జాతీయ వార్తలు
బిహార్లో కుదిరిన పొత్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వచ్చే సంవత్సరం లోక్సభకు జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించటంతోపాటు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఆదివారం ఆయన బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్కుమార్, కేంద్ర మంత్రి, లోక్జనశక్తి అధినేత రాం విలాస్ పాశ్వాన్తో కలిసి విలేఖరులతో మాట్లాడారు. రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు, లోక్సభ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ సమావేశానికి హజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో బిహార్లోని 40 లోక్సభ సీట్లలో ఎవరెన్ని సీట్లపై పోటీ చేయాలనే అంశంపై ఒప్పందం కుదిరిన అనంతరం వీరు విలేఖరులతో మాట్లాడారు. బీజేపీ, జేడీ(యూ) చెరి 17 సీట్లలో పోటీచేస్తే ఎల్జేపీ ఆరు సీట్లలో పోటీ చేస్తుంది. రాం విలాస్ పాశ్వాన్ లోక్సభకు పోటీ చేయకుండా బిహార్ నుండి ఎన్డిఏ తరపున రాజ్యసభకు వచ్చేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. సీట్ల పంపకం అంశంపై కొంత వివాదం నెలకొనడంతో ఎన్డీఏ నుండి ఎల్జేపీ తప్పుకుంటుందనే వార్తలు ఇటీవల రావటం తెలిసిందే. పెద్ద పార్టీలు కూటమిలోని చిన్న పార్టీలను గౌరవించటం నేర్చుకోవాలని చిరాగ్ పాశ్వాన్ ఇటీవల వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. దీనితో అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని ఆదివారం నితీష్ కుమార్, రాం విలాస్ పాశ్వాన్, చిరాగ్ పాశ్వాన్తో చర్చలు జరిపి మూడు పార్టీలు పోటీ చేయవలసిన సీట్లను ఖరారు చేశారు.
2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధిస్తుందనే ధీమా మాకున్నది. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతారని అమిత్ షా ఇరువురు నాయకుల సమక్షంలో చెప్పారు. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినందున ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనేది ఖరారు చేసుకుంటామని నితీష్ కుమార్ ప్రకటించారు. ఆయా పార్టీలు పోటీ చేయవలసిన నియోజకవర్గాలను ఖరారు చేసుకోవటంతోపాటు ఎన్నికల ప్రచార వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటామని వారు తెలిపారు. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(యూ) కలిసి పోటీచేసి 40 సీట్లలో 32 లోక్సభ స్థానాలను గెలుచుకోవటాన్ని నితీష్ కుమార్ గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో కూడా తమ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈసారి 32కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని నితీష్ చెప్పారు. మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. కలిసికట్టుగా సీట్లను ఖరారు చేసుకున్నాం.. త్వరలోనే నియోజకవర్గాల ఎంపిక కూడా జరిగిపోతుందని రాం విలాస్ పాశ్వాన్ తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ వ్యూహం మేరకు తమ పార్టీ గతంలో ఎన్డిఏలో చేరింది.. అప్పుడు తీసుకున్న నిర్ణయానికి చిరాగ్ను అభినందిస్తున్నానని రాంవిలాస్ పాశ్వాన్ ప్రశంసించారు. బిహార్లోని 40కి నలభై లోక్సభ సీట్లను గెలుచుకుంటామనే ధీమాను రాంవిలాస్ పాశ్వాన్ వ్యక్తం చేశారు.
చిత్రం..బీహార్లో ఎన్నికల ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆదివారం ఢిల్లీలో మీడియాకు వెల్లడిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్షా, ఆ రాష్ట్ర సీఎం నితిశ్కుమార్, ఎల్జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్