S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుగరు వ్యాధి - పసుపుతో గెలుపు (మీకు మీరే డాక్టర్)

ఫ్రశ్న: పసుపు యాంటీబయాటిక్ అంటారు కదా! రోజూ అన్నంలో తినవచ్చా? దాన్ని ఆహార పదార్థంగా ఎలా తీసుకోవాలి?
జ: పసుపు ఆహార ద్రవ్యం. ఔషధం మాత్రమే కాదు, హిందువులకు, ముఖ్యంగా తెలుగు వారికి అది పవిత్రమైంది. శుభకరమైంది కూడా! ఇతర దేశీయులకు పసుపు ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే! లేదా ఆహార ద్రవ్యానికి పచ్చని రంగునిచ్చేందుకు మాత్రమే వాడుకుంటూ ఉంటారు. భారతీయులు పసుపు ముద్దలో భగవంతుణ్ణి చూస్తారు. తెలుగిళ్లలో పసుపుముద్ద వినాయకుడు, పసుపుముద్ద అమ్మవారు నిత్య పూజలందుకుంటున్నారు.
చిన్న గ్లాసు నీళ్లలో చిటికెడు పసుపు కలిపి పవిత్ర జలాలుగా భావిస్తారు. ఇంటి నలుమూలలా పసుపు నీళ్లు జల్లి పవిత్రతను పొందుతారు. మంగళ స్నానాలను పసుపు కలిసిన నీళ్లతో ఆచరిస్తారు. మాంగల్య బంధానికి పసుపు తాడుని కట్టుకోవటం తెలుగు ప్రజలతో పసుపు ఎంత ముడిపడిందో సాక్ష్యం ఇస్తుంది. పుస్తెలు లేకపోతే బదులుగా పసుపు కొమ్ము కట్టుకునే తెలుగు సంప్రదాయం పసుపుని ఎంతో ఉన్నత స్థానంలో నిలిపింది. పసుపు కలిపిన అన్నం (పులిహోర), పసుపు కలిపిన నీళ్లు, పసుపు కలిపిన కూరలు, పసుపు నీళ్లలో తడిపిన బట్టలు.. ఇలా పసుపుతో పవిత్రీకరించుకుంటారు తెలుగువాళ్లు.
పసుపు పవిత్రమైనదనీ, శుభకరమైనదనీ భావించటం మతపరమైన అంశం కాదు. అది సంస్కృతి పరమైనదిగా భావించాలి! పసుపులోని ఔషధ గుణాలే దానికా ప్రాముఖ్యతను కలిగించాయి.
పసిమి, పసిమిడి, పసిడి, పైడి, పమిడి, భమిడి ఇవన్నీ బంగారానికి సంబంధించిన పదాలు. బంగారం రంగులో ఉంటుంది కాబట్టి పసుపు ఆ పేరుతో ప్రసిద్ధం అయ్యింది. పసుపు పచ్చ అనడం కూడా ఉంది. పచ్చ, పచ్చన, పచ్చి, పసరు, పచ్చిక, ఇవన్నీ ఆకుపచ్చ అనే అర్థంలో వాడుతున్న పదాలు. పచ్చ అనే మాటని పసుపు రంగుక్కూడా వాడుతుంటారు. అలా పసుపుపచ్చ అనటం అలవాటయ్యింది.
పసుపు రంగుని బట్టే కాదు, గుణాన్ని బట్టి కూడా అది బంగారమే! పసుపుని ఔషధంగా ఆహార ద్రవ్యాల్లో వాడుకుంటే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు కొమ్ముల్ని ఎండించి, మర పట్టించిన పసుపుతో, బజార్లో దొరికే పసుపుని పోలిస్తే, నూరు శాతం గుణాలు అనుమానమే! అందుకే పసుపులో ప్రధాన ద్రవ్యం కర్కుమిన్ అనే రసాయనాన్ని కూరల్లో కలుపుకొని తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కర్కుమిన్ కూడా బజార్లో దొరికేదే కాబట్టి, అక్కడా కల్తీలకు అవకాశం ఉంటుంది. అందుకని, పసుపు కొమ్ముల్ని మరాడించుకోవటమే సర్వశ్రేష్ఠం.
పసుపు యాంటీ బయటిక్ అనేది జన వ్యవహారంలో ఉన్న విషయం. అంతకు మించిన ఔషధ ప్రయోజనాలు పసుపు వలన మనకు సమకూరుతున్నాయి. పసుపు పని చేయని వ్యాధి లేదు. భయంకరమైన వ్యాధుల్లో కూడా పసుపు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా కేన్సర్, కీళ్లవాతం, సొరియాసిస్, ఇతర చర్మవ్యాధులు, లివర్, మూత్రపిండాల వ్యాధులు, షుగరు వ్యాధుల్లో పసుపు ప్రభావాన్ని ఆయుర్వేద శాస్త్రం బాగా విశే్లషించింది. ఆయుర్వేద ప్రభావానే్న తెలుగు ప్రజలు పసుపును తమ సంస్కృతిపరమైన అంశంగా గౌరవించుకుంటున్నారు.
పాశ్చాత్య వైద్యంలో పసుపు ఔషధ ద్రవ్యం కాదు. అల్లోపతి ఔషధాల్లో దేనికీ బదులుగా పసుపును వాడుకోవచ్చని చెప్పటానికి లేదు. అరిజోనా విశ్వవిద్యాలయంలో కీళ్లవాతం మీద జరిగిన పరిశోధనల్లో పసుపును రోజూ ఆహార ద్రవ్యంగా తీసుకుంటే కీళ్లవాతం మీద బాగా పని చేస్తోందని ఆ మధ్య ఒక నివేదికను ఇచ్చారు.
పూర్వం ఆధునిక వైద్యంలో కూడా పసుపును కేన్సర్ నిరోధక ఔషధంగానే భావించేవారు. కానీ, పసుపుని ప్రధానమైన ఔషధంగా ప్రయోగించే ప్రయత్నాలు అంతగా సాగలేదు. అత్యంత తాజాగా 2017 జూన్ 1 మెడ్‌‘టుడే వెబ్ జర్నల్లో జాన్ జాన్సన్ అనే శాస్తవ్రేత్త షుగరు వ్యాధి మీద పసుపు ప్రభావం అనే అద్భుతమైన వ్యాసం రాశాడు. పసుపును ఆహార ద్రవ్యంగా తీసుకుంటే అనేక వ్యాధుల మీద దాని సుగుణాలు కనిపిస్తున్నాయంటారాయన.
ఆయుర్వేద శాస్త్రంలో నిశామలకీ చూర్ణం అనే ఔషధం ఉంది. నిశ అంటే పసుపు, ఆమలకి అంటే పెద్ద ఉసిరికాయ. ఈ పెద్ద ఉసిరికాయల లోపల గింజలు తీసేసి, బెరడునీ, దానికి సమానమైన తూకంలో పసుపు కొమ్ముల్నీ కలిపి మరాడిస్తే అదే నిశామలకీ చూర్ణం. ఇది ఆయుర్వేద వైద్యంలో షుగరు వ్యాధికి ఇచ్చే ప్రసిద్ధ ఔషధం.
నిశామలకీ చూర్ణాన్ని మీరు ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లోనూ మిక్సీలు ఉన్నాయి కాబట్టి, చూర్ణాన్ని తయారుచేసుకోవటం తేలికే. దీన్ని కేవలం షుగరు వ్యాధి వచ్చిన వారి కోసం మాత్రమే అనుకోనవసరం లేదు. షుగరు వ్యాధి రాకుండాను, వచ్చిన వారిలో కీటోసిస్, కార్బన్‌కుల్స్ ఏర్పడటం లాంటి ఉపద్రవాలను రాకుండా కూడా కాపాడుతుంది. దీర్ఘ వ్యాధులన్నింటిలోనూ ఒక చెంచా నిశామలకీ చూర్ణాన్ని పాలలో గానీ, మజ్జిగలో కానీ కలిపి రోజూ ఒకటి లేదా రెండుసార్లు తాగుతూ ఉంటే మనం ఊహించని మార్పులు కనిపిస్తాయి. పసుపుతో ఉసిరి కూడా తోడు కావటం అనేక వ్యాధుల్లో అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
మనం సంవత్సరం అంతా నిల్వవుండేలా ఉసిరి తొక్కు పచ్చడి (నల్ల పచ్చడి)ని తయారుచేసుకుంటాం. ఈ తొక్కు పచ్చడిని కొద్దిగా ఇవతలకు తీసుకుని, దానికి సమానంగా పసుపు కలిపి ప్రతిరోజూ అన్నంలో మొదటి ముద్దగా ఒక చెంచాడు మోతాదులో కలుపుకుని తింటే ఎక్కువ గుణవత్తరంగా ఉంటుంది.
శరీరంలో ఎముక పదార్థం నష్టపోకుండా పసుపు అడ్డుకుంటుందని ఒక సిద్ధాంతం ఇటీవలే వెల్లడైంది. లివర్ పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రాబర్ట్ మూట్స్ కీళ్లవాతం చికిత్సలో పసుపు ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించబోతోందని తెలిపారు. ప్రకృతి సిద్ధంగా దొరికే కొన్ని రసాయనాలు ఔషధ విలువలు కలిగినవి కావడం విశేషమే.
పసుపుని ఆహారంగా వాడుకుంటే నొప్పులు, వాపుల్లో తగ్గుదలను శాస్తవ్రేత్తలు గమనించారు. అప్పటి నుండీ పసుపు గురించి పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్తవ్రేత్త డా.అన్న్‌బర్టన్ పసుపు కలిసిన కూరలు రోజూ తింటే ఎముకల వ్యాధులు, ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ (ఎముకల్లో ఎముక పదార్థం తగ్గిపోవటం, ఎముకలు మెత్తబడటం) లాంటి బాధలు తగ్గుతాయని పేర్కొన్నారు. శరీరంలో వాపును ప్రేరేపించి, జాయింట్ల మీద దాడిచేసే ప్రొటీన్లను పసుపు అదుపు చేస్తుందని వీరు భావిస్తున్నారు. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో 2013లో జరిగిన పరిశోధనలు కూడా పసుపు వలన నొప్పి - వాపు తగ్గుతాయని నిర్ధారించాయి.
పసుపు కేవలం సుగంధ ద్రవ్యం కాదు. ఆహార ద్రవ్యాల్లో పసుపును తగుపాళ్లలో చేర్చటాన్ని అలవాటు చేసుకోవాలి. రోజు మొత్తం మీద 2.5 నుండి 3 గ్రాముల వరకూ పసుపును వివిధ ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోగలిగితే పసుపు ఆరోగ్యానికి తలుపులు తెరుస్తుందనీ, వ్యాధులకు తలుపులు మూస్తుందని ఇప్పుడు ఆధునిక వైద్య శాస్త్రం పసుపు ప్రాధాన్యతను గుర్తిస్తోంది. అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పేగుల్లో వాపు, పేగుపాత, కేన్సర్, కీళ్లవాతం, బొల్లి, సొరియాసిస్, మతిమరపు వ్యాధి, షుగరు వ్యాధుల్లో పసుపు ఏ విధంగా పనిచేస్తోందనే విషయం మీద ఇప్పుడు వైద్య శాస్త్ర పరిశోధనలు దృష్టి సారించాయి.
శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాల పనితీరును పసుపులోని కర్కుమిన్ అనే రసాయనం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో కీళ్లవాతం, సొరియాసిస్, షుగరు వ్యాధి, రకరకాల కేన్సర్ వ్యాధుల్లో పసుపు ఒక దివ్యౌషధంగా పని చేస్తుందనే భావనని చాలామంది శాస్తవ్రేత్తలు వ్యక్తపరుస్తున్నారు.
ఒక చెంచా అల్లం ముద్ద, రెండు చెంచాలు మిరియాల పొడి, నాలుగు చెంచాల జీలకర్ర, ఎనిమిది చెంచాల పసుపు, పదహారు చెంచాల ధనియాలపొడి సరిగ్గా ఇదే మోతాదులో కలుపుకుంటే అద్భుతమైన కర్రీ పౌడర్ తయారౌతుంది. దీన్ని అన్ని వంటకాల్లోనూ కలుపుకోవచ్చు. మజ్జిగలో కలిపి తాగితే చాలా రుచిగా ఉంటాయి. ఇష్టమైన వాళ్లు ఈ మొత్తం పొడిలో అరచెంచా ఇంగువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని ఆయుర్వేద గ్రంథాల్లో వేసవారం అని పిలుస్తారు. ఇది పసుపుని సద్వినియోగ పరచుకోగల గొప్ప ఫార్ములా! వైద్యశాస్త్ర రహస్యం, వేసవారాన్ని రోజు మొత్తం మీద ఒకటి లేదా రెండు చెంచాల వరకూ మన కడుపులోకి వెళ్లేలా తీసుకోగలిగితే తప్పకుండా ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు సమస్త ప్రపంచానికీ సన్మంగళకరమైనది. దాన్ని సద్వినియోగపరచుకోవటంలో విజ్ఞత చూపించాలి!
*

సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com