బిజినెస్

రూ. 23 వేల కోట్లు వెనక్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: దేశీయ మార్కెట్ల నుంచి నిరుడు విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచిన విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. రుణ మార్కెట్లకు మాత్రం దూరంగా ఉండిపోయారు. తమ పెట్టుబడులను రుణ మార్కెట్ల నుంచి వీలైనంత ఎక్కువ స్థాయలో తీసేసుకోవడంతో 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయనట్లైంది.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఫలితంగా అంతకుముందు దేశీయ మార్కెట్లలోకి వచ్చిన పెట్టుబడుల కంటే పోయన పెట్టుబడులే అధికమైనట్లైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్ కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్‌లో అటు స్టాక్ మార్కెట్ల నుంచి ఇటు రుణ మార్కెట్ల నుంచి 10,304 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకుపోయన ఎఫ్‌పిఐలు.. నవంబర్ ట్రేడింగ్‌లో 39,396 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. స్టాక్ మార్కెట్ల నుంచి 18,244 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 21,152 కోట్ల రూపాయలు తరలిపోయాయ. ఇక డిసెంబర్‌లో 27,111 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులను భారతీయ మార్కెట్లు కోల్పోగా, స్టాక్ మార్కెట్ల నుంచి 8,176 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్ల నుంచి 18,935 కోట్ల రూపాయలు దూరమయ్యాయ.
అంతకుముందు మూడు నెలల్లో (జూలై-సెప్టెంబర్) విదేశీ మదుపరులు భారతీయ మార్కెట్లలోకి పెట్టుబడులను తీసుకొచ్చారు. 46,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి దేశీయ స్టాక్, రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. అయతే అక్టోబర్ నుంచి వెనక్కి తగ్గారు.
ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. ఈ క్రమంలో నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు దేశీయ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. కాగా, 2016 జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. మరోవైపు 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్లలోకి 20,566 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో భారతీయ మార్కెట్ల నుంచి 2016లో 23,079 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయనట్లైంది.
మొత్తానికి గత సంవత్సరం స్టాక్ మార్కెట్లు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నప్పటికీ, రుణ మార్కెట్లు మాత్రం ఆకర్షించలేకపోయాయ. ముఖ్యంగా చివరి రెండు నెలల్లోనే విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో రుణ మార్కెట్లకు దూరమయ్యాయ. 92 శాతం పెట్టుబడులు వెనక్కి పోయనది కేవలం నవంబర్, డిసెంబర్ నెలల్లోనే కావడం గమనార్హం.