రాష్ట్రీయం

నక్సల్స్ లక్ష్యం ఎటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 25: వర్గశత్రు నిర్మూలన దృక్పథంతో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సైద్ధాంతిక పునాదిపై నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆత్మరక్షణలో పడింది. భూ స్వామ్య..పెత్తందారీ..పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలతో పీడిత ప్రజలను జాగృతం చేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు నడిపే దశకు చేరుకున్న ఉద్యమం ఇప్పుడు చుక్కాని లేని నావలా పయనిస్తోంది. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన తుపాకీ లక్ష్యమేమిటో అంతుచిక్కని పరిస్థితులు పార్టీలో నెలకొన్నాయి. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా సైద్ధాంతిక భావజాలంతో ఉప్పెనలా ఎగిసిపడిన మావోయిస్టు ఉద్యమం పతనావస్థకు చేరుకోవటానికి ప్రాపంచిక పరిణామాలతో పాటు అంతర్గత కుమ్ములాటలు..కోవర్ట్ ఆపరేషన్లు.. గ్రీన్‌హంట్.. సొంత తప్పిదాలు వెరసి మావోయిస్టు ఉద్యమానికి ప్రతిబంధకాలుగా మారాయి. కమ్యూనిస్టు పార్టీలో అతివాదుల సారథ్యంలో సీపీఐ (ఎంఎల్)గా ఆవిర్భవించి, ఆపై తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుందనే వాదంలోంచి పీపుల్స్‌వార్ పార్టీ పుట్టుకొచ్చింది. తొలినాళ్లలో అనుబంధ సంఘాలు అన్నిరంగాల్లో విప్లవ బీజాలు నాటాయి. ఉత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, శ్రీకాకుళం ఉద్యమాల స్ఫూర్తితో మహత్తర పోరాటాలు నడిచాయి. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యూత్‌లీగ్, రైతుకూలీ సంఘం, ప్రగతి మహిళా వేదిక లాంటి అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలను ఉద్యమంలో మమేకం చేశాయి. వీటికి వెన్నుదన్నుగా పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘాలు సాంస్కృతిక, కళా రంగాలతో పాటు హక్కుల సాధనకు మేధావులు కలిసొచ్చి పీడితప్రజల పక్షాన నిలిచారు. ఈ క్రమంలో విప్లవోద్యమం పరిణితి చెందింది. తరువాతి కాలంలో అనేక వాదాలు తెరపైకి వచ్చాయి. దళిత, స్ర్తివాద ఉద్యమాలు వెల్లువలా సాగాయి. సైద్ధాంతికంగా పోస్టుమోడర్నిజం లాంటివి పుట్టుకొచ్చాయి. అతివాద, మితవాద పోకడల నేపథ్యంలో ప్రజాసంఘాల్లో కూడా చీలికలొచ్చాయి. పౌరహక్కుల సంఘం నుంచి మానవ హక్కుల వేదిక ఇలా మేధావులపరంగా అనేక వాదాలతో ఒకరకంగా విప్లవోద్యమం పక్కదారి పట్టిందనే వాదనలు లేకపోలేదు. మరోవైపు పార్టీలో కొంతమంది పెడధోరణి కారణంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దళిత ఉద్యమాలను ఓవైపు సమర్థిస్తూనే మరోవైపు అడవుల్లో ఆదివాసీ, గిరిజన ఉద్యమ దిశగా విప్లవోద్యమం పంథా మార్చుకుంది. దండకారణ్యం, చత్తీస్‌గఢ్, బీహార్-జార్ఖండ్, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏఓబీలో ఆదివాసీ హక్కుల ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చింది. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. అటు పోలీసు, ఇటు మావోయిస్టుల తుపాకీ కాల్పుల మోతలతో నల్లమల, దండకారణ్య, ఏఓబీ, చత్తీస్‌గఢ్ అటవీ గ్రామాలు తల్లడిల్లాయి. ఇన్‌ఫార్మర్లనే నెపంతో మావోయిస్టులు, సానుభూతిపరులనే భావనతో పోలీసులు ఆదివాసీలపై విరుచుకుపడటంతో అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి అశనిపాతంలా మారింది. మావోయిస్టులలో కూడా హింసాత్మక ధోరణులు పెరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన ఘటన దగ్గర నుంచి ఇటీవల కాలంలో బస్తర్, దంతేవాడ జిల్లాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే స్థాయికి చేరింది. ప్రధానంగా పోలీసులు ఎదురుపడితే మావోయిస్టులు..మావోలు ఎదురైతే పోలీసులు కాల్పులు జరుపుకోవటం మినహా సైద్ధాంతిక భావజాలం అటకెక్కింది. తుపాకీ మాత్రమే భుజానకెక్కింది. అడపాదడపా అనుకోని సంఘటనలు జరుగుతున్నా దానివల్ల జనజీవనానికి అంతరాయం కలుగుతోందనే విమర్శతో పౌరహక్కుల సంఘాలు కూడా దూరంగా ఉంటున్నాయి. అనుబంధ సంఘాలు కనుమరుగయ్యాయి. గిరిజన, ఆదివాసీ యువత కూడా పరిమిత సంఖ్యలోనే పార్టీకి ఆకర్షితులవుతున్నారు. దీనికితోడు గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో కొంతవరకు వౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి
సారించాయి. ఎన్నికల్లో గెలుపే ప్రధాన అజెండాగా భావించిన కాంగ్రెస్ పార్టీ 2004 సార్వత్రిక ఎన్నికల్లో మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల కోణంలో కాకుండా సామాజిక, ఆర్థిక దృక్పథంతో పరిగణిస్తామని చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. అయితే కాల్పుల విరమణ షరతు విధించింది. దీనిపై మావోయిస్టులు ఆచితూచి అడుగేసి ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలకు సై అన్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి చర్చల నిమిత్తం బాహ్యప్రపంచంలోకి అడుగిడారు. ఐదు నెలలు శాంతియుత వాతావరణం నెలకొంది. చర్చలు బెడిసికొట్టాయి. పరిస్థితి యథాతథంగా మారింది. అప్పటికే స్థావరాలు తెలుసుకున్న పోలీసు వర్గాలు
నల్లమల ప్రాంతంలో జల్లెడ పట్టడం పాటు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ముఖ్యనేతలతో పాటు క్యాడర్ అంతా ఏఓబీ, దండకారణ్యం, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వలసవెళ్లారు. చత్తీస్‌గఢ్‌లో మారణహోమం నేపథ్యంలో స్వయానా 2011 జూన్ 24న ఆ ప్రాంతానికి అధికారిక పర్యటనకు వచ్చిన అప్పటి రాష్టప్రతి ప్రతిభా పాటిల్ మావోయిస్టులను శాంతిచర్చలకు ఆహ్వానించి జనజీవనస్రవంతిలో కలవాలని పిలుపునిచ్చి గిరిజన, ఆదివాసీల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. అయితే దీనిపై మావోయిస్టు పార్టీలో చర్చ జరిగిన అనంతరం కేంద్ర కమిటీ వ్యతిరేకిస్తూ లేఖ రాసింది. శాంతి చర్చల ప్రతిపాదనకు ముందు ప్రభుత్వం ప్రజలపై సాగిస్తున్న యుద్ధం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేయాలని, బస్తర్‌లో సైనిక శిక్షణ ఆపాలని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నింటి నుండి సైన్యం, అర్ధ సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అభివృద్ధిపై మాట్లాడే ముందు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు మధ్య జరుగుతున్న ఒప్పందాలన్నీ రద్దుచేయాలని, బలవంతంగా భూములు లాక్కునే ప్రాజెక్టులన్నింటినీ ఆపాలని, తమకెలాంటి అభివృద్ధి అవసరమో తేల్చుకునే హక్కు ప్రజలకు కల్పించాలని ప్రతిపాదించింది. మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో కలిసేముందు ప్రభుత్వం అవినీతి-కుంభకోణాలకు పాల్పడే వారందరినీ అరెస్టు చేసి శిక్షించాలని, విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువచ్చి అక్రమార్జనలో దోషులైన నాయకులను పదవుల నుంచి తప్పించి బహిరంగంగా శిక్షించాలనే వాదన ముందుకు తెచ్చింది. అమెరికన్ సామ్రాజ్యవాద పోకడలలో భాగంగానే అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయటం ద్వారా ఆదివాసీల బతుకుల్లో చీకటి నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం చేసింది. దీంతో ప్రభుత్వం నిర్బంధం పెంచింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌లో మావోలు మూల్యం చెల్లించుకుని దారులు వెతుక్కునే పరిస్థితులు నెలకొన్నాయి. ఒకానొకప్పుడు ఒక మిలిటెంట్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందితే వచ్చిన ప్రజాస్పందన 55 మంది ఎన్‌కౌంటర్‌లో హతమై సబర్మతినదిలో కొట్టుకుపోతున్నా, ఏఓబీలో 35 మంది మృత్యువడికి చేరినా స్పందించే పరిస్థితులులేవు. ఈ పరిస్థితుల్లో ఉద్యమానికి ఊపిరిలూదే ఉద్దేశ్యంతో తాత్కాలిక ప్రజాందోళనలకు నాయకత్వం వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి భూ సేకరణ వ్యతిరేక పోరాట కమిటీలతో పాటు ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు దళితులపై దాడి ఘటన, రాపూరు వంటి సంఘటనలపై ఉద్యమాలు నిర్వహించినప్పటికీ వాటికి రాజకీయ రంగు పులుముకోవటంతో ఉనికిని చాటుకోలేక పోయింది. కొరేగావ్ భీమా, తూత్తుకుడి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు తదనంతర రాజకీయ పరిణామాలు, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న బస్తర్, సుకుమా లాంటి ప్రాంతాలపై భద్రతా బలగాలు సాధిస్తున్న పైచేయిగా మారడంతో పార్టీశ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. దురదృష్టకరంగా జరిగిన తూత్తుకుడి ఘటనలో అటు పోలీసు, ఇటు మావోయిస్టులు ఇరువర్గాలు దోషులనే భావన వ్యక్తమవుతోంది. కాగా, ప్రతిహింసకు స్వస్తిచెప్పి నేపాల్ తరహాలో జనజీవనస్రవంతిలో కలసి ప్రజల్లోకి వెళితే ఎలా ఉంటుందనే విషయమై పార్టీలో చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి చర్చల అనంతరం నేపాల్‌లో జరిగిన ఎన్నికల్లో మావోయిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. దీనిని సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా స్వాగతించింది. పీడిత ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, సామ్రాజ్యవాద శక్తులపై ప్రతీకారంగానే నేపాల్ ప్రజలు తీర్పునిచ్చారని ఉటంకించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆజాద్ సైతం 2008 మే 10వ తేదీన మీడియాకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అంతమొందించటమే తమ లక్ష్యమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి బలగాలను మోహరించడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ సామాగ్రిని అందజేస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ లక్ష్యమెటో తేల్చుకోవాల్సి సమయం ఆసన్నమైందనేది సుస్పష్టం.