విశాఖపట్నం

వివేకానందుడు చెప్పిన వీరశివాజీ గాథలు ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు.
125 సంవత్సరాల అనంతరం ఆనాడు జరిగిన ఒకానొక ఘటన అక్షరరూపం దాల్చిన రచన ఇది. 1890లో వివేకానంద దేశసంచారం చేస్తూ చెన్నపట్నం వచ్చి మైలాపూర్‌లో విడిది చేశారు. స్వామి వారి పట్ల భక్తి, గౌరవం, అభిమానం ఉన్నవారు రోజూ ఆయనని చూసేందుకు వచ్చేవారు. సాయం సమయాలలో అలా వచ్చిన వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పలు విషయాలపై ప్రసంగించేవారు. అలా వెళ్లిన అభిమానుల్లో ప్రముఖ వైద్యుడు నంజుండరావు ఒకరు.
ఒకానొక ప్రసంగంలో వివేకానందస్వామి ఛత్రపతి శివాజీని స్తుతిస్తూ భూషణ కవి రాసిన ‘శివభావనీ’ అనే కవితా ఖండికలోని పంక్తులను గానం చేస్తుండగా నంజుండరావు ‘శివాజీ మోసగాడు, దోపిడీదారు, గజదొంగ, హంతకుడిగా ముద్రపడిన వ్యక్తి. అతనిని ప్రశంసించడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.
స్వామీజీ పాడడం మానివేశారు. ముఖం జేవురించింది. ‘‘ఏమిటి డాక్టర్! హిందూ సామ్రాజ్య నిర్మాత అయిన శివాజీకి మించిన నాయకుడు ఎవరున్నారు. ఆయనలాంటి తపస్వి, భక్తుడు మరొకరున్నారా? పురాణాలలో చెప్పినట్లు మహత్కార్యాల్ని నిర్వహించడానికి అవతరించినవాడు. హిందూ జాతి ఆత్మ చైతన్యానికి ప్రతినిధి. భారతమాత కన్న సుపుత్రులలో అగ్రగణ్యుడు. నీవు విదేశీయులు రాసిన చరిత్ర పుస్తకాలు చదివిన దానికి ఫలితం ఇది. శివాజీ కారణజన్ముడు’’ అంటూ వివేకానందుడు అన్నారు.
దాంతో శివాజీ గొప్పదనం ఆయనకి అవగతం అయింది. శివాజీపై కొన్ని అపప్రదలు ఎలా వచ్చాయి? అతని వాస్తవ జీవితం ఎలా గడిచింది. శివాజీ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన అఫ్జల్‌ఖాన్ వధ మున్నగు విషయాలను వివరించమని డాక్టర్ నంజుండరావు కోరగా వివేకానందుడు వినిపించిన శివాజీ గాథ 88 పుటల లఘు గ్రంథంగా అవతరించింది.
‘మన పాఠశాలల్లో విద్యార్థులకు విదేశీయులు రచించిన హిందూ దేశ చరిత్రనే బోధిస్తూ ఉండడం దౌర్భాగ్యం’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి ‘శివాజీ జన్మించడానికి ముందు హిందూ దేశ స్థితిగతులు, శివాజీ బాల్యాన్ని గురించి, జీవితంలోని ప్రధాన ఘట్టాల గురించి చెప్పుకొచ్చారు. శివాజీపై తల్లి జిజియాబాయి ప్రభావం, దాదాజీ కొండదేవ్ శిక్షణలో నాయకత్వ లక్షణం పొందడం, తుకారాం వంటి సాధు సంతుల సౌగంధాన్ని అందిస్తూ శివాజీ-తుకారాంల అనుబంధాన్ని, 21 సంవత్సరాల వయసులో సమర్ధ రామదాసు నుండి మంత్రోపదేశం పొంది దీక్ష వహించడం వంటి అంశాలను తెలియజేశారు. శివాజీకి స్ర్తిలపై ఉన్న పవిత్ర అభిప్రాయాలను సందర్భోచితంగా చెప్పారు. (కళ్యాణ దుర్గ్ధాపతి కోడలిని హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా అత్తారింటికి పంపడం), కులమతాలకు అతీతంగా తన సైన్యంలో సామరస్యతను నెలకొల్పి దేశం పట్ల అభిమానాన్ని, అవసరమైతే త్యాగం చేయడానికి తీర్చిదిద్దారు. విదేశీయులను నిలువరించడంలో శివాజీ చాకచక్యంగా వ్యవహరించేవారు. ముఖ్యంగా కుట్రను కుట్రతోనే ఎదుర్కోవాలనే యుద్ధతంత్రాన్ని అఫ్జల్‌ఖాన్‌ను వధించడంలో శివాజీ తంత్రాన్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రతి ఘటనను వివేకానందస్వామి వివరించిన తీరు ఆసాంతం చదివించేటట్లు చేస్తాయి.
‘వీరశివాజీగాథ’ను గురించి వివేకానందుని ప్రసంగం డాక్టర్ నంజుండరావు ఆమూలాగ్రం రాసుకుని ‘వేదాంతకేసరి’ పత్రికలో ‘ది ఇచోస్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ స్వామి వివేకానంద’ అనే వ్యాసావళిని ఆంగ్లంలో ప్రచురించారు. ఆ గ్రంథాన్ని తెలుగు పాఠకుల కోసం ‘జాగృతి’ వారపత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి అద్భుతంగా తెనిగించారు. వివేకానందుని హృదయంలో శివాజీకి గల స్థానం ఎటువంటిదో ఈ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి తెలుగు పాఠకుడు చదవాల్సిన గ్రంథం. దీనిని శ్రీ శివాజీ మెమోరియల్ ట్రస్ట్, శ్రీశైలం వారు ప్రచురించారు.

**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.netకు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- ఎ. సీతారామారావు, 19-3-10, లక్క పందిరివీధి, విజయనగరం-535002. ఫోన్ : 08922 237122.