సబ్ ఫీచర్

భారతదేశంలో ఆగని ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ప్రతీ సంవత్సరం దాదాపున 1.3 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ లెక్కల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి లక్ష మందిలో 10.2 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రోజుకు 21 మంది తనువు చాలిస్తున్నారు. 2018 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2018లో దేశం మొత్తంమీద 1,34,516 మంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. రాష్ట్రాల వారీగా చూస్తే 17,972 ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, 13,896 మరణాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వరుసగా 13,255 ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్, 11,775 ఆత్మహత్యలతో మధ్యప్రదేశ్, 11,561 మరణాలతో కర్ణాటక నిలిచాయి. ఆరో స్థానంలో 8,237 ఆత్మహత్యలతో కేరళ, ఏడో స్థానంలో 7,845 ఆత్మహత్యలతో తెలంగాణ నిలిచింది. కాగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ ఈ విషయంలో 2.2 శాతం ఆత్మహత్యల రేటు (4,849 ఆత్మహత్యలు) మాత్రమే కలిగి ఉండటం గమనార్హం. ప్రతి లక్ష మందిలో ఎంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలవారీగా నమోదైన గణాంకాల ఆధారంగా తెలంగాణ ఐదవ స్థానంలో నిలిచింది. జాతీయ సగటు చూసుకుంటే ప్రతి లక్ష మందిలో 10.2 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అండమాన్ నికోబార్ 41, పుదుచ్చేరిలో 33.8, సిక్కింలో 30.2, చత్తీస్‌గఢ్‌లో 24.7, కేరళలో 23.5, తెలంగాణలో 21.2 ఆత్మహత్యలతో జాతీయ సగటుకన్నా అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఆత్మహత్యకు కారణాలు ఏమిటంటే? ప్రేమ అనుబంధాల వైఫల్యం, ఆత్మీయులను కోల్పోవడం, కుటుంబ కలహాలు, అవాంఛిత గర్భం, మహిళలకు వరకట్న వేధింపులు ఉండటం, నయంకాని జబ్బులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడటం, రకరకాల ఆర్థిక కారణాలు, తీర్చలేని అప్పులు, ఆస్తినష్టం కలగడం, పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం, ఉన్నవారికి లేనివారికి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆర్థిక ఇబ్బందులు ఉండటం, రాజకీయ అస్థిరత, మతపరమైన విద్వేషాలు, సైద్ధాంతిక కారణాలు, హీరోలపై మితిమీరిన అభిమానం కలిగి ఉండటం, ఉద్యోగాన్ని, గౌరవాన్ని, సామాజిక హోదాను కోల్పోవడం, నిరుద్యోగం వల్ల, అనువంశిక, జన్యులోపాలు, కుటుంబంలో ఎవరి అండదండలు లేకపోవడం వారిని సరిగ్గా పట్టించుకోలేకపోవడం, ఒంటరితనంగా భావించడం, ఇతరులవల్ల మోసపోవడం, మతిస్తిమితం సరిగ్గాలేకపోవటం, మద్యానికి, మాదక ద్రవ్యాలకు, జూదాలకు బానిసకావడం, కుటుంబంలో భార్యభర్తల మధ్య గొడవలు పడడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం మొదలైన కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2018 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం కుటుంబ సమస్యలతో 30.4 శాతం, అనారోగ్యంతో 17.7 శాతం, వివాహ సమస్యలతో 6.2 శాతం, మాదకద్రవ్యాల బానిసలు కావడంతో 5.3 శాతం, ప్రేమ సమస్యలతో 4 శాతం మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది క్షణికావేశంలోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. అప్పుడక్కడ వారిని ఎవరైనా ఆపితే ఆ క్షణం గడిచిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మహత్య గురించి ఆలోచించరు. ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే ఎలా? పని ఒత్తిడి తగ్గించుకోవాలి. పరిమితి లేని కోర్కెలు అదుపులో ఉంచుకోవాలి. చిన్నచిన్న విషయానికే ఆవేశం తెచ్చుకోకూడదు. మనస్థాపానికి గురవ్వడం, అసూయ వంటి మానసిక రుగ్మతలు తగ్గించుకోవాలి. సమస్యలను తల్లిదండ్రులు, మిత్రులు, ఆత్మీయులతో పంచుకోవాలి. వాటి పరిష్కారానికి కృషి చేయాలి.
ఇటీవలి కాలంలో కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే ఎంతోమంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని, ర్యాంకులు రాలేదని అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుతోంది. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులంతా తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. పేద పిల్లలు చదువులో ఫెయిలయినా లేదా మార్కులు తగ్గినా ఆత్మహత్య చేసుకోవటం లేదు. ప్రభుత్వ బడిలో చదివే పిల్లలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవటం లేదు. కానీ ఆత్మహత్య చేసుకొనే వారిలో అధిక శాతం ఇంగ్లీషు మీడియంలో కార్పొరేట్ కాలేజీలలో, విద్యాసంస్థలలో చదివే పిల్లలే అయి వుండటం గమనించవచ్చు. ఎక్కువ భాగం ఆత్మహత్యలు చేసుకొనే విద్యార్థులు ఐఐటి లేదా నీట్‌కోసం చదివే వారే కావడం గమనార్హం. ఆర్ట్స్‌గ్రూపు చదివే పిల్లలు దాదాపు ఆత్మహత్యలకు పాల్పడటం లేదు. ఆత్మహత్య చేసుకొనే పిల్లల్లో, పిల్లలు ఏ గ్రూపులో చేరాలీ, ఎక్కడ చదవాలి, చదివి ఏమి (ఐఐటి లేదా మెడికల్) సాధించాలి, ఎక్కడ చదవాలి అనేది నిర్ణయించడంలో తల్లిదండ్రులే కీలకంగా వ్యవహరిస్తూ విద్యార్థుల అసక్తులకు, వారి శక్తిసామర్థ్యాలకు, వారి సొంత నిర్ణయాలు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అందువల్ల ఇష్టంలేని చదువులు చదవలేక విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడే అని వైద్యులు చెబుతున్నారు. ఇరుకైన భవనాలు ర్యాంకుల ఒత్తిడే వారిని ఆత్మహత్యలవైపు అడుగులేయిస్తున్నాయని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు పుస్తకం తప్ప మరో ధ్యాసలేకపోవడం కూడా ఓ కారణమంటున్నారు. విద్యార్థుల సామర్థ్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తాము ఏమిచదవాలో, ఏమిచేయాలో నిర్ణయాలు తీసుకునే అవకాశం తల్లిదండ్రులు విద్యార్థులకి కల్పించాలి. కాబట్టి చదువులతోపాటుగా విద్యార్థులకు క్రీడలను అలవాటు చేస్తే చాలావరకు విద్యార్థుల ఆలోచనలు మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ముఖ్యంగా విద్యార్థుల ఆత్మహత్యలను నివారించే అవకాశం ఉంది.

- వాసిలి సురేష్, 9494615360