శ్రీకాకుళం

ఉద్దానంలో.. ఇండియన్ కౌన్సిల్ వైద్య పరిశోధన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీరోగుల పరీక్షలకై ఇంటింటికీ సర్వే నిర్వహించే కార్యక్రమానికి నాంది పలికింది. సుమారు 800 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులను పరీక్షలు నిర్వహించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ రంగంలోకి దిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్దానం కిడ్నీరోగాలను నిర్థారణ చేసేందుకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్దానంలో వందలాది మందిని మృత్యుకోరల్లో బంధిగావున్న కిడ్నీవ్యాధి మూలాలు అనే్వషణకు సోంపేటలో కిడ్నీరోగాల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం సహయంతో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇందుకుగాను తాను శుక్రవారం డిల్లీ పర్యటనలో దేశ ప్రధాని నరేంద్రమోదీతోపాటు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను వివరించనున్నట్టు తెలిపారు. గురువారం ఉద్దానం ప్రాంతంలో ఆరోగ్యశాఖ మంత్రి కామినేని, జిల్లా మంత్రి అచ్చెన్న, ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, కమిషనర్ దుర్గాప్రసాద్, శామ్యూల్, డాక్టర్ అరుణకుమారి, ఎం.పి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సనపల తిరుపతిరావులతోపాటు ఆరు రాష్ట్ర ప్రత్యేక బృందాలు పర్యటించారు. 1982 నుంచి ఉద్దానంలో కిడ్నీకి సంబంధించిన రోగాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన నివేదికలన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్‌ప్రకాష్‌నడ్డాకు రాష్ట్ర మంత్రి కామినేని శుక్రవారం అందజేయనున్నారు. ఐసీఎంఆర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అంతటా 19 డయాలసిస్ కేంద్రాలకు సాయం అందించాలంటూ కామినేని కేంద్రప్రభుత్వాన్ని కోరనున్నారు. ఈ మేరకు గురువారం ఉద్దానంలో ఆరోగ్యశాఖ మంత్రి కామినేనితోపాటు, కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ ఉద్దానం కిడ్నీవ్యాధిగ్రస్తులతో మాట్లాడి వ్యాధి తీవ్రతను తెలుసుకున్నారు. ఇచ్చాపురం, సోంపేట, పలాస, మందస, కవిటి ప్రాంతాల నుంచి సుమారు 800 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులు సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చారు. వీరితో మంత్రులు, రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మీడియాతో మాట్లాడారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను అన్నీ విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కిడ్నీవ్యాధులపై కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ రూపొందించిందని, అందులోభాగంగానే ఆరు సంర వైద్య పరీక్షల వాహనాలను ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు నెలల్లో ఉద్దానం ప్రాంత ప్రజల హెల్త్‌ప్రొఫైల్ నివేదిక తయారు చేస్తామని వివరించారు. కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణమైన రెండు పరీక్షలను చేస్తారని, అందులో కిడ్నీ వ్యాధి సోకినట్లయితే, అటువంటి వారిని 108 వాహనం ద్వారా సామాజికారోగ్య కేంద్రాలకు తీసుకువచ్చి మరో 40 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రానున్న 60 రోజుల్లో పలాస, సోంపేట ప్రాంతాలలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. ఉద్దానం ప్రాంతంలో గల 107 గ్రామాలలో కిడ్నీ వ్యాధి పెనుభూతంలా కారణాలు తెలియని సమస్యగా ఉందని, ఈ ప్రాంత ప్రజలకు ఈ వ్యాధి నుంచి శాశ్వత పరిష్కారం కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించడం జరిగిందన్నారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా భరిస్తుందన్నారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి అవసరమైతే విదేశాల నుంచి అనుభవజ్ఞులైన నిపుణులను తీసుకురవాడం జరుగుతుందని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు, బస్సు పాస్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సోమవారం నుంచే సర్వే నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.