మంచి మాట

నిజమైన భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టి, స్థితి, లయాల్ని చేస్తూ వినోదించడం భగవంతుని లీల. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏవి ప్రాప్తమో వాటిని ఆయనే సమకూరుస్తుంటాడు. ఏం జరిగినా, ఏం సంభవించినా అదంతా ఆయన మన మేలు కోసమే చేస్తున్నాడని గ్రహించగలిగి నిశ్చలంగా, నిర్వికారంగా నిర్మమమకారంతో సాక్షియై తిలకిస్తూ సంతోషించగలవాడే ధన్యుడు. జీవన్ముక్తుడు. ఆ స్థితికి చేరుకోవడంలోని ఆనందం అంతా ఇంతా అని వర్ణించనలవి కాదు. అసలు భగవంతుడికి నిజమైన భక్తుడెవరో చూద్దాం.
ఒక ధనికుడికి ఇద్దరు తోటమాలీలు ఉండేవారు. వారిలో ఒకడు చాలా సోమరి. పనిచేసేవాడు కాదు. కాని యజమాని తోటలోకి వచ్చినపుడెల్లా లేచి చేతులు జోడించుకుని పొగడుతూ అతని ఎదుట తన్మయత్వం నటించేవాడు. రెండవ తోటమాలి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. కష్టపడి పనిచేసి అన్ని రకాల పండ్లనూ, కూరగాయలనూ పండించేవాడు. వాటని నెత్తిన మోసుకుని పోయి దూరాన ఉన్న యజమాని ఇంటికి చేర్చేవాడు. ఈ ఇద్దరు తోటమాలిలలో ఎవర్ని యజమాని ఎక్కువగా మెచ్చుకుంటాడో ఆలోచించండి. శివుడే ఆ యజమాని. ఈ ప్రపంచమే అతని తోట. ఇక్కడ రెండు రకాల భక్తులున్నారు. ఒకడు మాటకారి. ఊరికే శివుని స్తోత్రాలు పఠిస్తుంటాడు. రెండవవాడు శివుడి సంతానమగు దరిద్రులనూ, దీనులనూ సమస్త జంతుజాలాన్నీ అది ఇది అని లేదు, సమస్త సృష్టినీ కనిపెడుతూ సేవిస్తుంటాడు. వీరిద్దరిలో శివుడికి ఎక్కువ ప్రియమైనవాడు ఎవడు? అతని బిడ్డలకు సేవ చేయువాడే అనడంలో సందేహం లేదు. తండ్రికి సేవ చేయగోరేవాడు అతని బిడ్డలకు సేవ చేయాలి. అలాగే శివుడ్ని సేవించగోరేవాడు మొదట అతని బిడ్డలకూ, సమస్త జంతుజాలానికీ సేవ చేయాలి. భగవద్భక్తులను సేవించేవారు భగవంతుని సేవకులలో పరమోత్తములని శాస్తమ్రులలో చెప్పబడి ఉంది. అలాగే భగవంతునిపై మనకు అచంచల విశ్వాసం ఉండాలి.
ఒక రామభక్తుడు ఒక ఆకుమీద రామనామాన్ని వ్రాసి నదిని దాటగోరే ఒకడికా ఆకునిచ్చి ‘‘మిత్రుడా! భయపడక నమ్మకం కలిగి ఈ ఆకును పట్టుకుని ఈ నదిపై నడిచిపో. కాని ఈ మాట మాత్రం జ్ఞాపకముంచుకో. ఇందులో ఏ మాత్రం నమ్మకాన్ని కోల్పోయేవా నువీ నదిలో పడి మునిగిపోతావు’’ అని చెప్పేడు. వాడు అలాగే నమ్మకంతో ఆ ఆకును తన ఉత్తరీయపు కొంగున కట్టుకుని నదిమీద నడవసాగేడు. అతడలా పోతూ ఆ ఆకుమీద ఏం వ్రాసి ఉందో చూడాలని కోరిక పుట్టి ఆ ఆకును బయటకు తీసి దానిమీద పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉన్న శ్రీరామ నామాన్ని చూసేడు. చూడగానే అతడు ‘ఇంతేనా? శ్రీరాముడి పేరు మాత్రమే’ అని తన మనసులో అనుకున్నంతలో నమ్మకం చెడడం చేత అతడా నదిలో పడి అడుగంట మునిగిపోయేడు. భగవంతుడిపై భక్తి కుదరాలంటే ప్రార్థన, పూజా సమయాల్లో మనసుకు ఏకాగ్రత ఉండాలి. ఒక ఫకీరుండేవాడు. శరీరంలో బాణం గుచ్చుకుని అతడు చాలా బాధపడుచుండెను. దానిని బయటకు లాగబోగా బాధ మరింత ఎక్కువైంది. అంచేత లాగడానికి వీలు కాలేదు. అదో పెద్ద సమస్య అయింది. ఫకీరు నెరిగిన వాళ్లలో కొందరు ముందుకు వచ్చి ‘బాణమిప్పుడు తీయవద్దు. ఇతడు నమాజు చేయునపుడు తీద్దాం’ అన్నారు. సాయంకాలం నమాజు వేళయింది. ఫకీరు నమాజు మొదలుపెట్టేడు. అందులో అతడు ఏకాగ్రచిత్తుడయేడు. వెంటనే బాణాన్ని తీసివేసేరు. ఆ సంగతే అతనికి తెలియలేదు. అంత ఏకాగ్రత ఉంటేనే ప్రార్థన, పూజలకు ప్రయోజనం ఉంటుంది. అటువంటి అనన్య భక్తికి ఈ సంఘటననే తార్కాణ ం. కనుక అందరిలోను ఇలాంటి భక్తే ఉంటే భగవంతుడు చర్మచక్షువులకు కూడా కనబడుతాడు.

-పతి మురళీధర శర్మ