బిజినెస్

బందరులో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ తయారీ జోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 7: మచిలీపట్నంలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటు కానుంది. పోర్టుకు దగ్గరగా నూతన విధానంలో అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న ఓడరేవు నగరం మచిలీపట్నం మాత్రమేనని, ఇక్కడ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు ఎంతో ప్రయోజనకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మచిలీపట్నం సమీపంలో 200 కిలోమీటర్ల పరిధిలో లక్షలాది ఎకరాల విస్తీర్ణంలో సువిశాల వరి క్షేత్రాలున్నాయని, 21 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో సాగవుతున్న వరి పంటకు వేలాది టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ఈ ఎరువుల దిగుమతికి, ఇక్కడ పండిన వరి పంట ఎగుమతులకు మచిలీపట్నం ఓడరేవు కీలకంగా మారుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో అమరావతి ఆర్థిక కార్యక్రమాలు ఊపందుకోవడానికి కూడా ఇక్కడి పోర్టు ప్రముఖ పాత్ర వహిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కాంకర్ (కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సిఎండి వి కళ్యాణ రామ.. ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్చరింగ్ జోన్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. దేశీయ లాజిస్టిక్ రంగంలో ప్రసిద్ధిచెందిన కాంకర్ సంస్థ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ముందుకు రాగా, నిరుడు విశాఖ భాగస్వామ్య సదస్సులో అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇందులో భాగంగా ప్రతిపాదిత వెయ్యి ఎకరాల లాజిస్టిక్ జోన్‌లో 300 ఎకరాల్లో 200 కోట్ల రూపాయల పెట్టుబడితో తొలుత లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనుంది. మచిలీపట్నంలో ప్రతిపాదిత సెజ్‌లో తయారీ రంగ పరిశ్రమలు, గిడ్డంగులు, అసెంబ్లింగ్ తరహా పరిశ్రమలు ఏర్పాటవుతాయి. రైలు, రహదారులు, నౌకాయానం.. మూడింటి కలయికతో ఏర్పాటయ్యే ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌తో మచిలీపట్నం మాత్రమే కాకుండా, రాజధాని ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. ‘కాంకర్’ ఏర్పాటు చేయబోయే లాజిస్టిక్ పార్క్‌తో అగ్రి ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఫెర్టిలైజర్స్, ఆక్వా ప్రాసెసింగ్, నిత్యావసరాలు, గ్రానైట్ పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, జ్యూయలరీ తరహా పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది.
మచిలీపట్నం రేవు అభివృద్ధి, వ్యాపార వాణిజ్య కార్యక్రమాల విస్తరణ నిమిత్తం చేపట్టిన ఈ ప్రాజెక్టును దశలవారీగా, అనుకున్న సమయానికి పూర్తిచేయాలని, ఇందుకు అనుమతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, వౌలిక వసతుల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజవౌళి పాల్గొన్నారు.