారాన్ని వియత్నాం, కంబోడియా వంటి ఇతర ఆసియా దేశాలకు వ్యాప్తిచేయడం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించాయి. ఆప్ఘనిస్తాన్, భారత్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్‌లలో జర్నలిస్ట్‌లపై హింసాయుత దాడులు పెరుగుతున్నాయి. చైనా అధ్యక్షుడు పింగ్ అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తూ సెన్సార్‌షిప్, నిఘా వ్యవస్థలను మీడియాపై గతంలో లేనంతగా అమలు జరుపుతున్నారు.
విదేశీ జర్నలిస్ట్‌లు చైనాలో పనిచేయడం అసంభవంగా మారింది. సోషల్ నెట్‌వర్క్‌లో కథనాలను ‘షేర్’ చేసుకున్న వారిని, మెసేజింగ్ సర్వీస్‌లో ‘చాట్’ జరిపిన సాధారణ పౌరులను సహితం జైళ్ళకు పంపుతున్నారు. తమ అణచివేత పద్ధతులను ఎగుమతి చేయడం ద్వారా అంతర్జాతీయంగా ‘నూతన ప్రపంచ మీడియా వ్యవస్థ’ ఏర్పాటుకు చైనా ప్రయత్నిస్తున్నది. రెండు స్థానాలు దిగజారి, సూచికలో 138వ స్థానం పొందిన భారత్ నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి జర్నలిస్ట్‌లను తీవ్ర దూషణ పూరిత పదజాలంతో సంభోదిస్తుండటం పెరుగుతున్నది. అధికార పార్టీకి ఇబ్బంది కలిగించే ఎటువంటి పరిశోధనాత్మక కథనం అయినా అసహనానికి గురిచేస్తున్నది. పలుచోట్ల అందుకు బాధ్యులైన జర్నలిస్ట్‌లు బెదిరింపులకు గురవుతున్నారు. గౌరీ లంకేశ్ సహా పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.
పాకిస్తాన్‌లో జర్నలిస్ట్‌లను చంపుతామని బెదిరించడం, అపహరించడం, చిత్రహింసలకు గురిచేయడం సర్వసాధారణమైంది. ఒకవైపు ఇస్లామిక్ చాందసవాదులు, మరోవైపు అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాయి. బలమైన రాజ్యాంగపర రక్షణలు ఉన్నప్పటికీ అమెరికా, కెనడాలలో జర్నలిస్ట్‌లు తమ విధి నిర్వహణలో వత్తిడులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా సూచిక 43నుండి 45కు పడిపోయింది. చాలామంది జర్నలిస్ట్‌లకు వైట్‌హౌస్‌లో ప్రవేశాన్ని అడ్డుకోవడం, ‘నకిలీ వార్తలు’ అంటూ తరచూ మీడియాపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. అమెరికా ఈ సూచికలో దిగజారడం ఆ దేశంలోని మీడియాకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియాపై అణచివేత పెరగడానికి దారితీస్తుంది. ట్రంప్ ఉపయోగించిన ‘నకిలీ వార్తలు’ పదాన్ని ఇప్పుడు మీడియాపై విద్వేషం విరజిమ్మడానికి ప్రపంచవ్యాప్తంగా వాడుతూ ఉండటం గమనార్హం.

-- చలసాని నరేంద్ర సెల్ : 98495 69050