రాష్ట్రీయం

జనం ఫుల్... రిజర్వేషన్ నిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 27: సం క్రాంతి పండుగకు పల్లెపిలుస్తోంది. సొంతఊరికి వెళ్లాలన్న తహతహ జనంలో పెరుగుతోంది. ఆంధ్రలో సంక్రాంతిని పెద్దపండుగగా ఆచరిస్తారు. చాలామంది తప్పనిసరిగా సొంత ఊరికి వెళతారు. భాగ్యనగరంతో సహా వివిధ ప్రాంతాలలో ఉన్నవారు తమతమ ఊళ్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. అయితే రైళ్లలో రిజర్వేషన్లు దొరకడం లేదు. ఇప్పటికే చాంతాడంత పొడుగున వెయిట్‌లిస్ట్ దర్శనమిస్తోంది. చాలారైళ్లలో పండుగకు ముందు వారం వరకు రిజర్వేషన్‌లు పూర్తయిపోయాయి. రద్దీఎక్కువగా ఉండే రూట్లలో రైళ్లలో రిజర్వేషన్ రిగ్రెట్ స్థాయికి చేరిపోయింది. మరోవైపు ఆర్టీసి బస్సుల్లోనూ అదే పరిస్థితి. పండుగ స్పెషల్ అంటూ అదనపు ఛార్జీల బాదుడు వ్యవహారం ప్రయాణికులను భయపెడుతోంది. రిజర్వేషన్లు దొరక్కపోతే ఏం చేయాలి, పండుగకు ఎలా వెళ్లాలన్న ఆందోళనతో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.
అన్ని రైళ్లలో అదే పరిస్థితి...
కోస్తాంధ్ర, రాయలసీమకు వెళ్లే ఏ రైలులోనైనా రిజర్వేషన్‌కోసం వెతికినా ఇదే పరిస్థితి. సంక్రాంతికి నాలుగు నెలల కిందటే రిజర్వేషన్ చేసుకున్న వారికి ఫర్వాలేదు. కానీ మెజార్టీ ప్రయాణీకులు మాత్రం పండుగ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రయాణాలు ఖరారు చేసుకుంటారు. కానీ ఇప్పుడు బెర్తులు దొరకడం లేదు. రైలు టిక్కెట్లు దొరక్క ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు.
అందుబాటులో ఉన్న రైల్వే సమాచారాన్ని పరిశీలిస్తే విశాఖ, కాకినాడ, నరసాపూర్, తిరుపతి, నెల్లూరు గమ్యస్థానాలకు వెళ్లే వారికి భారీ వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో అయితే ‘రిగ్రెట్’ స్థాయికి చేరుకుంది. నిత్యం రద్దీగా ఉండే గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు జనవరి 12, 13 తేదీల్లో 400 వెయిటింగ్ లిస్ట్ దాటిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 8 నుంచి 14 వరకు రిజర్వేషన్ టిక్కెట్‌కోసం ప్రయత్నిస్తే ‘రిగ్రెట్’ అన్న సమాధానం వస్తోంది. కోణార్క్, ఈస్ట్‌కోస్ట్ వంటి దూరప్రాంత సర్వీసులు సైతం 12 నుంచి 14 వరకు అదే పరిస్థితి. ఈస్ట్‌కోస్ట్, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లలో 10 నుంచి 14 వరకు అంతే. నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ పరిస్థితి చెప్పనక్కర్లేదు. 12 నుంచి 14 వరకు రిగ్రెట్ చూపిస్తుంటే, 13న 401 వెయిటింగ్ లిస్ట్ ఉంది. తిరుపతి వైపు వెళ్లే నారాయణాద్రి, పద్మావతి, కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లు సైతం 151 వెయిటింగ్ లిస్ట్ దాటిపోయాయి. బెర్తులు దొరకని రైళ్ల పరిస్థితి ఇలావుంటే, కూర్చుని వె ళ్లే సెకండ్ సిట్టింగ్ (ఎస్‌ఎస్) తరగతి రైళ్లు కృష్ణా ఎక్స్‌ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ 50 దాటింది. జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 8 నుంచి 10 వరకు 62 వెయిటింగ్ లిస్ట్ దాటితే, 10 నుంచి 14 వరకు రిగ్రెట్‌లోకి వెళ్లింది. శాతవాహన 12, 13 తేదీల్లో వెయిటింగ్ లిస్ట్ 86కి పైగానే ఉంది. ఇలా దాదాపు అన్ని రైళ్లు భారీ వెయిటింగ్ లిస్ట్ చూపిస్తున్నాయి.
స్పెషల్ రైళ్లు ఏవీ..
పరిస్థితి ఇలా ఉంటే దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇంకా ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు. దీంతో ప్రత్యేక రైళ్ల ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియక, ప్రయాణానికి వెళ్లాలా వద్దా అని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. విశాఖ, కాకినాడ, నరసాపూర్, తిరుపతి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రతిఏడాది ప్రకటించడం జరుగుతోంది. కానీ ఈసారి ఇంకా ప్రకటించకపోవడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని ప్రయాణీకులు వాపోతున్నారు. రైల్వే వర్గాల సమాచారం మేరకు మాత్రం ప్రత్యేక రైళ్ల ప్రకటన పండుగ కొంచెం ముందు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఆర్టీసి బాదుడు భరించలేం..
రైళ్లలో రిజర్వేషన్లు కష్టమని తేలిపోయింది. పోనీ ఆర్టీసిని నమ్ముకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుందామా అనుకుంటే ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయడంతో మోయలేని భారంగా మారుతోంది. పిల్లలతో కలిసి బస్సు ప్రయాణం నరకమని భావిస్తుంటే, చార్జీల మోత భయపెడుతోంది. సంక్రాంతి తేదీలకు సరిగ్గా రెండు నెలల ముందే అన్ని రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ బుక్ చేసుకోవడంతో ఈ రద్దీ ఏర్పడింది. ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రకటిస్తే తమ ప్రయాణాన్ని ఖరారు చేసుకోవచ్చని భావిస్తున్నారు. దగ్గరకు వచ్చేసరికి వెళ్లాలంటే టిక్కెట్ పరిస్థితి ఏమిటో తేలక నానా యాతనకు గురవుతున్నారు. హైదరాబాద్ నగరం నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలి వెళతారు. ఇలాంటి పరిస్థితిలో రైల్వే శాఖ వీలైనన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించి పండుగకు వెళ్లే వారికి ప్రయాణ భరోసా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.