మెయన్ ఫీచర్

ఇది మో‘దిగ్విజయమే’నా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం ఎప్పుడూ విజేత గురించే మాట్లాడుకుంటుంది. కానీ ఇప్పుడు ఓడి గెలిచిన రాహులబ్బాయి గురించీ మాట్లాడుకుంటోంది. అవును. గుజరాత్ ఎన్నికల ఫలితాలు మోదీని మరోసారి ధీరుడిగా నిలబెట్టినా, ఆయనను ఎదుర్కొనేందుకు ఎలాంటి అనుభవం లేని రాహుల్ అనే యువనేత చేసిన పోరాటం కూడా దేశం గుర్తించింది. కేవలం 20 సీట్ల తేడాతో బీజేపీకి చెమటలు పట్టించిన రాహుల్ నాయకత్వ ప్రతిభకు కితాబు ఇవ్వాల్సిందే.
అలాగని అది పూర్తిగా రాహుల్ గొప్పతనమేనని చెప్పలేం. మూడు సామాజికవర్గాలు జూలు విదిలించకపోతే రాహుల్ మరోసారి విఫల నేతగా మిగిలేవారు. ఇప్పుడున్న పరిస్థితిలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా మళ్లీ రెండోసారి అధికారం దక్కడం గొప్పే. అలాంటిది వరసగా ఐదుసార్లు గెలిచి, మళ్లీ ఆరోసారి అధికారం దక్కించుకున్న బీజేపీని తక్కువ చేసి చూడటం సహేతుకం కాదు. పైగా మూడు సామాజికవర్గాల వ్యతిరేకత, వ్యాపారులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో జీఎస్టీ ప్రభావం, సహజంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కలసి వెరసి బీజేపీని నీళ్లు తాగించాయి. అయినా పాసుమార్కులతో గట్టెక్కటం కచ్చితంగా మోదీ మ్యాజిక్కే!
అసలు బీజేపీ ముందు కాంగ్రెస్ మణిహారం మణిశంకరయ్యకు కృతజ్ఞతలు చెప్పాలి. అభినవ శిఖండిగా పేరున్న ఆయన గుజరాత్ కుర్చీని గత పార్లమెంటు ఎన్నికలకు ముందు మాదిరిగానే, ఈసారీ పువ్వుల్లో పెట్టి బీజేపీకి అప్పగించారు. వచ్చిన ఏ అవకాశాన్నీ దుర్వినియోగం చేసుకునే అలవాటు లేని మోదీ-అమిత్ భాయ్ జోడీ, గుజరాత్ ఎన్నికల్లో సరిగ్గా అదే పనిచేసింది.
నిజం చెప్పాలంటే గుజరాత్ విజయం బీజేపీది కాదు. వ్యక్తిగతంగా మోదీదే! దేశానికి ప్రధాని అయినా, ఎన్నికల ముందు వందల కోట్ల వరదానాలు చేసినా, గతంలో చేసిన అభివృద్ధి ప్రచారం చేసుకునే బదులు పాకిస్తాన్‌నూ బరిలోకి తీసుకువచ్చారంటే, మోదీ కష్టం ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.
దేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక ప్రధాని, రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎన్నికల్లో, ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని డజన్ల బహిరంసభల్లో పాల్గొన్న దాఖలాలు ఎప్పుడూ లేవు. నిజంగా తనను చంపేందుకు పాక్ సుపారీ ఇచ్చిన సమాచారం ఉంటే, ఆ విషయాన్ని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? పోనీ సుపారీ తీసుకున్న వారేమైనా పట్టుబడ్డారా? పట్టుబడితే వారిపై ఏమైనా కేసులు పెట్టారా? అసలు ప్రభుత్వం తరఫున ఫిర్యాదేమైనా చేశారా? ఈ విషయాన్ని పాక్ సర్కారు దృష్టికి తీసుకువెళ్లారా? నిజంగా ఒక ప్రధానిని అంతమొందించేందుకు సుపారీ ఇచ్చే పరిస్థితి ఉంటే, సదరు దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఎందుకు దోషిగా నిలబెట్టలేదు? ఇవన్నీ సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలు. కారణం సుస్పష్టం. ఇవన్నీ గుజరాత్ కోసమే కమలమేధావుల మస్తిష్కం నుంచి జాలువారిన ఆలోచనలే కాబట్టి!
సరే. గుజరాత్‌లో సిక్సర్ కొట్టినందుకు మోదీ టీమును అభినందించాల్సిందే. టన్నుల కొద్దీ రన్నులు కొట్టి సచిన్ భారత్‌ను గెలిపించినట్లే, మోదీ పరిస్థితి కూడా ఇక రాను రాను తన పార్టీని ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ గెలిపించే యంత్రంలా మారేలా ఉంది. అందుకు తాను సిద్ధమేనని కూడా ప్రకటించేశారు. కానీ, మోదీ చెప్పినట్లు ఆ ఫలితాలతో జీఎస్టీ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించారనుకుంటే అది భ్రమనే. ఎందుకంటే గుజరాత్ ప్రజలు బీజేపీకి ఇచ్చింది సంపూర్ణ మెజారిటీ కాదు, అత్తెసరు మార్కులే.
సాంకేతికంగా ఎన్నికల్లో గెలుపే ముఖ్యం కాబట్టి నైతిక ముచ్చట్లకు స్థానం ఉండదు. నిజంగా జీఎస్టీ నిర్ణయాన్ని గుజరాత్ ప్రజలు ఆమోదిస్తే నర్మదా, ఆమ్రేలి, తాపి జిల్లాల్లో బీజేపీకి ఎందుకు ఒక్క సీటు కూడా రాలేదు? కాంగ్రెస్ 60 నుంచి 79 సీట్లకు ఎగబాకి, 2.47 శాతం ఓట్లను ఎలా అదనంగా సాధించగలిగింది? ఇవన్నీ పక్కకుపెడితే, మోదీ సొంత నియోజకవర్గమైన ఉంజాలో బీజేపీ అభ్యర్ధి 19,571 ఓట్లతో ఎందుకు ఓడిపోయారు? నిజంగా జీఎస్టీని ఆమోదించినట్టయితే ఇవి జరగకూడదు కదా? ఒక రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన అక్కడి ప్రజలు ఇచ్చిన తీర్పు, మొత్తం దేశప్రజల అభిప్రాయం కాబోదు. రేపు కర్నాటకలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కాలేరుకదా? విజయం ఒదిగేలా చేసి, తప్పులను సరిదిద్దుకునే మార్గదర్శిగా చూడాలే తప్ప, అది మరింత బేఖాతరు పర్వానికి తెరలేపేలా ఉండకూడదు. ఇది ఒక్క మోదీకే కాదు, అందరికీ వర్తించే సూత్రం.
విజయాన్ని ప్రజలు ఒకరకంగా చూస్తే, రాజకీయ నాయకత్వాలు మరో కోణంలో చూస్తాయి. గెలిచిన పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం, అందుకు దారితీసిన కారణాలు, ఏ పరిస్థితిలో గెలిచారన్న కోణంలోనే రాజకీయ నాయకత్వాల విశే్లషణ, భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి. ఇప్పుడు గుజరాత్‌లో బీజేపీ గెలుపు బ్రహ్మాండమా? లేక నామమాత్రమా? దీనితో మోదీ భవిష్యత్తులో నిజంగా బాహుబలి అవుతారా? లేక తమపై ఆధారపడతారా అన్న కోణం ఎన్డీఏ మిత్రుల్లో మొదలయింది. గెలిచినందున అందరూ అభినందించినప్పటికీ, మనసులోకి కోణం మాత్రం భిన్నమన్నది నిర్వివాదం.
నిజానికి గుజరాత్‌లో బీజేపీ, ఆ పార్టీ గెలుపోటములకు తానే బాధ్యుడినన్న మోదీ ఓడాలని కనిపించని దేవుళ్లకు మొక్కుకున్న వారిలో ఎన్డీఏ మిత్రపక్షాలే కాదు, బీజేపీయులూ ఉన్నారన్నది నిష్ఠుర నిజం. అక్కడ పార్టీ ఓడితే మోదీ ఇకనైనా నేల మీద నడిచి, తమ విలువ తెలుసుకుంటారన్న కోరిక అది! తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలయితే ఆ మేరకు గుజరాత్ వెళ్లి మరీ అన్ని రకాల కరసేవ చేశాయని, వారెవరో కూడా తమకు పేర్లతో సహా తెలుసన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో హాట్‌టాపిక్. బీజేపీ ఫైర్‌బ్రాండ్ సోము వీర్రాజు కూడా తమ పార్టీపై కుట్ర జరిగిందన్న బాంబు పేల్చారు. మరి నిజం నారాయణుడికెరుక!
గుజరాత్ ఫలితాల తర్వాత భవిష్యత్తులో బీజేపీ మరింత కష్టపడక తప్పదు. మిత్రపక్షాలతో కలసి వెళ్లకా తప్పదన్న సంకేతాలు సుస్పష్టం. మోదీ జోడీ తర్వాత అడుగు కర్నాటక. అక్కడ గత ఏడాది వరకూ బీజేపీ పవనాలు స్పష్టంగా కనిపించాయి. కానీ ఇప్పుడది కాంగ్రెస్ వైపు బలంగా మళ్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అకాలీదళ్, శివసేన వంటి మిత్రపక్షాలయితే బీజేపీపై బహిరంగంగానే బుసలుకొడుతున్నాయి. శివసేన ఓ అడుగుముందుకేసి, గెలిచిన మోదీని కాకుండా ఓడిన రాహుల్‌ను ఆకాశానికెత్తేసింది.
రాష్ట్రంలో ఉన్న అవసరాల దృష్ట్యా చంద్రబాబు ఆ విజయంపై లోతైన విశే్లషణ జోలికి పోకుండా, అభినందన మందారమాల వేశారు. కేంద్ర వైఖరిపై ఆయన కూడా ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఇప్పటికయితే వేచిచూడటమే తప్ప, ధైర్యంగా ముందుకు వెళ్లలేని సంకట స్థితి. అటు బీజేపీ కూడా బాబుకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. మిత్రపక్షం కాకపోయినా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో బీజేపీకి యుద్ధం మొదలయినట్లే. దీన్నిబట్టి ఎన్డీఏ మిత్రపక్షాలేవీ బీజేపీని నమ్మకమైన మిత్రుడిగా భావించే పరిస్థితి కనిపించడం లేదు. తానే అందరినీ నయాన, భయాన ఒప్పించి రుద్దిన జీఎస్టీ నిర్ణయం, తానొక్కడిదే కాదని అందరిదీ అని చెప్పినప్పుడే బీజేపీ విశ్వాసం కోల్పోయింది. ఈ క్రమంలో మోదీ గుజరాత్‌లో తనకు మాత్రమే తెలిసిన ‘నిజమైన ఫలితాల’ కారణాల నేపథ్యంలో తన వైఖరి మార్చుకుంటారా? లేక మరింత కఠినంగా వెళతారా? అన్నది చూడాలి.
* * *
ప్రపంచ తెలుగు మహాసభలను దిగ్విజయంగా నడిపించిన కేసీఆర్ సర్కారుకు అభినందనలు అందడంలో ఆశ్చర్యం లేదు. ఆయన ఆ ప్రశంసలకు అర్హుడే. తెలుగుజాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఎన్టీఆర్ పేరుతోపాటు, తెలంగాణలో తెలుగు సాహిత్యం, కళలకు సేవచేసిన వారికి గౌరవం దక్కలేదన్న అపవాదూ కొట్టిపారేయలేం. ఏదేమైనా ఈ సభల స్ఫూర్తిని అక్కడితో ఆర్పివేయకుండా మరింత ఉత్సాహంతో కొనసాగిస్తామన్న కేసీఆర్ పట్టుదల మెచ్చదగిందే.
అయితే, మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడును పిలవకపోవడం జరిగిన చర్చ, అందుకు ఇద్దరు చంద్రులకూ ఆస్థాన సలహాదారులుగా ఉన్న మీడియామారాజులు, తెరపైకి తీసుకువచ్చిన తర్కమే వెగటు. అవసరాలకు అబద్ధాలాడవచ్చని సత్యహరిశ్చంద్రుడే చెప్పారు. కానీ ఇప్పుడు అసలు ఆత్మాభిమానమే వదిలేసి చేస్తున్న అడ్డగోలు భజన బాధాకరం. కేసీఆర్, బాబు సన్నిహితుడితో మాట్లాడి ఆయన వెసులుబాటు కనుక్కున్నారని, సభలకు చివరి రోజు రమ్మని పిలిచినప్పటికీ, అంతకంటే ముందుగా విదేశీ పర్యటన ఖరారు చేసుకున్నందున తాను రాలేనని బాబుగారు చెప్పినట్లు, సభలకు రాలేకపోయినా రెండు రాష్ట్రాలు కలసి ఉంటున్నాయనే వండివార్చిన కథనాలపై, జనస్పందన ఎంత వెటకారంగా ఉందో సోషల్‌మీడియాలో సాగుతున్న ముచ్చట్లు చాలు. అయితే, బాబుగారితో మాట్లాడిన ఆ సన్నిహితుడెవరు? ఆ పాత్రపోషించిన ఉమ్మడి రాయబారి కూడా ఎవరని సెలవిచ్చి ఉంటే బాగుండేది.
కాసేపు అదే నిజమనుకుందాం. మరి బాబు గారు తనను సభలకు పిలవకపోయినా రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని వ్యాఖ్యానించరు కదా? బాబును పిలవాలని గాలి ముద్దుకృష్ణమ, రావుల అండ్ అదర్స్ ఎందుకు డిమాండ్ చేశారు? అంటే సొంత పార్టీ వారికీ తెలియని రహస్యాలు, ఒక్క ఉమ్మడి రాయబారికే తెలుస్తున్నాయని తమ్ముళ్లు భావించాలేమో?
తెలివంటే సినిమావాళ్లదే. పాలకులు చెవులారా ఆస్వాదించే భజన ఈ మహాసభల్లో దర్శించాం. మాయాబజార్‌లో మాదిరిగా ఏపీ చంద్రుడికి ఒక వీరతాడు, తెలంగాణ చంద్రుడికి ఇంకో వీరతాడు వేసి, ఎక్కడి పనులు అక్కడ చేసుకుని, లోకల్‌గా ఉంటున్నందున తెలంగాణ చంద్రుడికి బిరుదులిచ్చిన సినిమావాళ్ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ ముందు మూడు శ్రీల రవిశంకర్ దిగదుడుపే. అన్నట్లు తమ సీఎంను పిలవని పేరంటానికి తాను రావడం సంస్కారం కాదన్న గరికపాటి గొప్పవాడా? వేదికెక్కి పొగిడిన బాబు బావమరిది బాలయ్య గొప్పవాడా?

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144