జాతీయ వార్తలు
వీసీ రాజీనామా చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో ఇటీవల అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ వైస్ చాన్సరల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ప్రదర్శన చేశారు. మండీ హౌస్ నుంచి మానవ వనరుల మంత్రిత్వశాఖ కార్యాలయం వరకూ గురువారం విద్యార్థులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు, బేనర్లు చేబూనిన ఆందోళన కారులు మండీ హౌస్ నుంచి హెచ్ఆర్డీ వరకూ సాగారు. హల్లాబోల్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు. ‘నో సీఏఏ, నో ఎన్ఆర్సీ, బేన్ ఏబీవీపీ ఫ్రం క్యాంపస్, హింసను తిప్పికొట్టాలి అంటూ వీధుల్లో నినాదాలు చేశారు. బజారులో కొనుగోలుకు విద్య వస్తువుకాదని, తమ హక్కు అని నిరసనకారులు ప్రకటించారు. జనవరి 5న జేఎన్యూ క్యాంపస్లోకి చొరబడి 35 మందిని గాయపరిచిన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ నేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, ఎల్జేడీ నేత శరద్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని బృందా కారత్ ఆరోపించారు. ముసుగులు ధరించిన దుండగులు మూడు గంటల పాటు క్యాంపస్లో విధ్వంసకాండ సృష్టించారని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. మెయిన్ గేట్ వద్ద పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ దుండగులు క్యాంపస్లోకి ఎలా ప్రవేశించారని ఆయన ప్రశ్నించారు. వైస్ చాన్సలర్కు తెలియకుండా ఇవి జరిగాయని అనుకోలేమని సీపీఎం నేత అన్నారు. వీసీ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని నిరసన కారులు డిమాండ్ చేశారు. పెంచిన మెస్ చార్జీలు ఉపసంహరించుకోవాలని జేఎన్యూ యూనియన్ డిమాండ్ చేసింది. వచ్చే సెమిస్టిర్ కోసం నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను బాయ్కాట్ చేస్తామని వారు హెచ్చరించారు.
ఐదుగురు సభ్యులతో దర్యాప్తు
జేఎన్యూ క్యాంప్లో ఆదివారం రాత్రి జరిగిన దాడి ఘటనపై విచారణకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు వైఎస్చాన్సలర్ ఎం జగదీష్ కుమార్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ముసుగులు ధరించిన దుండగులు క్యాంపస్లోకి ప్రవేశించి విద్యార్థులు, అధ్యాపకులతోపాటు 35 మందిపై దాడి చేశారు. మారణాయుధాలతో విచ్చలవిడిగా కొట్టారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీసీ రాజీనామాకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్లో భద్రతా వైఫల్యంపై కమిటీ దర్యాప్తు చేస్తుందని వీసీ చెప్పారు, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని ఆయన అన్నారు.
'చిత్రం... జేఎన్యూ వైస్ చాన్స్లర్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో మండీ హౌస్ నుంచి హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందాకారత్, డీ.రాజా, విద్యార్థులు