బిజినెస్
ఆర్బీఐ అస్తిత్వ పోరాటం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అస్తిత్వ పోరాటం నిన్నమొన్నటిదేమీ కాదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుతో విభేదించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చివరికి రాజీనామా రూపంలో తన నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్బీఐకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తికి గండికొట్టి, సొంత ఖాజానాగా వాడుకోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సృష్టించిన పంథా కూడా కాదు. కేంద్రంతో ఢీకొని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్బీఐ మొదటి నుంచి శ్రమిస్తునే ఉంది. కేంద్రానికి ఎప్పుడూ సహకరించాలని, ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని అప్పటి ఆర్బీఐ గవర్నర్ బెనెగల్ రామారావుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సూచిస్తే, కేంద్రం ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసి, నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ గవర్నర్ డాక్టర్ యాగ వేణుగోపాల్ రెడ్డి (వైవీ రెడ్డి) విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి కంటే ఆర్బీఐ గవర్నర్ హోదా పెద్దదేమీ కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకప్పుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన కూడా ఆర్బీఐ గవర్నర్గా సేవలు అందించిన వారే కావడం విశేషం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, కీలక నేతల నుంచి ఆర్బీఐకి ఎదురవుతున్న సమస్యలకు, ఒత్తిడికి ఇలాంటి వ్యాఖ్యలే నిదర్శనం. ఒకప్పుడు విభేదాలు, వివాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్యే ఉండేవి. రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు మొదటిసారి విభేదాలపై బహిరంగ చర్చ మొదలైంది. విభేదాలు రచ్చకెక్కాయి. 2016 సెప్టెంబర్ 16న ఆర్బీఐ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న ఉర్జిత్ హయాంలో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆర్బీఐ నలుగురు డిప్యూటీల్లో ఒకరైన విరాల్ ఆచార్య ఇటీవలే కేంద్రంపై విమర్శలు గుప్పించి, దాదాపుగా ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. భారత ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టమైన స్థితిని ఎదుర్కొంటున్నదని అంటూ, అర్జెంటీనా మాదిరిగానే కుప్పకూలే ప్రమాదం ఉందని ఆచార్య హెచ్చరించారు. ఆర్బీఐ స్వాతంత్య్రానికి కేంద్రం అడ్డుకట్ట వేయాలని చూస్తున్నదంటూ, ఉర్జిత్పై ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి ఉన్న వ్యతిరేకతను ఎండగట్టారు. ఈ నేపథ్యంలోనే, అసలు ఆర్బీఐ ఒక స్వతంత్ర సంస్థ అవునా? కాదా? అన్న ప్రశ్న తెరపైకి వస్తున్నది. అందుకు కారణాలు లేకపోలేదు. గతాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు తల్తెక మానవు. ఆర్బీఐకి మొదటి గవర్నర్గా 1935-37 మధ్యకాలంలో పని చేసిన ఓస్బోర్న్ స్మిత్ అప్పుడు దేశాన్ని పాలించిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంతో విభేదాలు ఉండేవి. అంటే, ఆర్బీఐ ఆవిర్భావం నుంచే ప్రభుత్వాల నుంచి తనని తాను కాపాడుకుంటూ, అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్బీఐకి 1949-47 మధ్య గవర్నర్గా సేవలు అందించిన బెనెగల్ రామారావుకు అప్పటి ప్రధాని నెహ్రూతో విభేదాలు ఉండేవి. నాటి కేంద్ర మంత్రి టీటీ కృష్ణమాచారితో రామారావుకు ఆధిపత్య పోరాటం ఉండింది. తన సహచరుడు కృష్ణమాచారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన నెహ్రూ స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన సంస్థగా ఆర్బీఐని తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు. అంతేగాక, దేశంలో ఆర్బీఐకి అత్యుత్తమ స్థానం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం నడచుకోవాలని రామారావుకు నెహ్రూ లేఖ కూడా రాశారు. 2008లో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయినప్పుడు, భారత్పై దాని ప్రభావం పడకుండా కీలక నిర్ణయాలు తీసుకున్న అప్పటి ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని తన పుస్తకం ‘భారత్ మరియు ప్రపంచ ఆర్థిక సంక్షోభం’ (ఇండియా అండ్ ది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్)లో ప్రస్తావించారు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ కాదని, కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పని చేయక తప్పదని వ్యాఖ్యానించారు.
1982-85 మధ్యకాలంలో ఆర్బీఐ గవర్నర్గా, 2004 నుంచి 2014 వరకూ, పది సంవత్సరాలు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్ సింగ్ కూడా ప్రభుత్వ ఆధికారాన్ని చెప్పకనే చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి కంటే ఆర్బీఐ గవర్నర్ పదవి పెద్దది కాదని మన్మోహన్ చెప్పినట్టు ఆయన కుమార్తె దామన్ సింగ్ తన పుస్తకంలో పేర్కొంది. అనాదిగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు, ఇప్పుడు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరాటాన్ని ప్రత్యేకంగా పేర్కోవాల్సిన అవసరం లేదు.