మెయన్ ఫీచర్

హోదా ప్రశ్నపై మూడోదశ రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు ప్రత్యేకహో దా పేరిట చేస్తున్నది రాజకీయమే తప్ప వారికి కావలసింది అభివృద్ధి కాదని ఇప్పుడు స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ ఈనెల ఏడవ తేదీని ప్యాకేజీ ప్రకటించడానికి ముందటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అంతకుముందు ఒక దశ రాజకీయం ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించడం వరకు జరిగింది. రెండవ దశ రాజకీయం బిల్లు ఆమోదం నుంచి మొదలుకొని జైట్లీ ప్యాకేజీ ప్రకటన వరకు నడిచింది. ఇపుడు మూడవ దశ నడుస్తున్నది. మొదటిదశలో ఇది అది అనిగాక అన్ని పార్టీలు రాజకీయం చేసాయి. రెండవదశలోనూ అంతే. ప్రస్తుత మూడవదశలో ఇక ఆపని చేసే అవకాశం టిడిపి, బిజెపిలకు లేదు. అవి రెండూ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా అధికారపక్షాలు. హోదా విషయమై మొదటి రెండు దశలలో దోబూచులాటలు ఆడిన ఈ పార్టీలకు, జైట్లీ ప్రకటన అనంతరం ఇక ఆందుకు ఆస్కారంలేదు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో లేవు కనుక ఏమి మాట్లాడేందుకైనా స్వేచ్ఛ ఉంది కనుక మొదటి రెండు దశల రాజకీయానే్న ఇప్పుడూ సాగిస్తున్నారు. ఒకవేళ వీరు అధికారంలోనో, అధికార కూటమిలోనో ఉండి ఉంటే ఏమి చేసేవారు? సమాధానం వేరే చెప్పనక్కరలేదు. మరొకవైపు నుంచి ఆలోచిస్తే టిడిపి, బిజెపిల మాటేమిటి? ప్రస్తుతం ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో అప్పుడు వారదే చేసి ఉంటారు.
ఇది అన్ని పార్టీలు చేసే రాజకీయమేనని ప్రజలకు ఎవరూ చెప్పనక్కరలేదు. కనుక ప్రజలు ఈ మొత్తం ఉదంతం నుంచి నేర్చుకోవలసింది నేర్చుకుని, హోదాపై ఉద్రేకపడటానికి బదులు అభివృద్ధిపై దృష్టి పెట్టడం మం చిది. అందువల్ల రాష్ట్రానికి, తమకు మేలు జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఎట్లా జరిగింది? అందులోని మంచి చెడు ఏమిటనే విషయమై ఈ రెండేళ్లలో చర్చలు చాలానే జరిగాయి. అకడమిక్‌గా చరిత్రను సమీక్షించుకొని దానినుంచి పాఠాలు నేర్చుకునే పద్ధతిలో మునుముందు కూడా చర్చించుకుంటూనే ఉండవచ్చు. కాని ఈ చర్చ వర్తమానానికి, భవిష్యత్తుకు పరోక్షంగా ఉపయోగపడుతుందిగాని, ప్రత్యక్షంగా కాదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్ష, వర్తమాన అభివృద్ధి సమస్యలు, అవసరాలు అనేకం ఉన్నాయి. కనుక అది ఏవిధంగా జరుగుతుందన్నది వారు ఆలోచించవలసిన విషయం.
ప్రత్యేక హోదా ప్రత్యక్ష, వర్తమాన అభివృద్ధికి, భవిష్యత్తుకు ఉపయోగపడేదే అనడంలో సందేహం లేదు. అటువంటి ప్రకటన వెలువడి ఉంటే తప్పక మంచి జరిగేది. కాని హోదా లభించడంపై గత రెండేళ్ల దోబూచులాట తర్వాత ఇప్పుడు జైట్లీ ప్రకటన తర్వాత తిరుగులేని స్పష్టత వచ్చింది. మంచైనా, చెడైనా అది ఇక మారగల పరిస్థితి కాదు. హోదా ఎందువల్ల సాధ్యంకాదో కేంద్రం అనేక విధాలైన వివరణలు ఇచ్చింది. పదేపదే ఇచ్చింది. ఆ వివరణలు ప్రజల దృక్కోణంనుంచి ఆమోదించగలవి కాకపోవచ్చు. కాని ఆమోదనీయం అయినవి కానివి అనేకం జరుగుతున్నాయి. అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది తప్ప కోరుకునేవన్నీ జరుగవు. అన్నీ ఆమోదనీయమైనవే జరుగవు. ఆందోళనలు కొన్నింటిని సాధిస్తాయి. అన్నింటినీ సాధించవు. రాజకీయాలలోనే కాదు, జీవితంలోనైనా అంతే. ఇది ప్రజలకు తమ జీవితంలో అనుభవమే గనుక కొత్తగా చెప్పనక్కరలేదు. ప్రత్యేక హోదా ఇక వీలయేది కాదని జైట్లీ ప్రకటనానంతరం తుది రూపంలో తేలింది. ఇంతకుముందు కూడా పార్లమెంటులో ప్రశ్నలకు జవాబుల పద్ధతిలో, ఇతరత్రా బయట కూడా కేంద్రంలోని బాధ్యులు ఆ సూచనలు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలలోనూ అవే సూచనలు పలుమార్లు కనిపించాయి. ఈ మాట సాధారణ ప్రజలకు కూడా ఇంచుమించు అర్థమైనదే. కాకపోతే ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటనతో ఇక సంశయాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.
అటువంటి స్థితిలో ఇక చేయవలసింది ఏమిటి? చేదు నిజాన్ని అరమరికలు లేకుండా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హోదా విషయం మరచిపోతూ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అంతకన్న మార్గాంతరం లేదు గనుక ప్రతిపక్షాల అధికార రాజకీయాలను కూడా విస్మరించాలి. లేనట్లయితే వారి రాజకీయాలకు ఉపయోగపడటం మినహా రాష్ట్రం కోసం సిద్ధించేమీ ఉండదు. దీన్ని వాస్తవవాదం, లేదా ఆచరణాత్మకవాదం అనవచ్చు. ప్రతిపక్షాలు సెంటిమెంటును తమ రాజకీయంకోసం ఉపయోగించుకొన జూస్తున్నాయి తప్ప వారికి కూడా చిత్తశుద్ధిలేదు. తాము ఇంతకాలం చేసిన దానిగురించి ఎదురు ప్రశ్నలు వేస్తే వారు జవాబులు చెప్పలేనివి కొన్నున్నాయి. ఇంకా వెనుకకుపోయి ఆలోచిస్తే, ఉమ్మడి రాష్ట్రం విభజనవరకు వచ్చిన 58 సంవత్సరాల చరిత్రలో వీరు వారని గాక అన్నిపార్టీలు, వాటి నాయకులు, వారి వెంటగల ధనిక వర్గాల పాత్ర ఉన్నది. చివరకు సిద్ధాంతాలు చాలా మాట్లాడే కమ్యూనిస్టుల తప్పులు తక్కువకాదు. ఆవిధంగా వీరందరి గత ప్రవర్తన మూలంగానే పరిస్థితులు విభజనకు దారితీశాయి. తమ ప్రవర్తనలు ఏమిటో నిజాయితీగా సమీక్షించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలముందు ఒప్పుకునే నిజాయతీ, ధైర్యం వీరెవరికీ లేవు. ఆవిధమైన గత చరిత్రకు కొనసాగింపే వర్తమాన పరిస్థితులు తప్ప, ఇవి ఆకస్మికంగా ఆకాశం నుంచి వచ్చినవి కావు. కొంత సావధానంగా ఆలోచిస్తే సామాన్య ప్రజలు సైతం గ్రహించగలదే ఇది.
ప్రజలకు సమస్యలు, సెంటిమెంట్లు ఎప్పు డూ ఉంటాయి. వాటిని పార్టీలు తమ ప్రయోజనాలకోసం ఉమ్మడి రాష్ట్రంలో ఒకవిధంగా ఉపయోగించుకోగా, విభజనానంతరం మరొక తరహాలో ఉపయోగించుకొన జూస్తున్నాయి. ఇదొక అంతులేని క్రీడ. అందువల్ల, ఈక్రీడవల్ల రాష్ట్రానికి, తమకు కలిగే నికర ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి అంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిపై దృష్టి పెట్టడం మంచిది. హోదా పేరిట తమ సమయాన్ని శక్తిని వృధా చేసుకోవద్దు. మొత్తం విషయం పట్ల, చరిత్ర పట్ల అవగాహనగాని, చిత్తశుద్ధిగాని లేని నటులు నాటకీయమైన డైలాగులు చెప్పవచ్చు గాక. కాని అవి వారికో, మరొకరికో రాజకీయంగా ఉపయోగపడటం మినహా ఒనగూడేది ఏమీ ఉండదు. అందువల్ల, ప్యాకేజీని వినియోగించుకొని ప్రయోజనాలు పొందడం ఏవిధంగా? అనే పద్ధతిలో మరిన్ని సాధించుకోవడం ఎట్లాగన్న ఆలోచనలు చేయడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు మేలున్నది. ఆ పని చేయక ఇక నెరవేరని సెంటిమెంట్లలో కూరుకుపోవడం వల్ల జరిగేది కాలహరణ, మరింత నష్టం మాత్రమే. ఇటువంటి సూత్రబద్ధమైన వాస్తవాలతో కూడిన, నైతికమైన వైఖరిని కనీసం కమ్యూనిస్టులు అయినా తీసుకోక పాప్యులిస్టు రాజకీయం చేయడం వారు ఏవిధంగా పతనమవుతున్నారో సూచిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ఒక క్లిష్టమైన దశలో ఉంది. బ్రిటిష్ వలసపాలన కన్నా ముందు నుంచి తగిన వనరులు కలిగి, ఆ పాలనలో అభివృద్ధికి తగిన పునాదులు పడి, ఆదే ఆశాభావంతో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి బయటకు వచ్చిన ఆప్రాంతం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత 63 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధి చెందవలసింది. కాని ఇంత సుదీర్ఘ కాలం తర్వాత ఈ రోజున తప్పటడుగులు వేస్తున్న స్థితి నుంచి మొదలు పెట్టవలసి వస్తున్నది. ఇందుకు బాధ్యులు ఆ ప్రాంతపు ధనికులు, ఆధిపత్య ధోరణుల వారు మాత్రమే. వారి చర్యలు, వైఫల్యాల భారాన్ని అక్కడి ప్రజలు మోయవలసి వస్తున్నది. ఇటువంటి క్లిష్ట స్థితి దేశంలోని మరే రాష్ట్రానికి కూడా లేదు. ఆ దృష్ట్యా దీనినుంచి బయటపడేందుకు చేయవలసింది అభివృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం మాత్రమే. ఆపని చేయడం ఈ నాయకుడినో, ఆపార్టీనో దృష్టిలో ఉంచుకుని కాదు. తమకోసం, తమ రాష్ట్రం కోసం, తమ భవిష్యత్తుకోసం, నాయకులు, పార్టీలు శాశ్వతం కాదు. రాష్ట్రం శాశ్వతం.
కేంద్ర ఆర్థిక మంత్రి గత రెండేళ్లలో చేసిందిగాని, ఈనెల ఏడవ తేదీన ప్రకటించిందిగాని మరీ తీసివేయదగ్గదేమీ కాదు. అది విభజన చట్టం కారణంగా కొంత వచ్చి ఉండవచ్చు. గత రెండేళ్లలో ఏర్పడిన వత్తిడివల్ల మరికొంత లభించి ఉండవచ్చు. ఆ విషయమైన తర్కాలు ఏమి చేసుకున్నా, వివరాలలో జాగ్రత్తగా, స్థిరచిత్తంతో వెళ్లినట్లయితే మాత్రం రాష్ట్రానికి ఉపయోగపడేవి అనేకం కనిపించడం నిజం. జైట్లీ అన్నట్లు స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏకేంద్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రానికి కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత సహాయం చేయలేదు. అదంతా దానంగా చేయలేదని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక పరిస్థితులున్నాయని ఎవరైనా వాదిస్తే వాదించవచ్చు. అందులో నిజం ఉంటుంది కూడా. అదే సమయంలో జైట్లీ చెప్పినదానిలోనూ నిజం కనిపిస్తున్నది.
ఆయన చెప్పినదానిలో నగదు రూపంలో తగినన్ని నిధులున్నాయి. ప్రాజెక్టు నిర్మాణాలు, ముఖ్యమైన సంస్థల ఏర్పాట్లు, వౌలిక సదుపాయాలు ఉన్నాయి. తనతోపాటు మరొక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నట్లు వీటన్నింటిని సక్రమంగా ఉపయోగించుకుంటే మంచి అభివృద్ధితోపాటు సత్వరాభివృద్ధి తప్పక సాధ్యమే. వీటి ‘‘సక్రమ’’ ఉపయోగంపై ప్రభుత్వం, అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు దృష్టి పెట్టి పనిచేయగలరని ఆశించాలి. ఆ పనులన్నీ ‘‘సక్రమంగా’’ జరిగేట్లు శ్రద్ధ చూపే పనిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాధారణ ప్రజలు, మేధావి వర్గాలు చైతన్యంతో, క్రియాశీలకంగా చేయాలి. లేనిపక్షంలో అభివృద్ధి పేరిట ఏమేమి జరిగేది తెలిసిన విషయమే.
ఒక విచారకరమైన స్థితి ఏమంటే సాధారణ చైతన్యాలు క్రియాశీలత ఆంధ్రప్రదేశ్ సమాజంలో తక్కువగా ఉన్నాయి. చరిత్రలో అక్కడ విద్య, చైతన్యం, సామాజికోద్యమాలు గణనీయంగా ఉండేవి. కాని ఇటీవలి దశలో విద్యకు కొరతలేదు కాని, చైతన్యాలు, సామాజికోద్యమాలు గణనీయంగా బలహీనపడ్డాయి. ‘‘సివిల్ సొసైటీ’’ అని మేధావి వర్గాలు తమ పరిభాషలో చెప్పే వ్యవస్థలు అక్కడ ఇంచుమించు లేవు. కొన్ని చోట్ల స్థానిక సమస్యలకు పరిమితమైన చైతన్యాలు మినహా. అందువల్ల, రాష్ట్ర అభివృద్ధికోసం, ప్రజల మేలుకోసం, విషయాలు సక్రమంగా సాగడం కోసం ‘సివిల్ సొసైటీ’ అనే దానిని తిరిగి ఉనికిలోకి తేవలసిన బాధ్యత అక్కడి మేధావులపై, చైతన్యపరులపై ఉంది. అపుడు గాని హోదాపై ఈ మూడవదశ రాజకీయానికి బ దులు అభివృద్ధి ఆలోచనలు ముందుకు రావు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)