Others
ఆర్జీఆర్.. పట్టుదల( ఆనాటిహృదయాల..)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అది 1974.
కాకినాడ సూర్యకళామందిర్లో సాంస్కృతిక సమాఖ్యవారి నాటక పరిషత్ పోటీలు జరుగుతున్నాయి. దంటు భాస్కరరావు యంగ్మెన్స్ హాపీ క్లబ్ స్థాపక అధ్యక్షులు ఆధ్వర్యంలో.. యంయస్ నిర్వహణలో జరుగుతున్నాయి. నాటక పోటీలంటే ఇప్పట్లా ఎవరో నలుగురైదుగురు చిన్నాచితకా కళాకారులు చివరిరోజున రావడం కాదు. విధిగా రచయితలూ, ప్రముఖ దర్శకులూ, ప్రముఖ రంగస్థల కళాకారులు... ప్రముఖ సినీ నటులూ వచ్చేవారు.
ఆ పరిషత్కి అంజలీదేవీ, ఆదినారాయణరావు, బిఏ సుబ్బారావు, కౌండిన్య, బియన్ఆర్, కె బాబూరావు (కాకినాడ వాస్తవ్యుడు), కాకినాడ శ్యామల, హరినాథ్, హరినాథ్ తమ్ముడు సుబ్బరాజు.. విజయవాడ రసన సమాఖ్య చాట్ల శ్రీరాములు నిర్వహణలో ‘కనకపుష్యరాగం’, సుబ్బరాజు ‘మృత్యుంజయుడు’, రావూజీ ‘మరో మొహంజోదారో’, తాజుద్దీన్ ‘రాజీవం’.. ఇలా ఘనాపాటీలంతా పాల్గొన్నారు. మహానుభావుడు నాటకస్రష్ఠ.. ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల సంచాలకులుగా మొట్టమొదట తన సేవల్ని అందించి పరిశ్రమకి మిశ్రో, కృష్ణచైతన్య, వంకాయల, పావలా శ్యామల, మంజుల ఇత్యాది నటీనటుల్ని అందించారు. గణేశ్పాత్రో (అల్లుడు)లాంటి గొప్ప రచయితని కూడా అందించారు కె వెంకటేశ్వరరావు. ఆయన హస్తవాసి అది.
పరిషత్ ప్రదర్శనలు జరగడానికి మూడురోజులు ముందే వచ్చారు కాకినాడకి చెందిన నటీనటులు. కాకినాడలో సుబ్బులక్ష్మి అనే గొప్ప రంగస్థల కళాకారిణి వుండేది. ఆమెదగ్గరే కాకినాడ శ్యామల తర్ఫీదు అయ్యింది. అంతా పండగ వాతావరణం నెలకొంది. పలకరింపులు, చతురోక్తులూ- పోటీ ప్రదర్శనలూ జరుగుతున్నాయి. ఈ పరిషత్ పోటీల్లో సందడంతా రావుగోపాలరావుదే! నటీనటులను రిసీవ్ చేసుకోవడం, ప్రదర్శనకి అత్యవసరమైన వనరులను సమకూర్చడం, భోజనాది కార్యక్రమాలు చూడటం ఇవన్నీ రావుగోపాల్రావుదే! అప్పట్లో ఆయన నాకు మంచి మిత్రుడు. నేనూ ఆ పరిషత్లో స్వీయ రచన పిఆర్ గవర్నమెంట్ కాలేజీ తరఫునా ‘న్యాయం ఇదేనా?’ నాటికతో పాలుపంచుకున్నాను.
మూడురోజులు ప్రదర్శనలు... ఒకదాన్ని మించింది మరొకటి.
ఆ నాటకాల ముందు సినిమా ప్రదర్శనలు బలాదూర్ అనిపించేలా వున్నాయి. అంజలీదేవి, నిర్మలమ్మ, సుబ్బలక్ష్మి, పిచ్చిలక్ష్మి (బీరం మస్తాన్రావు భార్య), చాట్ల సుబ్బరాజు, రావుగోపాలరావు, కె వెంకటేశ్వరరావు, బిఏ సుబ్బారావు, చాగంటి సోమయాజులూ అతిరథ మహారథులంతా పాల్గొన్నారు.
ఇక్కడ తీర్పు చెప్పాలి. అందరూ దిగ్గజాలే.. ఎవర్ని ఎంపిక చేస్తారు? మల్లగుల్లాలు పడుతున్నారు. యన్ఆర్ నంది నాటకం ‘మరో మొహంజదారో’ ముందు వరుసలోనుంచుంది. అదే వరుసలో సుబ్బరాజు ‘మృత్యుంజయుడు’- ఆ వరుసలోనే రసన సమాఖ్య ‘కనకపుష్యరాగం’. ఎవరికి వారు మొదటి బహుమతి నాదే అంటే నాదే అనుకొంటూ సంబరపడుతున్నారు.
జడ్జీలు తలలు పట్టుక్కూర్చున్నారు. రావుగోపాలరావుకి ఓ నాటకం మీద ముద్రపడింది. మరో ఇద్దరు జడ్జీలు యన్ఆర్ నంది నాటకాన్ని ఆ నాటకంలోని విలువల్ని సమర్ధిస్తు వచ్చారు. వారే ‘మృత్యుంజయుడు’ని సమర్ధించారు. రావుగోపాలరావు ‘కనక పుష్యరాగం’ ప్రదర్శనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చి తీరాలి అని పట్టుబట్టాడు. అయితే అప్పట్లో రావుగోపాలరావు మాట ఎవరు వింటారు!
అయినా నిరాశపడలేదు. రావుగోపాలరావు పట్టుదల అపుడు కళ్లారా చూశాను. ఏ ప్రదర్శనలో ప్లస్ పాయింట్స్ ఏవో మైనస్ పాయింట్స్ ఏవో స్పష్టంగా నోట్స్ రాసుకున్నాడు. ఆ నోట్స్ గొప్ప నాటకప్రయోక్త కె వెంకటేశ్వరరావుకి చూపించాడు. అయితే రావుగోపాలరావుని సమర్ధించిన వ్యక్తి అంజలీదేవి వుంది. రావుగోపాలరావు కంటే ముందే కనకపుష్యరాగం నాటకంపై మంచి ఇంప్రెషన్తో వుంది. బిఏ సుబ్బారావు, కౌండిన్యలు, ‘మరో మొహంజదారో’ అంటే చాసో... కౌండిన్య ‘మృత్యుంజయుడు’ నాటకంలో సుబ్బరాజు, శ్యామల అపూర్వంగా అద్భుతంగా నటించారని వాదిస్తున్నారు.
బహుమతులు ప్రకటించాలి. అపుడు వెంకటేశ్వరరావుగారు తెలివిగా కనకపుష్యరాగంలో కొన్ని సంభాషణలు చెప్పేడు. హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరూ నాకంటే బాగా నటించారు. గొప్ప ప్రదర్శన విలువలున్నాయి! బహుమతులు రావడం రాకపోవడం వేరే విషయం అని తప్పించుకున్నాడు. కెవి, అంజలిదేవి కూడా కనకపుష్యరాగంలో పిచ్చిలక్ష్మి సంభాషణలు గుర్తుకు తెచ్చుకుంటూ ప్రశంసల వర్షంతో ముంచెత్తింది. దాంతో మొదటి బహుమతి అని అనౌన్స్ చేయబోయేలోగా ప్రేక్షకులు ‘కనకపుష్యరాగం’ అన్నారు. జడ్జీలు కన్ఫర్మ్ చేయగానే రావుగోపాలరావు ఆనందంతో ఏడ్చేశాడు. దటీజ్ ఆర్జీఆర్. రంగస్థలం మీద, నటన మీద, ప్రదర్శన మీద, ప్రదర్శన విలువలమీద అంతభక్తిగల నటుడు రావు గోపాలరావు. అందుకే అంత ఉన్నతమైన స్థితికి వెళ్లగలిగాడు.