అనంతపురం

అట్టహాసంగా మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, ఆగస్టు 4: కదిరి మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణ స్వీకారం గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అత్యంత సుందరంగా రూ. 15 లక్షలు ఖర్చు చేసి వేదికను తయారుచేయించారు. నియోజకవర్గం నుండి వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రాగా, ఈ కార్యక్రమానికి కందికుంట అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ చమన్‌సాబ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాలు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్‌గా గరికపల్లి రామక్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్‌గా పెద్ద రెడ్డెప్పలతోపాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ కందికుంట పేరు చెప్పగానే సభ ఆద్యంతం ఈలలు, చప్పట్లతో సభ మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, పేదలకు కడుపునింపే ప్రభుత్వమేకానీ కడుపు కొట్టేదికాదన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన నాయకుడు చంద్రబాబు అని, ఎన్నికలకు ముందు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని రుణమాఫీ హామీ ఇచ్చారన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రం రూ. 16 వేల లోటు బడ్జెట్‌లో వున్నప్పటికీ ఇచ్చిన హామీని నిలుపుకున్నారన్నారు. కరవు రహిత జిల్లాగా అనంతను చేయడమే బాబు ధ్యేయమని, అందులో భాగంగా పండ్ల మొక్కల పెంపకం, నీరు-చెట్టువంటి కార్యక్రమాలను చేపట్టారన్నారు. కాగా ప్రజా సాధికార సర్వేపై ప్రజలు ఎటువంటి అపోహలు చెందకూడదని సూచించారు. ఇది ప్రజలకు మేలు చేసేదే కానీ, అన్యాయం చేసేది కాదని తెలిపారు. జడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ టీడీపీ అంటేనే రైతు ప్రభుత్వమన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో వున్నా రైతులతోపాటు బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు పెద్ద పీట వేసిందన్నారు. జిల్లాలో ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేపట్టినప్పుడు రైతుల రుణమాఫీని ప్రకటించడం జరిగిందన్నారు. మరోవైపు ఈ హామీ అమలుచేయలేరని కాంగ్రెస్, వైకాపాలు విమర్శించినా ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెలబెట్టుకున్నారని తెలిపారు. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇవ్వడంతోపాటు జిల్లాను కరవు రహిత అనంతగా చేయాలని హంద్రీనీవా పనులను వేగవంతం చేసి చెరువులకు నీరు నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేయడంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు భూమి పూజ చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ పండుగ వాతావరణం మధ్య కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం అభినందనీయమన్నారు. కమిటీ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేశారని తెలిపారు. మార్కెట్ యార్డుకు వేరుశెనగ కాయలు రైతులు తీసుకొచ్చేలా చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, అందులో భాగంగా వైకాపా నుండి అత్తార్, టీడీపీ నుండి కందికుంట గత ఎన్నికల్లో పోటీ చేయగా అత్తార్ గెలుపొందారన్నారు. అయితే టీడీపీ ఆహ్వానం మేరకు ఆయన టీడీపీలో చేరారని, కందికుంట, అత్తార్‌లు పాలు నీళ్లుగా కలిసి నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మాట్లాడుతూ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగిన విధంగానే భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దామని కోరారు. కార్యకర్తలే దైవంగా భావించే నారా లోకేష్ ఆధ్వర్యంలో పనిచేయడం తమకు గర్వకారణమని, మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య కొన్ని నెలలుగా రాజకీయాలు జరిగాయని, అవన్నీ మర్చిపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. రైతు పక్షపాతి టీడీపీ అని, అందువల్లే పార్టీకి రామక్రిష్ణారెడ్డి చేసిన సేవలను గుర్తించి కమిటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిందన్నారు. కదిరి ప్రాంతం వేరుశెనగ పంటకు ప్రఖ్యాతి అని గతంలో కాళహస్తి నుండి వ్యాపారులు వేరుశెనగ కాయల కోసం కదిరికి వచ్చేవారని, అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డు కేవలం వేరుశెనగ విత్తన కాయలు పంపిణీకే పరిమితమైందని, ఈ పద్ధతిని మార్చి అభివృద్ధిలోకి తీసుకుపోవాలన్నారు. ముఖ్యమంత్రి కూడా జిల్లాకు తాగునీరే కాదు సాగునీరు కూడా ఇచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్న ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. హంద్రీనీవా పనులు పూర్తిచేసి కదిరి ప్రాంతానికి నీళ్లు వస్తే రైతు రాజు అవుతారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఉదయం లేచినప్పటి నుండి టీడీపీపై బురదజల్లడం తప్పా, ప్రజల గురించి పట్టించుకోవడంలేదన్నారు. విభజనలో కాంగ్రెస్ ముందుంటే దాని వెనుకే వైకాపా వుందని ఆయన విమర్శించారు. కాపుల్లో చిచ్చు పెట్టడం ప్రత్యేక హోదాతో పబ్బం గడుపుకోవడం జగన్ నైజం అన్నారు. కాగా ఎమ్మెల్యే అత్తార్ కలిసివస్తే తాము సహకారం అందిస్తామని, వ్యక్తిగత మాటలు మాని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జి.దేవానంద్, మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్‌బాను, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు గౌస్, సీనియర్ నాయకులు ఎస్.ఎం.డి ఇస్మాయిల్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పవన్, మున్సిపల్ చైర్ పర్సన్ షేక్ సురియా భాను, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు వీరాంజినేయులు, ఆలయ పాలక మండలి చైర్మన్ పచ్చపులుసు నరేంద్రబాబుతోపాటు టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.