సాహితి

రచయితలు ఎందుకు చదవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరుచులకీ, అనుభవాలకీ, ఆలోచనల పదునుకూ, జ్ఞాన సంపదకీ, గవేషణకీ, అనే్వషణకీ, అన్నిటికీ చదువు అవసరం. ఏ ఒక్క చదువూ మనని పరిపూర్ణ మానవులుగా తయారుచెయ్యలేదు. చదువుల బడిలో చదువుకున్న చదువులో గేప్స్ (గ్యాప్స్) పూర్తిచేసే చదువు అవసరం. అలాంటి చదువులే పుస్తక సాహిత్యమూ, సాహిత్య పుస్తకాలూ, కథలు అందులో ఒక భాగం. కథ మరీ ముఖ్యమైనదేమో ఇవాల్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో గబగబా మధ్యలో ఏదో చేస్తూ, ఎక్కడో బస్సులోనో, ట్రెయిన్లోనో, టాయిలెట్లోనో ఏదోవిధంగా చదివేద్దాం, పూర్తిచేసేద్దాం అనుకునే మనుషులు మనకి కనిపిస్తూ వుంటారు. వీళ్ళందరికీ సులభంగా అవకాశం ఇచ్చేది కథేనేమో అని నాకన్పిస్తుంది. బహుశా ఒక కధ చదవడానికి పట్టే సమయం తక్కువ కావడంవలన కావచ్చును. బహుశా నిడివివలన కావచ్చును.
కథలు- చిన్న కథలు. పెద్ద కథలు (కొందరు పెద్దల చిన్న కథలు పెద్ద పెద్దవే). కథానికలు- ఈ చిన్న కథలు చెప్పేవి మాత్రం పెద్ద విషయాలే! ఎడ్గర్ ఎలెన్ పో మొట్టమొదట కథని నిర్వచించాడు పంథొమ్మిదో శతాబ్దంలో. ఆ నిర్వచనం ప్రకారం, ఒక సంఘటన గానీ, ఒక విషయానికి సంబంధించిన కొన్ని సంఘటనలు గానీ, ఒక్క సిట్టింగులో చదవగలిగేలా రాయబడింది కథ. అందుకే ఎవరినైనా కూర్చోబెట్టి కథలనివ్వకుండా రాసిందంతా చదివి వినిపిస్తే కథైపోతుందని సరదాగా అనేవాళ్ళం. నా దృష్టిలో కథలు జీవిత దృశ్యాలు. జీవితంలోని అన్ని కోణాలూ, అన్ని సందర్భాలూ, ఆలోచనలూ, ఒకే ఒక జీవితంలో మనకి లభించడం సాధ్యం కాదు. ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితంలో ఒక సంఘటన. ఒక అనుభవం. ఒక దృక్కోణం. ఒక క్షణానికి లేక కొన్ని క్షణాలకి పెన్‌తో తీసిన ఫొటోగ్రాఫ్ / గీసిన పోర్ట్రెయిట్.
మనల్ని ఆహ్లాదపరుస్తూ, ఆనందపరుస్తూ ఆలోచింపజేసే అవకాశం. మనలోని లోపాలను మనకి చూపగల పరికరం లేక వేరెవరిలోనో వున్న ఉన్నత భావాలనీ, ఆదర్శాలనీ, గొప్పదనాన్ని మనకి చూపగల దిక్సూచి లేక మైక్రోస్కోపు.
సాటి మానవుణ్ణి అర్థం చేసుకోవడానికీ, ఓదార్చడానికీ కూడా సహాయపడగలవు కథలు. ప్రపంచంలో వేరు వేరు మూలాల్లో, దేశాల్లో, పాంతాల్లో వుంటూ, రకరకాల భాషలూ, వివిధ ధోరణులూ, అనుభవాలూ వున్న మానవుల మధ్య సామ్యాన్నీ, సామాన్యతనీ చూపించే శకితగలవి కథలు. అరుదైన పరిపూర్ణ వ్యక్తిత్వానికీ, అంతకన్నా పరిపూర్ణమైన ఉన్నతమైన వ్యవస్థకీ దారితీయించగలవి కథలే. మహోన్నతమైన, అత్యద్భుతమైన ఆనందాన్ని అనుభవించగలరు చదువవరులు. మానవ బలసీనతలనుండీ, స్వార్థపరత్వం నుంచీ కనీసం క్షణకాలమైనా దూరంగా వుంచగలిగే శక్తిగల రచనలూ వున్నాయి. రచన గొప్పతనం రచయిత శక్తిపై ఆధారపడినంతగా రాస్తున్న విషయంపై ఆధారపడదు. ఇలాంటి ఎన్నో విలువైన విషయాలు సులభంగా, చౌకగా, చక్కగా పొందే అవకాశం చదవడం. అందులో కథ చదవడానికి పట్టే సమయం కూడా తక్కువే. అందుకే చదవాలి ఎవరైనా. చదువుతూనే వుండాలి.
కానీ రచయితలెందుకు చదవాలి?
వాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాల రాస్తూ పోవచ్చును కదా. వాళ్ళ జీవితమునుంచీ వాళ్ళు గ్రహించినవి రాసుకుంటూ పోవచ్చు కదా అంటే పోవొచ్చును. కానీ పోలేకపోతున్నాను. అన్ని విషయాలూ స్వంత అనుభవం నుంచే నేర్చుకోవడం చాలా కాస్ట్లీ ఎఫైర్. దాదాపు అసాధ్యం. మనకి మిగతావారి గురించి తెలియనంతవరకూ మనకి మనం చాలా గొప్పగా అన్పిస్తాం. ఈ విషయం మన కథకుల్నీ, రచయితల్నీ గమనిస్తే మనకి సులభంగా అర్థవౌతుంది.
మన అదృష్టమో దురదృష్టమోగాని, ప్రపంచంలో వున్న మేధావులందర్లో నూటికి 99 శాతం మనవాళ్ళే. ఈ మేధావుల దృష్టిలో వాళ్ళు తప్ప మిగతావాళ్ళందరూ మేతావులే. వాళ్ళ మాత్రమే మేధావులు.
ఈ రచయితలెవరూ కనీసం చాలామంది మిగతావాళ్ళ రచనలేమీ చదవరు. తమకంటే తక్కువ స్థాయి రచయితలని భావించడంవలన గొప్పవాళ్ళ రచనలూ చదవరు, ఎక్కడ ప్రభావితులమైపోతామేమో అని. కనీసం అలా అంటారు. వీళ్ళు వీళ్ళల్లో లేని మోడెస్టీని ప్రదర్శిస్తూ వుంటారు. ‘‘కథాచిలుక పట్టుబడనే లేదు’’ లాంటి వాక్యాలు వాడుతూ వుంటారు. ప్రసిద్ధుల నిబద్ధతని ప్రశ్నిస్తూ కబుర్లు చెప్తారు. మహానుభావుల రచనల్ని చదవడమైనా చదవకుండా వాళ్ళ సంస్మరణ సభల్లో ప్రసంగిస్తారు. బ్రహ్మాండమైన లెక్చర్లు ఇచ్చేస్తారు. వారికి / వీరికి (కాదు వాడికి / వీడికి) అనవసరంగా ఎక్కువ పేరు వచ్చిందని వాపోతారు. సందేశమెందుకు కథల్లో, అక్కర్లేదని కొందరి అభిప్రాయమైతే, సర్వజనీనత కాదు ప్రాంతీయ వుండాలి అని కొందరి నినాదం. లెఫ్ట్ అయితేనో, రైటైతోనో అని ‘ఎలెఫంట్ అండ్ సిక్స్ బ్లైండ్‌మెన్’లా జీవితాన్ని నిర్వచిస్తారు. జీవితాన్ని పట్టుకోవడాన్నీ, పట్టించుకోవడాన్నీ పట్టించుకోవడంలేదు. తమ గురించీ, తమ రచనల గురించీ మాత్రమే మాట్లాడుతూ తమని తామే మెచ్చుకుంటూ, తను కాకపోతే తన ముగ్గురు నలుగురు చెంచాగాళ్ళని మెచ్చుకుంటూ ప్రసంగిస్తూ, ప్రస్తావిస్తూ విహరిస్తారు సభల్లో సోషల్ మీడియాల్లో. నేను గత సంవత్సరం ఇన్ని పుస్తకాలు చదివేను, అన్ని పుస్తకాలు చదివేను అని తెలియబర్చటాలూ, రాయడాలూ, వాటిని మిత్రులు మెచ్చుకోవడాలూ చూస్తుంటే ‘చదివిన నీ చదువంతా వ్యర్థమా?’ అనే పాట గుర్తొస్తోంది. అసలు వీళ్ళు ఇన్ని పుస్తకాలు ఎలా చదువుతున్నారు? అసలు వీళ్ళకింత టైమెలా దొరికింది? వీళ్ళు ఉద్యోగాలూ, సద్యోగాలూ చెయ్యడంలేదా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. పోనీ చదివేరనుకుందాము. చదవడం వాళ్ళకోసమా? ప్రపంచంలో అందరికీ చెప్పడం కోసమా? నాకర్థం కావడంలేదు. మరొక విషయం నాకర్థం కానిదేమిటటే, ప్రతి రచయిత రాసిన ప్రతీ రచన గొప్పదవవలసిన అవసరమూ లేదు. అలా కుదరదు కూడా. కానీ ప్రతిసారీ, ప్రతి రచయితని పట్టుకుని వాడు రాసినదాంట్లో బగులేని వాటిని తీసి ఫలానావాడిని మహారచయిత ఎలా అన్నాం? అనడం. అదో సమస్య.
ఆరుద్రగారు ఒక సందర్భంలో తన తొలినాటి రచనల గురించి ముచ్చటిస్తూ ఇలా అన్నారు. నేను నా తొలి నాటి రచనల గురించి ఏమంటాను? స్పార్కులు ఉన్నా మార్కులు ఇవ్వలేను అన్నారాయన.
సోమర్సెట్ మామ్ కొందరు యువ రచయితల కథల పుస్తకానికి ముందుమాట రాస్తూ ఇలా అన్నాడు. ఈ కథలు నేను కథలు రాసే తొలి రోజుల్లో వుండి వుంటే నేను బాగా రాయగలిగేవాణ్ణి అనిపిస్తోంది. సుమారుగా ఈ భావం ధ్వనించే వాక్యాలు రాసేడాయన.
రంగనాయకమ్మగారు తన కొన్ని రచనల్ని తరువాత కాలంలో తొలగించారు. రావిశాస్ర్తీగారు తన రచనల్ని డిఫెండు చేయడానికి నిరాకరించిన డిఫెన్సు లాయరుగారు. మరి వీరు ఈ స్థాయికి ఎలా చేరేరు? తమని తాము సరిగా అంచనా వేసుకుంటూ తమ లోపాల్ని ఒప్పుకుంటూ దిద్దుకోవటానికి వీలు లేకపోతే ఊరుకుంటూ ఎలా? ఎలా? నిరంతర అధ్యయనం అంటే చదవడమే అందుకు కారణమని నేను భావిస్తున్నాను. హైస్కూలు కాంపోజిషన్ లాంటి వ్యాసాల్లో ఇటీవల కథకులందరూ కథలెలా రాయాలో మిగతావాళ్ళందరికీ తెగ చెప్పడం మొదలుపెట్టారు. ఎక్కడెబెడితే అక్కడ రాయడం మొదలుపెట్టారు. ఇలా రాయాలి, అలా రాయకూడదు, ఇలా రాయొచ్చు.. ఇలా చెబుతున్నారు. మన వర్థమాన రచయితలకి ఆ స్థాయి ఎందుకు రావడంలేదు? ఆ పరిణతి ఎప్పుడు వస్తుంది? ఇవి నాకు ఎదురైన, నన్ను నేను వేసుకున్న ప్రశ్నలు. నిరంతరం అధ్యయనం లేకపోవడంవలన అనీ, విస్తృతంగా చదివినపుడే అనీ, విస్తృతంగా చదవడమొక్కటే దీనికి సరియైన సమాధానమనీ నేను భావిస్తున్నాను.
రచయిత విజిబిలిటీ తక్కువగా వుండాలి, వాళ్ళు చెప్పే విషయాలు స్పష్టంగా కనబడాలి. కాని ప్రస్తుతానికి రచయితల విజిబిలిటీ ఎక్కువైపోయి చెబుతున్న దాంట్లో విషయం కనబడడం తక్కువైపోయింది. చెప్పడానికి ఏమీ లేనపుడు వాళ్ళు చెప్పకుండా వుండడమే మంచిది. రాయని భాస్కరులు అవడం మంచిది. రాస్తూపోవడం అనవసరం అనిపిస్తుంది.
ఇవా నా అభిప్రాయాలు. వ్యక్తిగతంగా నాకు నచ్చని విషయాలు నేను గట్టిగా చెప్పడం కావచ్చును. వీటిని నచ్చినవాళ్ళు మెచ్చుకుంటారు. నచ్చనివాళ్ళు కొందరు నొచ్చుకుంటారు. నొచ్చుకునేవారిని నొచ్చుకోవద్దనీ, మెచ్చుకొనేవాళ్ళని అంతగా మెచ్చుకోవద్దని కోరుతున్నాను.

- చిర్రావూరి శ్యామ్