రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లో రచ్చరచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 24: మండల పరిషత్ ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులపై విజయం సాధించిన నేతలు ఆనక టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయా మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను అధిష్టానం స్థానిక శాసనసభ్యులకే అప్పగించటంతో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని సదరు శాసనసభ్యులు దగ్గరకు రానివ్వటం లేదు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా పనిచేసిన వారికి ఎంపీటీసీ, జడ్పీటీసీ బీ-్ఫరాలు అందిస్తున్నారు. దీంతో మొదటి నుండి టీఆర్‌ఎస్‌లో పనిచేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ నేతల ప్రమేయం లేకుండా శాసనసభ్యులే అభ్యర్థులను ఎంపిక చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో పాలేరు, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్గానికి, తాజా ఎమ్మెల్యే చేతిలో ఓటమి పాలైన టీఆర్‌ఎస్ నేత వర్గానికి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తమను కాదని ఎమ్మెల్యేలు ఇతరులకు టిక్కెట్టు ఇస్తే తాము మద్దతు ఇవ్వబోమని పార్టీలోని ప్రత్యర్థులు తెగేసి చెబుతున్నారు. మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల్లో అనేకచోట్ల రెబల్ అభ్యర్థులుగా కొందరు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. తాము మొదటి నుండి టీఆర్‌ఎస్‌లో ఉన్నామని, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశామని, ఇప్పుడు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారు తమపై ఆధిపత్యం చెలాయిస్తూ పార్టీ పదవులను దక్కించుకుంటే తామేం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సరైన న్యాయం జరగకపోతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ప్రధాన నేతలు జోక్యం చేసుకొని తమను పోటీ నుండి తప్పించే ప్రయత్నం చేసినా అంగీకరించమని, పోటీలోనే ఉంటామని పలువురు జడ్పీటీసీ అభ్యర్థులు స్పష్టం చేశారు. వీరికి ఇతర పార్టీలు మద్దతు పలకటం విశేషం. ప్రస్తుతం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను బట్టి ప్రతి గ్రామంలోనూ టీఆర్‌ఎస్ రెండు, మూడు వర్గాలుగా విడిపోయింది. అందరినీ సమన్వయం చేసి ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నించిన నేతలకు గ్రామ నాయకుల నుండి తిరస్కారం ఎదురుకావటంతో రాష్ట్ర పార్టీకి నివేదిక అందించినట్టు తెలిసింది.