విశాఖ
భూ బకాసురులు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నక్కపల్లి, జూలై 17: మండలంలోని వేంపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో గల అమలాపురం గ్రామంలోని 375 సర్వేనెంబర్లో ఊరకొండను ఆనుకుని ఉన్న 54.5 ఎకరాలు, సర్వేనెంబర్ 353లో రాకాసిమెట్టను ఆనుకుని ఉన్న 7.96 ఎకరాలు మొత్తం 62.46 ఎకరాలను భోగస్ రైతుల చేతుల్లో పెట్టే పనిలో నక్కపల్లి రెవెన్యూ అధికారులు విశ్వప్రయత్నాలు చేసి చివరకు ఆ గ్రామంలోని విశ్వనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం మేర కు విఫలయత్నం చెందారు. 375 సర్వేనెంబర్లో ఊరకొండను ఆనుకుని 295 ఎకరాలున్నట్లు సర్వే, సెటిల్మెంట్ అధికారులు గతంలో గుర్తించారు. ఇందులో 2007 ప్రాంతంలో 240.5 ఎకరాలను ప్రభుత్వం 5వ విడత భూ పంపిణీ కార్యక్రమంలో భూమిలేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చింది. మిగతా 54.5 ఎకరాలను పంటకు పనికిరాని భూమిగా (హిల్టాప్) అధికారులు గుర్తించి ఎవరికీ పట్టాలు ఇవ్వకూడదని నిర్ణయించారు. అయితే ఈ కొండ తాజాగా పిసిపిఐఆర్ ఏర్పాటులో ఎపిఐఐసి భూ సేకరణలో నమోదు చేశారు. ఈ భూ సేకరణ ద్వారా తీసుకున్న భూములకు ఎకరానికి రైతుకు 18లక్షల రూపాయల మేర ప్రయోజనం కల్పిస్తుంది. దీనిపై అత్యాశకు పోయిన భోగస్ రైతులు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో 40మందికి దొడ్డిదారిన సబ్డివిజన్ జరగినట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి ఆన్లైన్లో 1బి, అడంగళ్ నమోదు చేశారు. 375లో భోగస్ సర్వేనెంబర్ పేరు మీద ముగ్గురు రైతులకు ఒక్కో ఎకరం చొప్పున మూడు ఎకరాలు, 375లో రెండు సర్వేనెంబర్లో ఒక రైతుకు రెండు ఎకరాలు నమోదు చేయబోయి తప్పుగా 200 ఎకరాలను నమోదు చేసి ఆన్లైన్లో అడంగళ్ 1బి సృష్టించారు. అలాగే 375లో నాలుగు పేరుతో మరో తప్పుడు సర్వేనెంబర్ను సృష్టించి అందులో 31మందికి ఏకంగా 48 ఎకరాలను రెవెన్యూ అధికారులు ధారాదత్తం చేసినట్లుగా చూపించారు. ఈ భూములన్నింటికి రైతు ఖాతాను నోషనల్ ఖాతా పేరుతో 1బిలో నమోదు చేసి అదే నెంబర్ను అడంగళ్లో కూడా చూపించారు. అలాగే రాకాసికొండకు సంబంధించి 353 సర్వేనెంబర్లో 7.96 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి ఉండగా అందులో ముగ్గురి రైతుల పేర్లమీద 1బి ఖాతాలతోపాటు అడంగళ్ నమోదు చేశారు. ఇందులో వి.నర్సింహాచలం పేరుపై రెండు ఎకరాలు, ఐనంపూడి శ్రీరామచంద్రరాజు అలియాస్ సూర్యనారాయణ రాజు పేరుమీద 3.96 ఎకరాలు, అలాగే ఇందుకూరి కన్నంరాజు పేరుమీద మరో రెండు ఎకరాలను ధారాదత్తం చేసి ఉన్న ఫళంగా ఆన్లైన్లో 1బి, అడంగళ్లు నమోదు చేశారు. ఈ వ్యవహారమంతా కింద స్థాయిలో ఉన్న విఆర్వోనుండి, ఆర్ఐ, డిటి విచారణ పూర్తయిన తరువాత తహశీల్దార్ సంతకం పూర్తయిన తరువాత రైతుకు 1బిలో భూమి యాజమాన్య హక్కు కల్పిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా 2015 సెప్టెంబర్ నెలవరకు పనిచేసిన విఆర్వో రాజేశ్వరరావు అధికారుల అనుమతి లేకుండానే ఇవన్నీ చేసినట్లుగా రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే అక్టోబర్ 2015వ సంవత్సరంలో కొత్తగా వచ్చిన విఆర్వో ధర్మిరెడ్డి బాబూరావు 375 సర్వేనెంబర్లోని 54.5 ఎకరాలను కొత్తగా అడంగళ్లో నమోదు చేసి 1బిలో కూడా ఆన్లైన్ చేసి తహశీల్దార్, డీటిల దృష్టిలో పెట్టకుండా డిజిటల్ సైన్లు వేయించినట్లుగా సంబంధిత డిటి నర్సలక్ష్మి చెబుతున్నారు. ఈ తతంగతమంతా పిసిపిఐఆర్ ఈ రెండు కొండల తాలూకా భూములు సేకరణ జరుగుతున్నందున నష్టపరిహారం ఇప్పించమని ఈ రెండు సర్వేనెంబర్లు తాలుకూ సంబంధించి 43మంది రైతులు ఎపిఐఐసి అధికారులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం అప్పటిలో ఒక్కసారిగా బయటపడటంతో ఎపిఐఐసి, ఎస్బిసి పాత విఆర్వోను పిలిచి విచారించగా ఈ అడంగళ్ 1బి నమోదుతో తనకు సంబంధం లేదని, కొత్తగా వచ్చిన విఆర్వో చూస్తున్నారని ఆయన ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకున్నారు. దీనిపై ఈ ఏడాది గత ఏప్రిల్ నెలలో రైతులంతా 1బి కాపీల నకళ్లను పట్టుకుని తహశీల్దార్ కార్యాలయానికి తమ భూములకు నష్టపరిహారం ఇప్పించమని కోరిన మీదట ఈ వ్యవహారాన్ని మండల సర్వేయర్కు విచారణ నిమిత్తం అప్పగించారు. మండల సర్వేయర్ను ఎంక్వయిరీ చేయగా 375లో 1, 2, 3, 4 సర్వే నెంబర్లు మండల సర్వే రికార్డుల్లో లేవని, అసలు సబ్డివిజనే జరగలేదని అప్పటి తహశీల్దార్ సుందరరావుకు చెప్పారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించకపోవడంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడి రోడ్డెక్కింది. ఈ వ్యవహారంలో ఎకరానికి సుమారుగా ప్రభుత్వం ఇవ్వనున్న 20లక్షల రూపాయల చొప్పున 60 ఎకరాలకు సుమారుగా 12కోట్ల రూపాయలు దొడ్డిదారిన ఈ అడంగళ్, 1బి భోగస్ రైతుల నమోదు చేయడం వలన 12కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయితే భోగస్ రైతుల వ్యవహారం, రెవెన్యూ అధికారుల లీలలు బయటపడటంతో దీనికి అడ్డుకట్ట వేసినట్లయింది.
* పాత తహశీల్దార్ సుందరరావు వివరణ
అమలాపురంలో 375 సర్వేనెంబర్కు సంబంధించి 37మంది రైతుల పేరున 1బి అడంగళ్ నమోదు చేయడం నిజమేనని దీనిపై ఇక్కడ పనిచేసిన పాత విఆర్వో, అలాగే కొత్త విఆర్వోల్లో ఎవరు చేసారనేది పూర్తి విచారణ జరిపించాల్సివుందని, ఎంక్వయిరీ చేస్తే నిజాలు బయటపడతాయని ఆయన చెప్పారు. 353 సర్వేనెంబర్లో ప్రభుత్వ భూమి 7.96 ఎకరాలకు ముగ్గురి రైతుల పేరున పాస్పుస్తకాలు నమోదు చేసినందున పాత విఆర్వో రాజేశ్వరరావుపై చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్కు నివేదిక ఆయన తెలిపారు.
* కొత్త తహశీల్దార్ గంగాధర్ వివరణ
375 సర్వేనెంబర్లో 54.50 ఎకరాలు, ఆన్లైన్లో 1బి, అడంగళ్ నమోదు చేయడం వాస్తవమేనని దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని ఆయన అన్నారు. విచారణ పూర్తయితే ఇందులో ఎవరు బాధ్యులనేది తెలుస్తుందని, అప్పుడు వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ భూములపై తహశీల్దార్ డిజిటల్ సైన్లు కూడా వేసారని దానిపై కూడా పూర్తిస్థాయి విచారణ జరుగుతుందన్నారు. వీటికి సంబంధించిన రెవెన్యూరికార్డులు ఇప్పటికే సీజ్ చేసామని, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని తహశీల్దార్ గంగాదర్ చెప్పారు.
* డిటి వివరణ
ఆన్లైన్లో ప్రభుత్వ భూములను దొడ్డిదారిన నమోదు చేసిన వ్యవహారం తనకేమీ తెలియదని, భోగస్ రైతులకు 1బి నమోదు చేయడం మాత్రం వాస్తవమేనని డిటి నర్సలక్ష్మి చెప్పారు. ఈ వ్యవహారంలో పాత విఆర్వో హయాంలో జరిగిందా, కొత్త విఆర్వో హయాంలో జరిగిందా అనేది ఎంక్వయిరీ జరుగుతుందని డిటి చెప్పారు.
* ఆర్ఐ అశోక్ వివరణ
సబ్డివిజన్ జరగకుండా 375 సర్వేనెంబర్లో రైతులకు 30మంది రైతులకు భూములను ఆన్లైన్ చేయడం వాస్తవమేనని అయితే ఇది 2015వ సంవత్సరంలోనే జరిగినట్లుగా కంప్యూటర్ అడంగళ్ ద్వారా తెలుస్తుందని చెప్పారు. దీనిపై ఎవరి హయాంలో జరిగిందనేది విచారణ తెలుస్తుందన్నారు.
* విఆర్వో బాబూరావు వివరణ
గత ఏడాది అక్టోబర్లో తాను అమలాపురం విఆర్వోగా చేరినట్లుగా బాబూరావు చెప్పారు. తన హయాంలో 375 సర్వేనెంబర్లో ఎవరి పేర్లు ఆన్లైన్ చేయలేదని, తహశీల్దార్ డిజిటల్ సైన్ డిటి దగ్గర కాని, తహశీల్దార్ వద్దకాని ఉంటుందని వారి అనుమతి లేకుండా భోగస్ రైతుల పేరుమీద తానెలా డిజిటల్ సైన్ చేసేందుకు ఎలా వీలు పడుతుందని ఆయన చెప్పారు. ఏదిఏమైనా ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, పాత విఆర్వో రాజేశ్వరరావు హయాంలో ఈ భూమి బోగస్ రైతుల నమోదు వ్యవహారం జరిగి ఉండవచ్చని, తనకేం సంబంధం లేదని చెప్పారు.