మంచి మాట

మనసు ప్రవృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు, వాక్కు, కర్మలనే త్రికరణాలలో మనస్సుతో చేసే వాటికే ఫలితం ఉంటుంది. జ్ఞానేంద్రియమైన జిహ్వ ఎన్నో పలుకవచ్చు. కాని అవి మనస్ఫూర్తిగా కానప్పుడు వాటి ఫలితం ఉండదు. అలాగే హృదయ పూర్వకంగా చేయని కర్మ కూడా ఫలితాన్నివ్వదు. అందుకే మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలంటారు. మనం మన మనసును దేనిమీదైనా లగ్నం చేసినపుడు వాక్కు కర్మలపై దృష్టి ఉండదు. వాటి ప్రభావం ఉండదు.
ఓ ఊళ్ళో ఓ సాధువుండేవాడు. అతని కుటీరానికి సమీపంలో ఓ వేశ్యా గృహం ఉండేది. ఆ వేశ్యా గృహానికి నిత్యం విటులు వస్తూ పోతూ వుండేవారు. సాధువు తన ఆశ్రమంలో జపతపాలు చేసుకుంటుండేవాడు. కాని అతని దృష్టి ఎదురుగా ఉన్న వేశ్యా గృహానికి వచ్చిపోయే విటులపైనే ఉండేది. ఆ వేశ్య ఎంత నీచపు పనిచేస్తుంది! ఎంత పాపం మూట కట్టుకుంటుందో, రోజూ ఎంతమంది విటులు వచ్చిపోతున్నారో అన్ని పాపాలు చేసినట్లే అని ఒక్కొక్క విటుడు వచ్చిపోయినపుడల్లా ఒక్కొక్క గులకరాయి ప్రక్కన వేసేవాడు లెక్క తెలియడానికి. అలా విటుల సంఖ్యతో సమానంగా సాధువు వేసిన రాళ్లన్నీ ఓ గుట్టగా మారాయి. ఆ వేశ్య తప్పకుండా నరకానికి పోయి తీరుతుంది అనుకున్నాడు ఆ సాధువు. ఏళ్ళు గడిచేయి. కాలక్రమంలో ఆ వేశ్య మరణించడం జరిగింది. కొన్నాళ్లకు ఆ సాధువు కూడా గతించేడు. యమభటులతనిని నరకానికి తీసుకుపోతుండగా ఆ వేశ్య స్వర్గంలో ఉండడం చూసేడు. ‘‘వేశ్యా వృత్తి చేసి పాపం గడించిన ఆమెను స్వర్గానికి పంపడం ఏమిటి? నిత్యం జపానుష్ఠానాలతో గడిపిన సాధువునైన నన్ను నరకానికి తీసుకుపోవడమేమిటి? ఇదెక్కడి న్యాయం?’’ అని యమ ధర్మరాజును అడిగేడు. దానికి యమధర్మరాజు ‘‘‘ఇందులో అన్యాయం ఏమీ లేదు. ఆమె వేశ్య అయినా భుక్తికోసం వృత్తిరీత్యా విటులకు సుఖాన్నందించిందే తప్ప మనసు పడి కాదు. తాను చేస్తున్న పనికి ఆమె పశ్చాత్తాపంతో కుమిలిపోయేది. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరోటి లేదు. కాని నీవు నోటితో జపం చేస్తున్నా నీ దృష్టి అంతా ఆ వేశ్య ఇంటికి వచ్చేపోయే విటుల మీదే. నీ మనసు ఆ విటుల సంఖ్య లెక్కపెట్టడంలోనే నిమగ్నం, నీవు చేసిన జపతపాలు మనఃపూర్వకమైనవి కావు. మనసు లేని మాటలు, చేతలు వ్యర్థం. ఆ వేశ్యావృత్తి నీచమైనదీ, చేసిన పనులు పాపభూయిష్టమైనవీ అయినా అవి ఆమె మనసును మలినం చేయలేదు. మరి నీవో, నీ కాలమంత ఆమె పాపకార్యాల్ని లెక్కించడంతోనే సరిపోయింది. అందుకే ఆమెకు స్వర్గప్రాప్తి, నీకు నరక ప్రవేశం’’ అన్నాడు ఆ సమవర్తి. అందుకే వాక్కు, కర్మలతో చేసే ఉపాసన కంటే మానసికమైన ఉపాసన భగవంతుడికెంతో ప్రీతికరమైనది.
అలా మనసును నిర్మలంగా ఉంచుకోవాలంటే అరిషడ్వర్గాలనే మనలోపలి శత్రువులను జయించాలి. అందులో ముఖ్యమైనది క్రోధం. మనకు శత్రువులెవరైనా ఉన్నారంటే అది మనకుండే కోపం వల్లే. అలాగే మనలను శత్రువుగా భావించేవాళ్ళు కోపం అనే బలహీనత కలిగినవాళ్ళు. కోపం అగ్నిలాంటిది. అందుకే దాన్ని క్రోధాగ్ని అంటారు. అగ్ని ఆవహించి ఉన్నది దహించుకుపోవడమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నవాటిని కూడా దహించి వేస్తుంది. వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తుంది. అలాగే కోపం ఉన్నవాడు తాను ఉద్రేకపడడమే కాకుండా ఎదుటివారిని కూడా ఆవేశపరుస్తాడు. అది వాదోపవాదాలకూ, ఘర్షణలకూ దారితీస్తుంది. రక్తపోటు ఉన్నవాళ్ళకు కోపం ఉండడం మాటేమోగాని, కోపంవల్ల మాత్రం మనిషికి రక్తపోటు పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం పాడవుతుంది. భగవద్గీతలో చెప్పినట్లు క్రోధంవలన సమ్మోహం కలుగుతుంది. సమ్మోహంవలన స్మృతి భ్రమిస్తుంది. స్మృతిభ్రంశం వలన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడంవలన అన్ని విధాలా పతనం కలుగుతుంది.
శాంతం మనిషిని వీటినుండి రక్షిస్తుంది. క్రోధం ఎంత చెడ్డతో విడచిపెట్టదగినదో, శాంతం మనలను ఎలా రక్షిస్తుందో తెలుసుకోవడానికి శాంతానికి ప్రతి రూపమైన బుద్ధ భగవానుడే ప్రతీక.

**

-పతి మురళీధరశర్మ