రాష్ట్రీయం

ఆంధ్ర సోదరులనడం ఓట్ల కోసమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: ఓట్ల కోసమే ఆంధ్ర సోదరులంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆంధ్ర వారిపై ద్వేషభావం ప్రదర్శించారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆంధ్ర వంకతో బిసి జాబితానుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరుస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై సిబిఐ కేసు ఉన్నందుకే యాగానికి ప్రధాని హాజరు కాలేదని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడ్ని రంగంలోకి దించారని అన్నారు.
గత పాలకులు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేదని, తాము వస్తే అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాంతాలుగా విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని తమ పార్టీ నాయకులు మాట్లాడితే మంత్రి కెటిఆర్ అప్పట్లో తమను దద్దమ్మలని విమర్శించారని ఆయన గుర్తు చేశారు. 18 నెలల కాలంలో ఆంధ్రా వారిపై దాడి జరగలేదని మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలను మూటగట్టి ఆంధ్రాకు పంపిస్తామని అన్నారని, ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉండదని వ్యాఖ్యానించలేదా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి కెటిఆర్‌కు దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.