జాతీయ వార్తలు

నరకం చూపించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ఏలూరు, ఫిబ్రవరి 26:దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చెర నుంచి విముక్తమైన తెలుగు డాక్టర్ కోసనం రామ్మూర్తి తాను అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన రామ్మూర్తిని ఇస్లామిక్ ఉగ్రవాదులు 2015 సెప్టెంబర్ 15న లిబియాలో కిడ్నాప్ చేశారు. భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించడంతో అంతిమంగా విడుదలైన ఆయన మీడియా ముందు ఐసిస్ ఉగ్రవాద లక్ష్యాలనూ వివరించారు. ఉగ్రవాదుల చిత్ర హింసల్లో తన కాళ్లకు, చేతులకు అయిన గాయాలనూ చూపించారు. ఐసిస్ ఉగ్రవాదులు విద్యావంతులైన యువకులని, భారత్ గురించి వారికి బాగా తెలుసునని అన్నారు. భారత్‌తో సహా వివిధ దేశాల్లోకి తమ సిద్ధాంతాల్ని విస్తరించాలన్నదే వారి ధ్యేయంగా కనిపించిందన్నారు. తమ ఆసుపత్రుల్లో సర్జరీలు చేయించుకునేందుకు తనను ఉపయోగించుకున్నారని చెప్పారు. ఐసిస్ ఆకృత్యాలను వివరించిన ఆయన మిలిటెంట్లు తనను దూషించేవారని, శారీరకంగా చేయిచేసుకోలేదని చెప్పారు. అయితే వారి చెరలో ఉండటం తనకు నరకంగానే అనిపించిందన్నారు. ఇరాక్, సిరియా, నైజీరియా తదితర ప్రాంతాల్లో తాము జరిపిన దారుణాలకు సంబంధించిన వీడియోలను తమకు చూపించేవారన్నారు. వాటిని చూసేందుకే తాము భయపడిపోయేవారమని రమణమూర్తి వివరించారు. తనను మొదట తమ ఆసుపత్రుల్లో పనిచేయమని కోరారని అయితే తనకు వైద్యం తెలిసినా సర్జరీలు రావని చెప్పానన్నారు.దాంతో వారు తనను మహాకామా జైలు నుంచి తప్పించి మరో జైలుకు తరలించారని..అక్కడ అన్ని రకాల ఆకృత్యాలను తాను చూశానని వెల్లడించారు.
రాత్రికి రాత్రే కిడ్నాప్ చేశారు
ఏలూరు: భారత ఎంబసీ చొరవతో ఐసిస్ చెర నుంచి బయటపడిన రామ్మూర్తి 18నెలల తర్వాత ఆదివారం ఏలూరులోని తన ఇంటికి చేరుకున్నారు. తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగం మధ్య ఇన్ని నెలలు గడిపిన కుటుంబ సభ్యులు ఆయన రాకతో పరమానందభరితులయ్యారు. ఇనే్నళ్ల తరువాత ఇవాళే పండగంటూ ఉత్సాహం ప్రదర్శించారు. కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కధ సుఖాంతం కావడం వెనుక 18 నెలలుగా డాక్టర్ రామ్మూర్తి ఎదుర్కొన్న వేధింపులు, ఆవేదన, ఉద్వేగభరిత క్షణాలు అనేకం వున్నాయి.
ఏలూరు మండలం శనివారపుపేట వద్ద ఉన్న దొండపాడులోని తన స్వగృహంలో డాక్టర్ రామ్మూర్తి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. 2015 సంవత్సరంలో తన కాంట్రాక్టు పూర్తికావడంతో గ్రాట్యుటీ కోసం లిబియా వైద్యశాఖకు దరఖాస్తు చేసుకున్నానని, అప్పట్లో వారు కొద్దిరోజులు వేచివుంటే ఆ మొత్తం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారన్నారు. ఆ విధంగానే తాను అక్కడున్న ఒక గదిలో వేచివున్నానని, అయితే ఒక రోజు అర్ధరాత్రి ఐసిస్ ఉగ్రవాదులు అక్కడకు చేరుకుని తనను కిడ్నాప్ చేశారని చెప్పారు. వారి జైల్లోనే ఉన్న తాను శ్యాం అనే మరో భారతీయుడ్ని కలుసుకున్నానని చెప్పారు. తాను జైలులో వున్న సమయంలో మరో ఇద్దరు భారతీయులు కూడా పరిచయం చేసుకున్నానని, శ్రీకాకుళం, కరీంనగర్‌కు చెందిన వారు హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. కాగా తాను డాక్టర్ కావడంతో ఐసిస్ ఆసుపత్రిలో వైద్యుల అవసరం అధికంగా ఉందని, అక్కడ పనిచేయాలని వారు పలుమార్లు కోరారన్నారు. అయితే తనకు వయస్సు అధికం కావడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వారికి వివరించానన్నారు. అయినప్పటికీ ఆ తరువాత కూడా తనను పలుమార్లు అడగడంతో చివరకు వైద్యం చేయడానికి అంగీకరించానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు మారి, లిబియా మిలిటరీ దాడులు అధికం అవుతూ వచ్చాయని చెప్పారు. ఆ సమయంలోనే తనకు బుల్లెట్ గాయం కూడా అయ్యిందన్నారు. ఏదేమైనా ఎట్టకేలకు ఆ చెర నుంచి లిబియా మిలటరీ తనను బయటకు తీసుకువచ్చిందని, ఆ తరువాత తనకు ఫోన్ అందుబాటులోకి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశానని, అక్కడి భారత దౌత్యకార్యాలయానికి కూడా సమాచారం అందించానన్నారు. ఆ తరువాత రెండు మూడు రోజుల్లో వారు స్పందించి తనను అక్కడి నుంచి విడిపించి భారత్‌కు పంపారన్నారు.
కాగా రామ్మూర్తిని ఏలూరు ఎంపి మాగంటి బాబు స్వయంగా పరామర్శించారు.

చిత్రం..ఆదివారం ఏలూరు చేరుకున్నాక భార్యాబిడ్డలతో రామ్మూర్తి