ఆంధ్రప్రదేశ్‌

పవన్.. టార్గెట్ వెంకయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గత కొద్దినెలల నుంచి రాష్ట్రంలో వరసగా నిర్వహిస్తోన్న సభల లక్ష్యమేమిటన్నది అనంతరపురం బహిరంగసభతో తేలిపోయింది. ఆయన లక్ష్యం కేంద్రమంత్రి, రాష్ట్రంలో బిజెపికి కర్త, కర్మ , క్రియగా ఉన్న వెంకయ్యనాయుడునేనన్న విషయం తేలిపోయంది. ఇది బిజెపిలోని వెంకయ్య వ్యతిరేక వర్గానికి ఆనందం కలిగిస్తుండగా, తెదేపాలోని ఆయన అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. ఈ సభతో తన రాజకీయ అరంగేట్రం ఎప్పుడన్నది స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించేశారు. పవన్ ఇప్పటివరకూ నిర్వహించిన అన్ని సభల్లోనూ పార్టీపరంగా బిజెపిని కొంతమేరకు, వ్యక్తిగతంగా వెంకయ్యనాయుడు మీద ప్రధానంగా మాటల దాడి చేశారు. వెంకయ్యనాయుడుకు ఇటీవలి కాలంలో జరుగుతున్న సన్మానాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలతో కూడిన వ్యంగ్యాస్త్రాలు సంధించటం బట్టి, పవన్ లక్ష్యం బిజెపి కాదని, వెంకయ్యనాయుడు మాత్రమేనన్న విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రాంతాల వారీగా సభలు నిర్వహిస్తున్న పవన్ ఇప్పటివరకూ కేంద్రాన్ని, బిజెపిని మాత్రమే విమర్శిస్తూ వచ్చారు. కేంద్రం ఏపి ప్రజలను మోసం చేస్తోందని, ప్యాకేజీ పాచిపోయిన లడ్డు అని గతంలో విరుచుకుపడ్డారు. వెంకయ్యకు ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శరపరంపరగా జరుగుతున్న సన్మానాలను లక్ష్యంగా చేసుకుని పవన్ తాజాగా విమర్శనాస్త్రాలు సంధించడం గమనార్హం. ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారు? అహో ఆంధ్రభోజా అని ఎలా సన్మానాలు చేస్తారని, చంద్రబాబు కూడా సన్మానాలు ఎలా చేస్తారని ప్రశ్నించడం ద్వారా విమర్శల దాడి కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు. ప్యాకేజీపై ఇచ్చిన నిధులపై జైట్లీ-వెంకయ్య చెప్పిన అంకెలనూ ఎత్తిచూపారు. వెంకయ్యను సమర్థిస్తోన్న బాబుపైనా చురకులు అంటించారు. ప్యాకేజీని బాబు ఎలా స్వాగతిస్తారని, లోపాలున్న ప్యాకేజీని తెదేపా ఎలా మెచ్చుకుంటుందని ప్రశ్నించారు. ఆనంతపురంలో ప్రభుత్వం నిర్వహించిన రెయిన్‌గన్ల వల్ల ఉపయోగం లేదన్నట్లు మాట్లాడారు. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే కూలదోస్తామని హెచ్చరించిన పవన్, మళ్లీ విచిత్రంగా మోదీ సరైన దిశలో తీసుకువెళ్లగలరన్న నమ్మకం ఉందని వ్యాఖ్యానించడం, మోదీ తీసుకున్న ప్యాకేజీ నిర్ణయంలో ఆయనను విమర్శించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పవన్ ప్రసంగశైలి నిశితంగా పరిశీలిస్తే, ఆయన లక్ష్యం బిజెపి కాకుండా కేవలం వెంకయ్యనాయుడు మాత్రమేనన్న విషయం స్పష్టమయిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కాగా కొనే్నళ్ల నుంచి ఏపి బిజెపి వెంకయ్య కనుసన్నులలో ఉండటం, ఒకే వర్గానికి ప్రాధాన్యం లభిస్తుండటంతో మిగిలిన సామాజికవర్గాలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రిపై పవన్ కొనసాగిస్తోన్న మాటల దాడి వారిని సంతోషపెట్టింది. దీంతో వెంకయ్యపై పవన్ చేసిన విమర్శలను రేపు ఎవరు ఖండిస్తారో, ఎవరు ఎదురుదాడి చేస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
తాజా పరిణామాలను బట్టి చూస్తే పవన్ విమర్శలను బిజెపిలోని కాపు నేతలు ఖండిస్తారా? కమ్మ సామాజికవర్గ నేతలు ఎదురుదాడి చేస్తారా? చూడాలని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా మాత్రం పవన్ వ్యాఖ్యలను తమ ప్రభుత్వం, పార్టీ గౌరవించి పరిగణనలోకి తీసుకుంటుందని మాత్రం వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దనోట్ల రద్దుపై చర్చ జరుగుతుండగా జనసేన చీఫ్ దాన్ని ప్రస్తావించనేలేదు.