సబ్ ఫీచర్
ఉద్దీపనలే కాదు.. కఠిన చర్యలూ అవసరమే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తాజా ఆర్థిక మాంద్యంతో కార్పొరేట్, వాహన రంగాల డిమాండ్ల మేరకు కేంద్రం భారీగా ఉద్దీపన పథకాలను ప్రకటించింది. ఏ రంగంలోనైనా వినియోగం గరిష్టస్థాయికి చేరి, అటు పిమ్మట నెమ్మదించటం సహజం. వాహనాల వినియోగం విషయానికొస్తే, ఇప్పటికే మన ప్రజల స్థాయి, అవసరాలను మించి చౌక రుణాలతో వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. మనది అధిక జనసాంద్రత కలిగిన దేశం. సరిగా డ్రైవింగ్ రానివారు, మైనర్లు సైతం వాహనాలను నడపడంతో ఏటా వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. పెరుగుతున్న వాహన వినియోగం, ట్రాఫిక్, కాలుష్యాలతో ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీరని హాని జరుగుతోంది. తమ ఉత్పత్తులకు డిమాండు తగ్గి నష్టాలొస్తే కార్పొరేటు సంస్థలు తమ ఉద్యోగుల జీతభత్యాలు, ఓవర్టైమ్ అలవెన్స్లు, ఉన్నత స్థానాలలో ఉన్నవారికి పారితోషికాలు, వృధాఖర్చులు వంటివి సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. అంతేగాని ప్రభుత్వ రాయితీలు, చౌక రుణాలతో సమస్య పరిష్కారం కాదు.
హాలెండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ వంటి ధనిక యూరోపియన్ దేశాల్లో మంత్రులు, కోటీశ్వరులు సైతం సైకిళ్ళు విరివిగా వాడుతుంటే మన దేశంలో మంత్రులు మందీమార్బలంతో వాహన శ్రేణితో ప్రయాణిస్తుంటే, నాయకుల అనుచరులు వాహన ర్యాలీలతో ప్రజలను ఇబ్బందుల పాల్చేస్తుంటారు.
తరచూ గల్ఫ్ దేశాల్లో అనేకానేక సంక్షోభాలతో ఇంధన ధరలు పెరుగుతుంటాయి. మన విదేశీ మారకపు నిల్వల్లో అధిక భాగం పెట్రో దిగుబడులకే పోతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అంతా మనమంచికే అని భావించి ప్రభుత్వ రవాణా చార్జీలను కాస్త పెంచి, వ్యక్తిగత వాహన వినియోగం, పెట్రో దిగుమతులు తగ్గిస్తే ఖజానాపై పెనుభారం తగ్గి రూపాయి బలపడుతుంది.
గత 45 సంవత్సరాల్లో గరిష్టస్థాయికి చేరిన నిరుద్యోగాన్ని తగ్గించాలంటే ఉద్దీపన పథకాలతో కార్పొరేట్ రంగంపైనే ఆధారపడకుండా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలి. వివిధ సంక్షేమ పథకాల్లోను, ప్రైవేటు సంస్థల్లో అవినీతి, అక్రమాలను నియంత్రించి పరిపాలన సజావుగా నడపాలంటే తగినంత యువ సిబ్బంది కూడా కావాలి. వేతనాల భారం ఎక్కువైతే, తాత్కాలిక ప్రాతిపదికపై ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. అమెరికా వలె అధిక వేతనాలు, తక్కువ ఉద్యోగుల వ్యవస్థతో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వాలు ప్రజల సగటు ఆదాయాన్ని కూడ పరిగణనలోకి తీసుకోవాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయస్సు కూడ గతంలోవలె 58 సంవత్సరాలకు కుదించి, ఖాళీలను సత్వరమే భర్తీచేస్తే లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు బాగుపడతాయి. ఇప్పటికీ బతుకుదెరువు కానక ఏటా ఐదారువేల మంది నిరుద్యోగులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడటం, మరోవైపు సైబర్ నేరాలు పెరగటం చూస్తున్నాం. అన్ని అర్హతలుండీ అవకాశం రాని నిరుద్యోగుల తరఫున రాజకీయ పార్టీలు కూడ నిజాయితీగా ఉద్యమించాలి. పదవీ విరమణ చేసే నాటికి అత్యధిక శాతం వుద్యోగులు ఆర్థికంగా స్థిరపడి వుంటారు. పదవీ విరమణ పిమ్మట పెన్షన్, వైద్యం వంటి సౌకర్యాలను కల్పిస్తున్నందున వారికి ఇబ్బందులుండవు. అనుకోని అవాంతరాలతో ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో వుండి సర్వీసు పొడిగింపుకోరితే పొడిగించవచ్చు. దీనిని ఎవరూ వ్యతిరేకించవలసిన పనిలేదు. కొత్త ఉద్యోగ నియామకాలతో వారి కుటుంబీకులకూ అవకాశం రావచ్చు. అందరి తోడ్పాటుతోనే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యం.
సామాజిక న్యాయం జరిగితేనే దేశంలోని నేరాలు తగ్గుతాయి. జీడీపీ, రెండంకెల వృద్ధి, సెనె్సక్స్ పెరుగుదలతో సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వాలు పరిశ్రమలు, స్మార్ట్ నగరాలు, హైవేలకే గాక గ్రామీణ, వ్యవసాయ రంగాలకు కూడ ప్రాధాన్యత పెంచి ఎక్కువ నిధులు విడుదల చేయాలి. వ్యవసాయం, పాడి పశువుల కొనుగోళ్ళకు నామమాత్రపు వడ్డీకే రుణాలు మంజూరు చేయాలి. సమగ్ర గ్రామీణాభివృద్ధితోనే పట్టణ ప్రాంతాలకు వలసలు తగ్గుముఖం పడతాయి.