జాతీయ వార్తలు

అంకెలతో బురిడీ కొట్టించాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: తమిళనాడు, కర్ణాటక పోలీసులను, అటవీ శాఖ సిబ్బందిని కొనే్నళ్లపాటు ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.. తనను వేటాడుతున్న తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సిబ్బంది అందరినీ గుర్తించగలిగేవాడట. అదెలాగంటే, వారి స్వరాన్ని విని సదరు వ్యక్తిని గుర్తుపట్టేవాడట. దీంతో కొన్నాళ్లకు వీరప్పన్ తమను గుర్తించే ప్రయత్నాలను భగ్నం చేయడానికి ఎస్‌టిఎఫ్ సిబ్బంది కేవలం అంకెలను మాత్రమే ఉచ్చరిస్తూ సంభాషించుకునే పద్ధతిని మొదలుపెట్టారట. అంటే తమ సంభాషణల్లో ఎలాంటి పదాలను ఉపయోగించేవారు కాదన్న మాట. అడవి దొంగ వీరప్పన్‌ను తుదముట్టించడానికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ కొకూన్‌కు నేతృత్వం వహించిన అటవీ శాఖ అధికారి కె.విజయ్ కుమార్ తాను రచించిన ‘వీరప్పన్: చేజింగ్ ద బ్రిగాండ్’ అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. వీరప్పన్‌ను హతమార్చే ప్రణాళికను రూపొందించి, అమలు చేసిన తమిళనాడు ఎస్‌టిఎఫ్ అనుసరించిన అనేక టెక్నిక్‌లతోపాటు అడవిదొంగ గురించిన అనేక విశేషాలను ఆయన తన పుస్తకంలో వెల్లడించారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేసి, 108 రోజులు తన చెరలో ఉంచుకోవడంతోపాటు, వీరప్పన్ పలువురు ఉన్నత స్థాయి వ్యక్తుల కిడ్నాప్‌లకు, విచక్షణా రహిత హత్యలకు ఎలా పాల్పడ్డాడో ఆయన వివరించారు. రూప ప్రచురించిన ఈ పుస్తకం.. వీరప్పన్ జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక సంఘటనలను వెలుగులోకి తెచ్చింది. 1952లో గోపినాథంలో జన్మించి, 2004లో ఎస్‌టిఎఫ్ కాల్పుల్లో మృతిచెందేంత వరకు వీరప్పన్ జీవితానికి సంబంధించిన విశేషాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
వీరప్పన్ వద్ద బాగా ఖరీదయిన ‘ఐ-కామ్’ వైర్‌లెస్ సెట్ ఉండేది. ఎల్‌టిటిఇ వంటి సంస్థలవద్ద ఉండే ఇలాంటి వైర్‌లెస్ సెట్‌తో వీరప్పన్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది సంభాషణలను వినేవాడు. స్వరాన్ని బట్టి సదరు వ్యక్తి ఎవరో అతను గుర్తుపట్టేవాడని విజయ్ కుమార్ తెలిపారు. ఎస్‌టిఎఫ్ సిబ్బందిలోని ఒక ఎస్‌పి అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో దాదాపు కొట్టుకుపోయినప్పుడు వీరప్పన్ మనసారా నవ్వుకున్నాడని ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎస్‌టిఎఫ్ సిబ్బంది వైర్‌లెస్ సెట్లలో కేవలం అంకెలు మాత్రమే మాట్లాడటం ప్రారంభించడంతో వీరప్పన్ చాలా గందరగోళానికి గురయ్యాడు. ఎస్‌టిఎఫ్ సుమారు 60 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ ప్రాంతాన్ని ఊహాత్మకంగా 16 చతురస్రాకారాలుగా విభజించింది. వాటిని తిరిగి చిన్న చతురస్రాకారాలుగా విభజించింది. తరువాత ఊహాత్మక గడియారాన్ని మొత్తం చతురస్రాకారంపై అమర్చినట్లు ఊహించింది. ‘దీని ఆధారంగా తాము ఉన్న స్థలాన్ని గడియారం పొజిషన్ ఆధారంగా అంకెల్లో చెప్పేవాళ్లం. దీనివల్ల తమ టీమ్ సభ్యులకు సులభంగా అర్థమయ్యేది. మిగతావారికి మాత్రం వినపడినా ఏమాత్రం అర్థమయ్యేది కాదు’ అని విజయ్ కుమార్ వివరించారు. అంకెల్లో మాత్రమే జరిగే సంభాషణ అర్థం కాక, ఎస్‌టిఎఫ్ సిబ్బంది ఎటువైపునుంచి వచ్చి దాడి చేస్తారోనని వీరప్పన్ తీవ్రంగా ఆందోళన చెందేవాడని ఆయన తెలిపారు.