జాతీయ వార్తలు
చౌతాలా పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చండీగఢ్, మార్చి 26: హర్యానాలోని ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ (ఐఎన్ఎల్డీ)కి మరో దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఐఎన్ఎల్డీ పక్ష నేత అభయ్ చౌతాలా ప్రతిపక్ష హోదాను కోల్పోయారు. సభలో 17 మంది సభ్యులుండగా ఇప్పుడది 15కు పడిపోయింది. రెండ్రోజుల క్రితమే ఇద్దరు ఐఎన్ఎల్డీ సభ్యులు రాజీనామా చేయడంలో ఈ పరిస్థితి ఏర్పడింది. అభయ్ చౌతాలాను ప్రతిపక్ష నేతగా తొలగిస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ మంగళవారం ప్రకటించారు. ‘ఐఎన్ఎల్డీ బలం 15కు పడిపోయింది. దీంతో చౌతాలను తొలగించాం. ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేలు రణబీర్ గంగ్వా, కెహార్ సింగ్ రావత్ రాజీనామాలు ఆమోదిస్తున్నా’ అని స్పీకర్ కన్వార్ పాల్ ప్రకటించారు. హతిన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రావత్ మంగళవారం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు.
అలాగే పార్టీలో సీనియర్ నేత గంగ్వార్ కూడా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘గంగ్వార్, రావత్ బీజేపీలో చేరేముందే శాసన సభ సభ్వత్వానికి రాజీనామా చేశారు. నా కార్యాలయానికి వచ్చి రాజీనామా పత్రాలు అందజేశారు. మూడు రోజులు సెలవులు కాబట్టి మంగళవారం ఇద్దరి రాజీనామాలు ఆమోదించాను’ అని పాల్ వెల్లడించారు. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 17. ఇప్పుడు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. కాబట్టి కాంగ్రెస్కు ఈ మేరకు సమాచారం అందించినట్టు స్పీకర్ కన్వార్ పాల్ స్పష్టం చేశారు. తమ పక్ష నేత పేరును కాంగ్రెస్ సూచిస్తే ఆయననే ప్రకటిస్తానని స్పీకర్ అన్నారు. జింద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో సభలో బీజేపీ బలం 48కి పెరిగింది. ప్రస్తుత సభలో బీఎస్పీకి ఒకరు, శిరోమణి అకాలీదళ్కు ఒకరు, ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు.
ఐఎన్ఎల్డీ సభ్యుడు జస్విందర్ సింగ్ సంధూ చనిపోవడంతో ఒక స్థానం ఖాళీ అయింది. కాగా ఇండియన్ నేషనల్ లోక్దళ్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న అభయ్ చౌతాలా ప్రతిపక్ష నేత పదవికి శనివారమే రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా చౌతాలా ప్రకటించారు. జననాయక్ జనతాపార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. అభయ్ చౌతాలా శనివారమే ప్రతిపక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని మంగళవారం స్పీకర్ దృష్టికి తీసుకురాగా ‘గంగ్వార్, రావత్ అంతకు ముందే రాజీనామా లేఖలను నాకు అందించారు. అందుకే ముందు వారి రాజీనామా లేఖలను ఆమోదించిన తరువాతే అభయ్ చౌతాలాను ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించాను’ అని వివరణ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ ఎవరిదో కాదు. హిస్సార్ ఎంపీ దుశ్యంత్ సింగ్ చౌతాలా దాన్ని స్థాపించారు. అభయ్ చౌతాలా సోదరుడు అజయ్ చౌతాలా కుమారుడే దుశ్యత్ చౌతాలా. జింద్ ఉప ఎన్నికల దగ్గర నుంచి ఐఎన్ఎల్డీకి కష్టాలు మొదలయ్యాయి.
పార్టీ అభ్యర్థి ఉమెద్సింగ్ రేధు డిపాజిట్ కోల్పోయారు. కొద్దిరోజులకే మిత్రపక్షమైన బీఎస్పీ బై చెప్పేసింది. దివంగత ఉప ప్రధాని దేవీలాల్ ఐఎన్ఎల్డీని స్థాపించారు. ఆయన కుమారుడు ఓ ప్రకాశ్ చౌతాలా ఆ పార్టీ అధినేతగా ఉన్నారు. ఐఎన్ఎల్డి రాష్ట్రంలో అధికారం కోల్పోయి 14 ఏళ్లవుతోంది.