రివ్యూ
వన్ మ్యాన్షో!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాగుంది*** జై లవకుశ
***
తారాగణం:
ఎన్టిఆర్, రాశీఖన్నా,
నివేదా థామస్, పోసాని,
బ్రహ్మాజీ, సాయికుమార్,
ప్రదీప్ రావత్, జయప్రకాష్రెడ్డి,
హంసానందిని, ప్రియదర్శి,
రోనిత్రాయ్ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: నందమూరి కళ్యాణ్రామ్
దర్శకత్వం: బాబీ (కె.ఎస్.రవీంద్ర)
***
సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. రెండు పాత్రల్లో ఒకే హీరో చేసే సందడి కొన్ని సార్లు బాగా కుదిరితే, మరికొన్ని సార్లు విఫలమైన సంఘటనలు ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు ఒకే హీరో పలు రకాల పాత్రల్లో నటించి తన టాలెంట్ను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందులో ఉదాహరణ.. కమల్హాసన్ పది పాత్రల్లో నటించిన దశావతారం, అక్కినేని అప్పట్లో తొమ్మిది పాత్రల్లో నటించి ఆకట్టుకున్న నవరాత్రి. మూడు పాత్రల్లో ఎన్టిఆర్ నటించిన దాన వీర శూర కర్ణ సినిమా వచ్చింది. తాజాగా ఇలాంటి ప్రయోగాన్ని చేసి తనలోని సత్తాచాటుకునే ప్రయత్నం చేశాడు ఎన్టిఆర్. నందమూరి కళ్యాణ్రామ్ నిర్మించిన ఈ చిత్రంలో తొలిసారి నటించాడు ఎన్టిఆర్. కె.ఎస్.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జై, లవకుమార్, కుశ పాత్రల్లో ఎన్టిఆర్ ఎలా ఆకట్టుకున్నాడు? ఈ మూడు పాత్రలను దర్శకుడు ఎలా మలిచాడు? ఆయా పాత్రల్ని ఎన్టిఆర్ సమర్ధవంతంగా పోషించగలిగాడా? అసలు ఈ ముగ్గురి కథ ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
అన్నదమ్ములుగా పుట్టిన ముగ్గురు జై, లవ, కుశలు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ల అమ్మ ఆశపడుతుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన పెద్దవాడైన జైను లవ కుశలు చిన్న చూపుతో హేళనగా చూస్తుంటారు. తన మేనమామ (పోసాని)తో కలిసి నాటకాలు ఆడుతున్న లవ కుశలుగా తాను కూడా రాముడి పాత్ర వేయాలని ఆశపడ్డ జై నత్తి కారణంగా అలాంటి పాత్రలు కాదు అని పనిమనిషికన్నా హీనంగా మార్చేస్తారు. మనసు గాయపడ్డ జై క్రూరుడుగా మారతాడు. తనని పక్కన పెట్టిన మేనమామపై లవ, కుశలపై చిన్నతనం నుంచే ద్వేషం పెంచుకుంటాడు జై. ఆ కోపంతో నాటకం జరుగుతుండగా ప్రమాదాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. ఇరవై ఏళ్ల తర్వాత కథ మళ్లీ మొదలవుతుంది. కుశ దొంగగా ప్రత్యక్షమవుతాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికా చెక్కేసి అక్కడే భారీగా దొంగతనాలు చేయొచ్చన్నది అతడి ప్లాన్. ఇక మరో వ్యక్తి లవకుమార్, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంటాడు. తన మంచి తనాన్ని అలుసుగా తీసుకొని కొన్ని అసాంఘిక శక్తులు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఎగ్గొడతారు. ఈ విషయంలో బ్యాంక్ ఉన్నతాధికారులు లోన్ తాలూకు డబ్బు చెల్లించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామంటారు. మరో పక్క తను ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తుంది. ఈ బాధలో వున్న లవకు యాక్సిడెంట్గా కలుస్తాడు కుశ. అచ్చంగా తనలా ఉన్న కుశని చూసి వీడు లవ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత లవ కుమార్ సమస్యలు తెలుసుకుని అతడి పాత్రలో బ్యాంక్కి వెళ్లి సమస్య పరిష్కరిస్తానని కుశ చెప్పడంతో ఒప్పుకుంటాడు. కానీ, కుశ బ్యాంక్కి వెళ్లేది తన దగ్గర వున్న ఐదు కోట్ల రూపాయల పాత కరెన్సీని మార్చుకోవడానికని లవకు తెలీదు. అలా వెళ్లిన కుశ కరెన్సీని మార్చుకొని వెళ్లిపోతాడు. కరెన్సీని మార్చిన నేరం కింద పోలీసులు లవకుమార్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుంటారు. కానీ వాళ్లు వెళ్లేది పోలీస్ స్టేషన్కి కాదు జై దగ్గరికి అంటే, జై బతికే ఉన్నాడని తెలుసుకున్న లవ, కుశ ఏం చేస్తారు? అసలు జై అంటే అక్కడి జనాలు ఎందుకు అంతలా భయపడతారు? మరి అన్నదమ్ములు జైని మామూలు మనిషిగా మార్చారా? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా మొత్తంగా ఎన్టిఆర్ వన్ మ్యాన్ షోలా సాగింది. ఎందుకంటే జై, లవకుమార్, కుశగా మూడు పాత్రల్లో ఎన్టిఆర్ నటన అద్భుతంగా వుంది. క్రూరంగా వుండే జై క్యారెక్టర్లోని కోణాల్ని బాగా పలికించాడు. ఉచ్ఛారణ లోపం వున్న వ్యక్తిగా పూర్థి స్థాయి నటనను ప్రదర్శించాడు. అమాయకుడుగా, మంచి తనానికి పోయి కష్టాలు తెచ్చుకునే లవకుమార్ క్యారెక్టర్ పాత్రను అంతే గొప్పగా ప్రదర్శించారు. దొంగతనాలు చేస్తూ అందరికీ మస్కా కొట్టే క్యారెక్టర్లో అంతే చలాకీగా కనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో ముగ్గురూ ఒకేలా వున్నా కేవలం ఎన్టిఆర్ ఆహార్యాన్ని బట్టే ముగ్గురిలో ఎవరు ఎవరో చెప్పేయొచ్చు. అంత పర్ఫెక్షన్ చూపించాడు తారక్. డాన్సులు, ఫైట్స్ గురించి కొత్తగా చెప్పేదేమీలేదు. హీరోయిన్ రాశీఖన్నా తన గ్లామర్తో ఆకట్టుకుంది. ఉన్నంతలో రాశీ మంచి నటనను కనబరుస్తూ గ్లామర్తో అలరించింది. మరో హీరోయిన్ నివేదా థామస్ క్యారెక్టర్కి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక సినిమాకి అవసరం లేకపోయినా స్పెషల్ సాంగ్లో తమన్నా చేసిన డాన్స్, అందాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. పోసాని, సాయికుమార్లు తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదు అని పించారు. సినిమా మొత్తంలో ఎక్కువగా కనిపించేది జై, లవ, కుశ క్యారెక్టర్లే కావడంతో మిగతా నటీనటులకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఈ సినిమాకు కీలకంగా ఉన్న అంశాల్లో ఒకటి ఫొటోగ్రఫీ. సినిమాని ఆద్యంతం అందంగా చూపించడంలో ఛోటా కె.నాయుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా పాటల్లో ఫైట్స్లో పనితనం కనిపిస్తుంది. ఎన్టిఆర్ ఇంట్రడక్షన్ సాంగ్, ఎన్టిఆర్, రాశీఖన్నాపై తీసిన సాంగ్స్లో ఛోటా ఫొటోగ్రఫీ చాలా బావుంది. సంగీత పరంగా దేవిశ్రీ ప్రసాద్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రావణా.. పాట తప్ప సినిమాలో చెప్పుకోతగ్గ పాటలేదు. ఐటెం సాంగ్స్కు ప్రత్యేకత చూపించే దేవి ఈ సినిమాలో అంత క్రేజీగా ఉన్న సాంగ్ని ఇవ్వలేకపోయాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా జై క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు దేవి. ఎడిటింగ్ బావుంది. దర్శకుడు బాబీ గురించి చెప్పాలంటే మూడు పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ కథను రాసుకోవడం, దాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్పై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఫస్ట్హాఫ్ని స్పీడుగా నడిపించి, సెకండాఫ్కి వచ్చేసరికి కొన్ని అనవసరమైన సీన్స్తో సినిమా స్పీడ్ తగ్గింది. సెకండాఫ్లో ముగ్గురితో చేసిన నాటకంలో, అన్నయ్యపై తమ్ముళ్లకు వున్న ప్రేమను తెలిపేదే అయినా .. అది అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో కొన్ని మైనస్లు కనిపించాయి. చిన్నప్పటి నుంచి తమ్ముళ్లపై ద్వేషం తప్ప ప్రేమ చూపించని అన్నయ్య గురించి తమ్ముళ్లు గొప్పగా చెప్పడం, తమపై విపరీతమైన ప్రేమను చూపించేవాడని చెప్పడం కూడా అసహజంగా అనిపిస్తుంది. తమ్ముళ్లను రక్షించడం కోసం జై తన ప్రాణాలను ఫణంగా పెట్టడం కాస్త మింగుడు పడని అంశాలు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. అవసరానికి మించి ఎక్కడా ఖర్చుపెట్టలేదు.
మొత్తానికి జై, లవ, కుశ ఎన్టిఆర్ సోలో పెర్ఫార్మెన్స్ సినిమా. మూడు పాత్రల్లో ఆయన నటించిన విధానం ముఖ్యంగా జై పాత్రలో నెగెటివ్ నటన అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. సెకండాఫ్లో ఎలివేట్ అయ్యే అన్నదమ్ముల సెంటిమెంట్ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా, పెద్దగా కొత్తదనం, ఆసక్తిలేని కథనం, రొటీన్ ముగింపు కొంత నిరుత్సాహానికి గురిచేసే అంశాలు.