మెయన్ ఫీచర్

అందలమే లక్ష్యం.. విలువలు మృగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ రాలేదు. బీజేపీ సొంతంగా పోటీ చేసి 104 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ముందు పరస్పరం ఘాటుగా విమర్శించుకుని సొంత అజెండాలతో పోటీ చేసిన కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చాయి. దీంతో అందరి కళ్లూ రాజ్‌భవన్ మీద పడ్డాయి. గవర్నర్ వాజుభాయి వాలా ఏ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తారనేదానిపై చర్చోపచర్చలు సాగాయి. గతంలో వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్, ఎంఎం ఫుంచీ కమిషన్ చేసిన సిఫార్సులను గవర్నర్ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బిజెపి శాసనసభ నాయకుడిగా ఎన్నికైన యెడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆహ్వానించినట్లు వార్తలు వెలువడ్డాయి. గవర్నర్ నిర్ణయంపై న్యాయపరమైన పోరాటం చేసేందుకు జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సిద్ధమయ్యాయి.
గవర్నర్ ఫలానా విధంగా నిర్ణయాలను తీసుకోవాలని చట్టాలు శాసించలేవు. కాని ఆ నిర్ణయాలు తప్పయితే సుప్రీం కోర్టు సమీక్షించి తీర్పులు ఇచ్చే అధికారాన్ని కలిగి ఉంటుంది. సర్కారియా కమిషన్ ఏ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిలవాలనే అంశంపై స్పష్టత ఇచ్చింది. పూర్తి మెజార్టీ ఏ పార్టీకి రాని పక్షంలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని ఉన్న పార్టీల కూటమిని ముందుగా పిలవాలి. ఆ కూటమి ముందుకు రాకపోయినా, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోలేకపోయినా, ఎక్కువ సీట్లు తెచ్చుకున్న ఏకైక అతి పెద్ద పార్టీని పిలవాలి. వారికి స్వతంత్రుల మద్దతు ఉంటే పరిగణించాలి. ఈ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీల కూటమిని గవర్నర్ ఆహ్వానించాలి. గవర్నర్ విశ్వాసాన్ని చూరగొన్నంత కాలం మాత్రమే ఆ నాయకుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆ ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు గవర్నర్ మంత్రులను నియమిస్తారు.
కర్నాటక గవర్నర్ ఏకైక అతి పెద్ద మెజార్టీ కలిగి ఉన్న బీజేపిని ఆహ్వానించారు. బలనిరూపణకు ఎక్కువ గడువు ఇచ్చే కొద్దీ రాజకీయ బేరసారాలకు తావిచ్చినట్లవుతుంది. చరిత్రలో ప్రతి అంశానికి సానుకూల, ప్రతికూల ఉదాహరణలు ఉంటాయి. ఈ తరహా కేసులో కోర్టుకు వెళ్లినప్పుడు రాజ్యాంగ సమీక్ష చేసి తీర్పు ఇస్తారు. న్యాయ కోవిదుడు సోలీ సొరాబ్జీ కూడా ఈ విషయమై మాట్లాడుతూ అసెంబ్లీ లేదా లోక్‌సభలో ఏ పార్టీకి మెజార్టీరాని సమయంలో త్రిశంకు సభ ఏర్పడినప్పుడు సభకు ఎన్నికైన పార్టీలో అతి పెద్ద పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలన్నారు. రాజ్యాంగ పరంగా ఉన్నత విలువలను కాపాడే సంప్రదాయమన్నారు. ఆ పార్టీ ముందుకు వస్తే నాయకుడి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి. వారం పదిరోజులు బలనిరూపణకు గడువు ఇవ్వాలి. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోని పక్షంలో, ఆ తర్వాత రెండవ అతి పెద్ద పార్టీ లేదా ఆ పార్టీ మద్దతు ఇచ్చే మరో పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించాలి. ఒక వేళ అప్పుడు కూడా రాజకీయ పక్షాల మధ్య సమన్వయం కొరవడినప్పుడు, ఏకాభిప్రాయానికి రావడానికి వీలుగా కొంతకాలం రాష్టప్రతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పాలనలో శూన్యత ఉండరాదు. ప్రస్తుతం కర్నాటకలో అధికారం చేజిక్కించుకునే క్రమంలో అన్ని పార్టీలు రాజకీయాల్లో నీతి గురించి ఎప్పటిలాగానే ఎక్కువగానే మాట్లాడాయి. గవర్నర్ బీజేపీనే ఆహ్వానించాలని ఒకరంటే, కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని పిలవాలని ఎవరికి వారు తమకు అనుకూలమైన ఉదాహరణలు, గతంలో చోటు చేసుకున్న ఘటనలు చూసి ప్రకటనలు చేశారు. గొంగళి మీద కూర్చుని వెంట్రుకలను ఏరినట్లుగా రాజకీయ పార్టీల తీరు తయారైంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా రానూరానూ రాజ్యం వీరభోజ్యం అన్న చందంగా తయారైంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండే ఆ పార్టీ తమకు నచ్చిన వారినే గవర్నర్ పదవిలో నియమిస్తుందన్న సంగతి సర్వ విదితమే. ఆ గవర్నర్ కూడా తనకు పదవిని అప్పగించిన పార్టీకి విధేయుడై ఉంటారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో దాదాపు 60 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కోరడం విడ్డూరంగా ఉంది.
కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయ కర్తగా, దేశ సమగ్రతకు ప్రతి రూపంగా, రాజ్యాంగ సంరక్షుడిగా వ్యవహరించే గవర్నర్ వ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత కాంగ్రెస్‌కు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని మెజార్టీ సాధించిన ఎన్టీఆర్ స్థానంలో నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి ఆనాటి కాంగ్రెస్ పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ రామ్‌లాల్ ఘన చరిత్రను ఎవరూ మర్చిపోలేదు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతిడిని చేసిన తీరు, అప్పటి గవర్నర్ వ్యవహార శైలిని ఎవరూ మర్చిపోలేదు. మణిపూర్, గోవాలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న బిజెపిని పిలిచారని, తమను పిలవలేదని కాంగ్రెస్ చెబుతున్న కారణాలు సాంకేతికంగా నిజమే. కాని కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కర్నాటకలో మాదిరిగా వెంటనే స్పందించలేదనే అపవాదు ఉంది. గోవాలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఇపుడు కర్నాటక గవర్నర్ అనుసరించాలని బీజేపియేతర పార్టీలు కోరుతున్నాయి. గవర్నర్ తన ముందున్న పరిస్థితులు, రాజకీయ వత్తిడులకు లోబడి, దీనికి ఉపయోగపడే కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటారనే విషయం అన్ని పార్టీలకు తెలుసు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఓడి గెలిచింది. బిజెపి గెలిచి ఓడింది. కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు రావడం అంటే ఆషామాషీ కాదు. తనకు లభించిన ప్రజా తీర్పును శిరసావహిస్తూనే ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ఉంటే గంభీరంగా ఉండేది. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు జేడీఎస్‌తో,కాంగ్రెస్ నువ్వా? నేనా? అన్నట్లుగా ఆ పార్టీల నేతలు తూలనాడుకున్నారు. కాని బీజేపీకి తగినంత మెజార్టీ రాకపోయే సరికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సెక్యులర్ ముసుగును తొడిగేసుకుని, బీజేపీని దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చాయి. కర్నాటకలో 104 సీట్లు తెచ్చుకున్న బీజేపిని కాదని గవర్నర్, కేవలం 38 సీట్లు తెచ్చుకున్న జేడీఎస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారు? జేడీఎస్ కాకుండా, కాంగ్రెస్ పార్టీ తమకు జేడీఎస్ మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి ఉంటే ఆట మరొక రకంగా ఉండేది. కాంగ్రెస్ జేడీఎస్‌కు మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే, ఆ పార్టీతో బీజేపీ జతకట్టి అన్ని రకాలుగా భ్రష్టుపట్టి ఉండేది. దీని వల్ల మరో ఏడాదిలోపల జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్నాటకలో సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండేది.
కర్నాటకలో గత 48 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే, కాంగ్రెస్ బిజెపిని వ్యతిరేకించే పార్టీల ఉచ్చులో పడిందని చెప్పవచ్చు. ఈ రోజు ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణం ఉంది. సరైన స్థానిక నాయకత్వం లేనందువల్ల పార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. కర్నాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. గతంలో కంటే రాహుల్ గాంధీలో వ్యవహారశైలిలో సానుకూలంగా మంచి మార్పు వచ్చింది. ఆయన దూకుడు పెంచారు. చివరి నిమిషంలో ఓటమి తప్పదని తెలిసినా, 78 సీట్ల వరకు కాంగ్రెస్‌ను లాక్కొచ్చారు. కర్నాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మళ్లీ వచ్చిన సందర్భాలు లేవు. ఈ రోజు జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ పార్టీ, వామపక్ష తదితర పార్టీలు కాంగ్రెస్‌పై వత్తిడి తెచ్చాయి. ఈ పార్టీల మాట విని కాంగ్రెస్ పార్టీ ముందూ వెనక ఆలోచించకకుండా, తనకు అంతో ఇంతో ప్రజాదరణ కలిగిన కర్నాటకలో జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి పప్పులో కాలేసింది. కర్నాటకలో ఏమి జరిగినా ప్రపంచం చూస్తుంది. దీనిపై గల్టీ నుంచి ఢిల్లీ వరకు చర్చ జరుగుతుంది.
జేడీఎస్ పార్టీ కర్నాటకలో కావేరి డెల్టాకు పరిమితమైన పార్టీ. ఆ పార్టీలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ పార్టీ గతంలో బిజెపితో జత కట్టింది. అధికారం లక్ష్యంగా ఆ సమయానికి ఏది తనకు లాభం బేరీజు వేసుకుని నడుచుకునే జేడీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా లాభం కంటే నష్టమే. కర్నాటక ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలావలనుకునే పట్టుదల ఉంటే ముందుగానే జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని ఉంటే ప్రజలు ఆదరించేవారో లేదో తెలియదు. ప్రలోభాలకు గురయ్యే ఓటర్లు ఉన్నంత వరకు పదవి, డబ్బు ఎర చూపితే, పార్టీలు ఫిరాయించే ప్రజాప్రతినిధులు ఉంటారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు సంతలో గొర్రెల్లా అమ్ముడయ్యే ప్రజాప్రతినిధులు ఎటూ ఉంటారు. అధికారం తమ వద్దకు వచ్చినట్లే వచ్చి జారిపోతుందనుకునే వారు రాజకీయాల్లో నైతిక విలువల పతనం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ప్రస్తుతం కర్నాటకలో బీజేపి,జేడిఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ పనే చేస్తున్నాయి. మరో అరడజను మంది ఎమ్మెల్యేలు లేకపోయినా, ఆ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే తప్ప రారని తెలిసినా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని పార్టీలు లోపాయికారిగా తమకు అనుకూలమైనప్పుడు, అధికారానికి చేరువగా వచ్చినప్పుడు, రాజకీయ బేరసారాలకు పాల్పడుతున్న తరుణంలో, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడడం శుద్ధ దండగ.

--కె.విజయ శైలేంద్ర 98499 98097