రాష్ట్రీయం

ముత్తంశెట్టికి బాబు చీవాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదంటూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాసిన లేఖను పత్రికలకు లీక్ చేసిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్‌రావుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. జయంత్ సిన్హా రాసిన ఉత్తరాన్ని లీక్ చేయడం వల్ల టిడిపి, ప్రభుత్వానికి నష్టం జరిగిందే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని సిఎం అభిప్రాయపడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి బుధవారం ఉదయం తమ నివాసంలో జరిపిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే జయంత్ సిన్హా రాసిన లేఖను పత్రికలకు వెళ్లడించవద్దని సూచించినట్లు తెలిసింది. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకోవటంలో జాప్యం చేయటంపై చర్చ జరిగినప్పుడు పలువురు ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం వ్యవహారాన్ని ప్రజల ముందు పెట్టాలని వారంతా డిమాండ్ చేశారు. అయితే సుజనా చౌదరి వారికి నచ్చచెబుతూ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడినట్లు తెలిసింది.
అయితే జయంత్ సిన్హా రాసిన ఉత్తరం బుధవారం మధ్యాహ్నానికే పత్రికలకు చేరిపోయింది. సిన్హా లేఖను మీడియాకు లీక్ చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇక మీదట బిజెపితో పెద్దగా ఘర్షణ వైఖరి వద్దని సూచించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా జాప్యం చేస్తున్న విషయం వాస్తవమే అయినప్పటికీ ఇప్పుడే బయటపడి గొడవ చేయటం సరి కాదని చంద్రబాబు అన్నట్టు చెబుతున్నారు. బాబు ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లోనూ బిజెపికి దూరమవుతున్నామనే అభిప్రాయం కలిగించకూడదని హితవుచెప్పినట్టు తెలిసింది. రాష్ట్భ్రావృద్ధి కోసం ఎన్‌డిఏ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసి అవసరం ఉన్నందున తొందర పడి, విమర్శలు చేయొద్దని అధినేత సలహా ఇచ్చారంటున్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వంతో ఇప్పటి నుండే గొడవ పెట్టుకుంటే రాష్ట్రానికి అందాల్సిన నిధులు కూడా రాకుండాపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంపీలు రాష్ట్ర సమస్యలను ప్రస్తావించటంతోపాటు కేంద్రం నుంచి నిధులు సంపాదించేందుకు కృషి చేయాలేగానీ తొందర పడి విమర్శలకు దిగొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం లోక్‌సభలోబడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొంటూ ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించడం బిజెపిలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా మేరకే జయదేవ్ ఎన్‌డిఏపై విరుచుకుపడి ఉంటారని బిజెపి జాతీయ నాయకులు భావిస్తున్నారు. ‘తెలుగుదేశం అధినాయకత్వం 2018 వరకు బిజెపితో కలిసి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటుంది’అని వారు అంటున్నారు. బాబు 2018 వరకు కేంద్రం నుంచి తీసుకోవలసిన అర్థిక సహాయాన్నంతా తీసుకుంటారని వారు భావిస్తున్నారు. బిజెపితో ఇప్పుడిప్పుడే సంబంధాలు తెంచుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందదనేది ముఖ్యమంత్రికి బాగా తెలుసునని వారంటున్నారు.