మెయన్ ఫీచర్

ఛెయ్యెత్తి జైకొట్టు! గత కీర్తి అడగొద్దు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ దేశంలో అడుగు పెట్టాలంటే, విమానాశ్రయంలో అక్కడి అధికారులు చెప్పినట్టు చేయాల్సిందే! మాజీలు, హాజీలు అనే తేడా లేకుండా వలువలు కూడా ఒలిచి చూపాల్సిందే! మాజీ రాష్టప్రతి హోదాలో అబ్దుల్‌కలామ్‌కు న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో జరిగిన అవమానం తెలిసిందే! ఆ దేశంలో దౌత్యం నెరవేర్చే అధికారిణి అయినా, మీరాశంకర్‌కు మిసిసిప్పిలో అదే పరాభవం! గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మోదీకి 2002 నాటి మారణకాండకు కారకుడని వీసా కూడా ఇవ్వని దేశం! అయితేనేమి ఆ దేశ నాయకుడే కాదు- నాయకుడి కుటుంబ సభ్యురాలు (పేరుకు శే్వత సౌధం సలహాధారిణి) వస్తే మాత్రం మన బట్టలు విప్పి తివాచీలు పరవాల్సిందే!
ఇవాంకనా, మజాకా! 36 సం.ల అమ్మడికి ముచ్చటగా మూడో వ్యక్తి భర్త. సరదా కోసం సిగరెట్టు కాలుస్తుంది. అది కూడా మందు కొట్టినప్పుడే! చదివింది బిఎస్సీ ఆర్థిక శాస్త్రం. మోడల్‌గా, రియల్ ఎస్టేట్ నిర్వాహకురాలిగా (దీనే్న ముద్దుగా ఔత్సాహిక పారిశ్రామిక రంగమని మనం మురిసిపోతాం) ది ట్రంప్ కార్డ్ అనే పుస్తకాన్ని రాసి, పనిలో, జీవితంలో ఎలా గెలవాలో సెలవిచ్చిన గొప్ప రచయిత్రిగా నిరవధికంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను రేపు (28/11) పర్యటించబోతున్నారు. మిగతా కథంతా మన ఇడియట్ బాక్సుల్లో రోజూ చూస్తూనే వున్నాం. బిచ్చగాళ్లను వెతికి వేటాడి పట్టడమేకాక, చివరికి వీధి కుక్కల్ని కూడా మాయం చేసి, హైటెక్ ప్రాంతాన్నంతా చివరికి దోమలు, ఈగలు, వెలుతురు పురుగులు కలలో కూడా కనపడకుండా (మన జనాలు వీటి బారినపడి రోగాలతో చచ్చినా) మన ప్రభుత్వం, సారీ, అమెరికా చెప్పు చేతుల్లోని ప్రభుత్వం శక్తినంతా ధారబోసి జాగ్రత్త పడుతున్న వైనం చూస్తూనే్న వున్నాం. ఆమె కాన్వాయిలో 20 కార్లుంటాయి. ఏ కార్లో వెళుతుందో ఆమెను వెన్నంటి చూసే 25 మంది భద్రతా సిబ్బందికి కూడా బహుశ తెలియకపోవచ్చు? అంతా అమెరికా నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ సర్వీసెస్ చూసుకుంటుంది. పేరుకు హోంశాఖామాత్యులైన నాయిని గారికే ఏం జరుగుతుందో తెలియని వైనం! ఒక్క పాత బస్తీలోనే 3,500 మందికి పైగా మన భద్రతా సిబ్బంది వున్నా, డిజిపి లాంటివారు కూడా ఆమె దరిదాపుల్లోకి పోలేని దౌర్భాగ్యం! ఆమె తినే తిండిని (పత్తర్‌కా ఘోష్, షీర్‌ఖుర్మా, హై-బిర్యాని, ధంకా బిర్యాని మొ.) అయిదుగురు సభ్యుల చొప్పునగల మూడు ఫోరెన్సిక్ బృందాల తనిఖీ తర్వాతనే ముట్టుకుంటుంది. ఇక లాడ్‌బజార్‌లోని ఆమె గాజులు కొనే దుకాణంలో యజమాని ఏ స్థాయిలో వుంటాడో ఊహించడం కష్టమే! ఇలా రెండురోజులపాటు ఆమె తిరుగాడే ప్రాంతాన్నంతా వింజామరలతో ఊపి, మనవారు వదిలిన నిశ్వాస గాలిని పూర్తిగా తొలగించేసారు. ఆ రెండు రోజులు మనం గాలి పీలుస్తూ శబ్దం చేయడం కూడా నిషిద్ధమే!
ఈ సందర్భంగా ప్రపంచ స్థాయిలోనే అనేక గ్రేడ్లు కొట్టేస్తున్న మోదీ ప్రొటోకాల్ ప్రకారం ప్రథమ స్థానమే అయినా, ఆమె ముందు నడుస్తాడో, వెనుక నడుస్తాడో చూడాలి. ఆమె ఆశీనురాలయ్యే సందర్భంలో పితుకులాట ఎలా వుంటుందో బుల్లి తెరలమీద వెతుకులాడాల్సిందే! ఇక కెసిఆర్, గవర్నర్ నర్సింహన్ రాణి వెడలే కథలోలాగా కదలాడవచ్చు! పాపం కవిత! ఇవాంకను బతుకమ్మ ఆడిస్తే ప్రపంచ వ్యాపితంగా 170 దేశాల్లో ఆడించిన దానికన్నా ఎక్కువే! ఈ భాగ్యం దక్కుతే మన బతుకమ్మకు, కాదుకాదు కవితకు ఎంత ఘనకీర్తో!
ట్రంప్, మోదీ వాషింగ్‌టన్‌లో చేసుకున్న ఒప్పందం మేరకు జరగబోతున్న ఈ ఎనిమిదవ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జిఇఎస్) హైదరాబాద్‌లో జరగడానికి గల కారణాలు ఆమెరికాకు తప్ప మనవారెవరికి తెలువదు. ట్రంప్ పెట్టమంటే, స్పాన్సర్ ప్రమోట్ చేస్తే మోదీ తలూపడం, కెసిఆర్ చప్పట్లు కొట్టడం తప్ప చేసేదేమీ లేదు. ఊడ్చడం, రంగులు పూయడం, పెయింటింగ్ చేయడంతోపాటు ఖర్చులు మన గోసిగాళ్లవే? ఆదేశాలు మాత్రం అమెరికావి. ఇలా మొదటిరోజు సాయంత్రం జరిగే ప్లీనరీ సెషన్‌తోపాటు, 29, 30వ తేదీలలో జరగబోయే సెషన్స్‌లో పాల్గొనడానికై 150 దేశాల నుంచి 1500 మంది ఔత్సాహికులు పాల్గొనబోతున్నారు. అధికారికంగా ఈ సదస్సును నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నా పెత్తనమంతా అంకుల్ శ్యాందే! బలమైన భారత్-అమెరికా స్నేహం (Strong India-US Friend ship) అనే నినాదంతో బ్రేక్ అవుట్, మాస్టర్ క్లాస్, వర్క్‌షాప్ అనే మూడు రకాల సెషన్స్‌తో, కేవలం ‘ఆర్థికరంగ’ అనే అంశం చుట్టూ తిరిగే నాలుగు అంశాలైన శక్తి, వౌలిక వసతులు(Energy, Infrastructure), డిజిటల్ ఎకానమి, ఫైనాన్షియల్ టెక్నాలజీ ద్వారా ఆరోగ్యం, జీవశాస్త్రం మరియు మీడియా వినోదంపై చర్చలు జరుగుతాయి. అనగా, శక్తివంతమైన మానవ వనరులను తయారు చేసుకోవడం (అమెరికాకు వినియోగపడేలా/ వారి అవసరాల్ని తీర్చేలా..) శిక్షణ, నైపుణ్యాలను అందించడం, కెరీర్ కౌన్సిలింగ్, మహిళల జీవనస్థాయి పెంపు (బొమిడికం-అతుకుల) చీర ధరించి మన కడుపుల్ని నింపుతూ, తాను తిని తినకుండా వుంటున్న దాదాపు 20 కోట్లకుపైగా గల భారతీయ మహిళల పక్షాన ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ చందాకొచ్చర్ ప్రాతినిధ్యం వహిస్తున్నది), ఆయా దేశాల్లో సమాజ స్థితిగతులు, దేశాల రాజకీయ పరిస్థితులు, సైన్సు అండ్ టెక్నాలజీ ద్వారా నెట్ వర్కింగ్, గ్లోబల్ ఇన్నోవేషన్, 28న జరిగే బ్రేక్ అవుట్ సెషన్స్‌లో చర్చకు వస్తాయి. 29న జరిగే మిగతా రెండు సెషన్స్‌లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం (మోదీ, కెసిఆర్, చంద్రబాబు ఎప్పుడో మొదలుపెట్టారు). హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా మీడియా, వినోదం (యువతను నిద్రపుచ్చేలా దోపిడీ చేసుకునేలా) పేరున సినిమాల్ని (చెత్త) నిర్మించడం, సులభ మార్గాల్లో (గ్రీన్ ట్రిబ్యునల్ ముందు సందేహపడి, తర్వాత అనుమతి ఇచ్చే విధానంలా) పరిశ్రమల స్థాపన (ఈ విషయంగా, తెరాస, తెదేపా పడుతున్న పోటీలా), డిజిటల్ విప్లవాన్ని దేశవ్యాపితం చేయడం, అన్ని దేశాల్లో విస్తరింప చేయడం, ఆరోగ్యరంగంలో మరింత టెక్నాలజీని పెంచడం లాంటి సమస్యల్ని చర్చిస్తారు.
ఈ మధ్యనే, అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధనా సంస్థ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) విడుదల చేసిన ప్రపంచ ఆకలి నివేదిక-2017 (జిహెచ్‌ఐ) ప్రకారం 119 దేశాల్లో 31.4 మార్కులతో 100వ స్థానంలో భారత్ వున్న విషయంకాని దీంతో పౌష్టికాహారం లేక 38 శాతం 5 సం.లోపు పిల్లలు ఎదుగుదల లోపంతో వున్న విషయంకాని, ఈ లోపంతో ఇందులో సగం చనిపోతున్న విషయంకాని ఈ సదస్సులో చర్చకు రాదు. కారణం 2013లో రూపొందిన ఆహార భద్రత చట్టం, 1997 నుంచే ప్రారంభమై ప్రజాపంపిణీ వ్యవస్థ, లేదంటే దేశవ్యాపితంగాగల 14 లక్షల అంగన్‌వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని కాదని, ఇలాంటి నివేదికలు ఎప్పుడు తప్పుడు ప్రచారానే్న చేస్తాయి కాబట్టి! అలాగే, ప్రపంచ సంతోషకర నివేదిక-2017 ప్రకారం, 155 దేశాల్లో మన స్థానం 122 కూడా ఈ సదస్సు సందర్భంగా దిగదుడుపే! లేకపోతే, ఎంత సంతోషంగా లేకపోతే, మనం ఈ ప్రపంచస్థాయి సదస్సను ఎలా జరపగలం? సార్క్ దేశాలైన పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలు మనకన్నా ముందుంటేనేం? మన తర్వాత ముప్పయి మూడు దేశాలున్నాయని మురవచ్చు? గత సంవత్సరం దాదాపు 60వేల మంది పురిటిలోనే రోగ నిరోధక మందులు పనిచేయక చనిపోతే ఏమి? మన జిడిపి పెరిగిందిగా? ఆర్థికంగా ఎదుగుతున్నాంగా? (ఎవరు? అనేది అనవసరం). ఈ సంవత్సరపు లింగ వివక్షతను కూడా చూస్తే, 144 దేశాల్లో భారత్ 136వ స్థానంలో వుంది. స్ర్తి పురుషులకు సమాన అవకాశం కల్పించుటలో 139వ స్థానంలో, విద్యా సంబంధమైన అవకాశాల్ని అందించడంలో 112వ స్థానంలో వుండగా, రాజకీయ సాధికారితలో మాత్రం 15వ స్థానంలో వుండడం గొప్ప విషయమే! (భార్యల పేరున పెత్తనం భర్తలు చెలాయించడం..) అన్నింటికన్నా ముఖ్యమైనది, ఆరోగ్యం, జీవన ప్రమాణాల్లో, ఇంతగా రాజకీయ చైతన్యం వున్నా, 141వ స్థానంలో ఎందుకు వున్నామో చర్చకు రాదుకాక రాదు. దాదాపుగా 2006 నుంచి, ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యుఇఎఫ్) ప్రచురిస్తున్న ఈ లింగ వివక్షతలో మన స్థానం ఎందుకు మెరుగుపరచడం లేదో కొచ్చర్ మాత్రమే సదస్సు తర్వాతనన్నా చెప్పగలగాలి.
అన్నింటిని విమర్శించే కొందరు కాలమిస్టులు దేన్ని జీర్ణించుకోలేరని, ఆస్వాదించలేరని, కరుడుగట్టిన శాడిస్టులని, విమర్శించే ఊహాజనిత మేధావులకు ఈ దేశంలో కొదవలేదు. కాంతి పరావర్తనానికి భ్రమించి అంతా ఇంద్రధనస్సే అనుకుంటే, మన దేశం ఇలాగే కొనసాగాలి. బిచ్చగాళ్లు వున్నా, లేనట్లు చూపాలి. వీధి కుక్కుల్ని తరిమివేయాలి. 365 రోజులు ముక్కుపుటాలు మూసుకుని భరించే మురికిని, మూడు రోజులు కానరాకుండా చేయాలి. ఎలుగుబంటిని, కోతుల్ని ఆడించి జీవించేవారు వాటిని ప్రేమతో చూస్తారు. కాని మనదో గంగిరెద్దు జీవితం? శే్వత సౌధంలా మనం మెరవాలి. రంగులు పులుముకోవాలి. ఏ రంగంలో, ఏ దేశం మనకు సాటిరాదని నిరూపించుకోవాలి. అభినవ బిచ్చగాళ్లలా అమెరికాకు మోకరిల్లాలి. వారు ఏ పంట పెట్టమంటే ఆ పంటనే పెట్టాలి. వారు చెప్పినవిధంగానే వ్యవసాయం చేయాలి. వారి అవసరాలకు అనుగుణంగానే మన విద్యావిధానం (ఒకప్పుడు బ్రిటిషు) రూపొందించుకోవాలి. (ఈ డిసెంబర్‌లో కస్తూరి రంగన్ అందివ్వ బోతున్నాడు). పరిశ్రమల్ని స్థాపించాలి. అదీ ప్రైవేట్ రంగంలో! మూయమంటే మూయాలి (ఎన్‌ఎస్‌ఎఫ్‌లా!) గంగా, యమునా, గోదావరి, కృష్ణ, నర్మదలేమి కర్మ, ఇలాంటివి దాదాపు దేశవ్యాపితంగా 400 వున్నా బిస్లరి నీటినే ఆక్సిరిచ్ పేరున కొని తాగాలి. నలుపు మోపు తెలుపు అయితదంటే ట్యూబుల కొద్ది క్రీములను పూసుకోవాలి. కోక్‌ను తాగాలి, బర్గర్లను, పిజ్జాల్ని తినాలి. టైంపాస్‌కై స్మార్ట్ఫోన్లను ముందరేసుకోవాలి. అపరిమితంగా (ఇతర పనులేవి వద్దు) మాట్లాడాలి.
ఇలాంటివాటికి మరికొన్ని జోడింపులతో, తాలింపులతో జరిగే ఈ సదస్సుకు జైకొట్టడమే మన కర్తవ్యం? లేదంటే మీ ఇష్టం? మిగతాది ట్రంప్ మామ చూసుకుంటాడు.

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162