ఆంధ్రప్రదేశ్‌

ఇటు చేరికలు.. అటు పొత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 6: ఆంధ్రప్రదేశ్‌లో చేరికలు.. తెలంగాణలో పొత్తులు.. రెండు రాష్ట్రాల్లో వ్యూహాత్మక అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.. అటు టీఆర్‌ఎస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌లు బీజేపీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ చేరిన సంగతి విదితమే. ఇక ఆ పార్టీ నుంచి వలసలు ఉండవని భావించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలపై కనే్నసింది. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొండ్రు మురళి పార్టీలో చేరటంతో పాటు మాజీ ఎంపీ సబ్బం హరిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా తటస్థంగా ఉంటున్న సీనియర్ నేత మైసూరారెడ్డి కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఈ రకంగా ఉంటే తెలంగాణలో ముందస్తును ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై ఆచితూచి అడుగేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల వ్యూహంపై శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. కాగా ముందస్తు ప్రకటనపై గురువారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు, ఇతర సీనియర్ నేతలతో గంటకు పైగా ఆంతరంగిక చర్చలు జరిపారు. తెలంగాణలో వామ పక్షాలతో పాటు ఉద్యమనేత కోదండరామ్ నేతృత్వంలోని ఫ్రంట్, ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై ఏపీ నేతలతో సమాలోచనలు జరిపారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన అవసరం ఏముందనే రీతిలో పలువురు మంత్రులు టీఆర్‌ఎస్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసీఆర్- మోదీ సాన్నిహిత్యంపై తెలంగాణలో ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ రద్దుకు కారణాలు చెప్పకుండానే రద్దుచేశారని పార్టీనేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జోనల్ వ్యవస్థకు ఆమోదం..రద్దు తదనంతర పరిణామాల చూస్తుంటే ముందస్తు ఒప్పందంగానే ఉందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలు, గవర్నర్‌చేసే పనులు కూడా కేసీఆర్ చెప్పేస్తున్నారని మరో మంత్రి విమర్శించినట్లు తెలియవచ్చింది. రద్దు సందర్భంలో చంద్రబాబుపై విమర్శలు చేయటం ఎందుకని ఓ సీనియర్‌నేత ప్రస్తావించినట్లు సమాచారం.
తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉందని గట్టి పోరాటం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పొత్తులు, ఇతరత్ర వ్యవహారాలపై తెలంగాణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పార్టీ అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. విభజన తరువాత తెలంగాణ విషయంలో ఏనాడూ వ్యతిరేకతతో వ్యవహరించలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. తెలంగాణను సాటి తెలుగు రాష్ట్రంగా అభివృద్ధి జరగాలనే దిశగానే వ్యవహరిస్తున్నామని బీజేపీ కనుసన్నల్లోనే కేసీఆర్, జగన్, పవన్ నడుస్తున్నారనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. మోదీ, కేసీఆర్ మధ్య అవగాహన కనిపిస్తోందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం.
బాబును కలిసిన అజిత్‌సింగ్
ఇదిలా ఉండగా రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జాతీయ స్థాయిలో ఎన్డీయేను ఎదుర్కొనేందుకు తృతీయ ఫ్రంట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే సీఎంను అజిత్‌సింగ్ కలిసారని సమాచారం. ఇరువురి మధ్య కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.