S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆస్తి పంపకం.. ఓ కళ

‘పిల్లలు సమర్ధులు అయితే వారి కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టాల్సిన అవసరం ఏముంది? వారే సంపాదించుకుంటారు.
ఒకవేళ పిల్లలు అసమర్థులు, సంపాదించింది నిలుపుకోలేని అసమర్ధుల కోసం తల్లిదండ్రులు సంపాదించి పెట్టడం ఏందుకు?’ అంటూ యాంగ్రీ యంగ్ మెన్‌గా మూడు దశాబ్దాల క్రితం ఓ సినిమాలో అమితాబ్ చెప్పిన డైలాగు అప్పట్లో బాగా పాపులర్.
‘మా జీవితమంతా పిల్లల బాగు కోసం ధారపోశాం. వయసుడిగిన తరువాత ఇంట్లో నుంచి బయటకు పంపించారు. నిలువ నీడ లేదు.’ హైదరాబాద్‌లో ఇటీవల సీనియర్ సిటిజన్స్ సమావేశాన్ని నిర్వహించినప్పుడు పలువురు వృద్ధులు అవేదనగా చెప్పిన మాట.
పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కొంత సంపాదించి పెట్టాలా? వద్దా? తాము సంపాదించింది పిల్లలకు ఏ వయసులో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి?
సంపాదించడమే కాదు సంపాదించింది పిల్లలకు ఇవ్వడం కూడా ఒక కళే.
ఆ కళలో తేడా వస్తే, జీవితం కల తప్పి పోతుంది. హాయిగా గడవాల్సిన జీవితపు చివరి దశ నరక ప్రాయంగా మారుతుంది. పిల్లలకు సంపాదన ఎప్పుడివ్వాలి? ఎలా ఇవ్వాలి అనే సమస్య ఈ కాలం నాటిది కాదు. యుగ యుగాలుగా ఉన్నదే.
12వ శతాబ్దాంలో కాశ్మీర్‌కు చెందిన సంస్కృత పండితుడు యోగేంద్రుడు ఆనాటి పరిస్థితులను చూసి సంపదను పిల్లలకు ఇవ్వడం గురించి ఆనాడే చెప్పాడు. ఆకాలం నాటి కాశ్మీర్ రాజు అనంత దేవుడు తొలుత అధికారం అంతా కుమారుడికి అప్పగిస్తాడు. కుమారిని తీరు నచ్చక తిరిగి తాను అధికారం తీసుకుంటాడు. పరిస్థితులను తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిస్థితులను చూసిన క్షేమేంద్రుడు తాను రాసిన చారుచర్యలో వారసులకు సంపద ఏ విధంగా అప్పగించాలో వివరించారు.
ధృతరాష్ట్రుడు తన కుమారుడిపై ఉన్న విపరీతమైన వ్యామోహంతో రాజ్యాధికారం మొత్తం అతనికే అప్పగిస్తాడు. తీరా యుద్ధాన్ని నివారించేందుకు తండ్రి ప్రయత్నిస్తే, సూదిమోపినంత నేలను కూడా ఇవ్వనని దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఒకవేళ అధికారం దృతరాష్ట్రుని చేతిలోనే ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా? ఇష్టం లేకపోయినా దుర్యోధనుడు తండ్రి మాట వినాల్సి వచ్చేది. కానీ రాజ్యాధికారం మొత్తం తన చేతిలో ఉన్న తరువాత తండ్రి మాట వినాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా అంతే ఆస్తి మొత్తం వారసుల చేతికి వచ్చిన తరువాత తల్లిదండ్రుల మాట ఎందుకు వింటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో క్షేమేంద్రుడు చెప్పారు. తండ్రి సంపాదన ఎలాగూ సంతానానికే చెందుతుంది. సంతానం బలవంతంగా తీసుకోక ముందే వయసు వచ్చిన పిల్లలకు తండ్రి సంపద అప్పగించాలి. అదే సమయంలో సంపద చేతికి అందిన తరువాత వారెలా ఉంటారనేది కూడా ఒక అంచనాకు రావాలి. అందరూ అలానే అని కాదు. అలా అని అంతా మంచివారే అని కాదు. కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. మొత్తం సంపద ఒకేసారి వారి చేతిలో పెట్టవద్దు. అనుభవం లేని వారసులు ఒకేసారి సంపద వచ్చి పడితే వృధా చేయవచ్చు. లేదా సంపద మొత్తం వచ్చిన తరువాత ఇక తల్లిదండ్రులను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అనుకోవచ్చు. దీని వల్ల వృద్ధాప్యంలో బాధలు తప్పవు. మధ్యేమార్గంగా కొద్ది కొద్దిగా తన సంపదను వారసులకు ఇస్తూ ఉంటే ... తండ్రితో బాగుంటేనే మిగిలిన సంపద దక్కుతుంది అని భావిస్తారు. అదే సమయంలో ఆ సంపదను ఎలా నిర్వహించాలో క్రమంగా అనుభవం గడిస్తారు.
నేను పోయేంత వరకు నా సంపదపై నాదే హక్కు అంటే ఎప్పుడు పోతాడా? అని ఎదురు చూస్తారు. తొందరగా పైకి పంపేందుకు సిద్ధపడే వారు కూడా ఉంటారు. క్రమంగా తన అధికారాన్ని, సంపదను వారసులకు అప్పగించడమే ఉత్తమ పద్దతి అని ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే పెద్దలు సూచించారు.
పిల్లలకు సంపదనంతా ఇచ్చేసి అనాథలుగా మారిన తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలోనే తండ్రి పోతే కానీ సంపదపై అధికారం రాదు అని ఎదురు చూస్తున్న కుటుంబాలూ ఉన్నాయి.
పిల్లలకు సంపదంతా ఇచ్చేసి మోసపోయిన తండ్రులు అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా క్రమంగా సంపద వారసులకు అప్పగించడం ఉత్తమ మార్గం. దీని వల్ల వారసులకు అనుభవం వస్తుంది. పెద్దలకు చివరి దశ హాయిగా గడిచిపోతుంది.
వారసులకు సంపద అప్పగించడం అంటే అది కేవలం ధనం రూపంలో ఉన్న సంపద మాత్రమే కాదు. ఆ సంపదను కాపాడుకునే తెలివి తేటలు, వృద్ధి చేసే తెలివి తేటలు, జీవిత అనుభవాన్ని కూడా పిల్లలకు ఇవ్వాలి. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలపాలి.
పిల్లలు పట్టించుకోవడం అని ఆవేదన చెందే తల్లిదండ్రులు చాలా మంది కనిపిస్తున్నారు. అదే సమయంలో ఇంకా తమ పెత్తనమే సాగాలి అని భావించే తల్లిదండ్రులూ ఉన్నారు. వయసు మీరిన తరువాత హుందాగా దాన్ని అంగీకరించాలి. బాధ్యతలను పిల్లలకు అప్పగించాలి. చివరి దశలో ఎవరిపైనా ఆధారపడకుండా ఏం చేస్తే బాగుటుందో ఒక నిర్ణయానికి రావాలి. మారిన కాలంలో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. వారి స్వతంత్ర భావాలను అర్థం చేసుకోవాలి. మంచి చెడు చెప్పి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వాలి. పెద్దరికాన్ని నిలుపుకోవాలి.
చేతిలో అధికారం, ఆస్తి ఉన్నప్పుడే రేపటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. వయసు మీరి, అధికారం పోయి, సంపద చేజారిన తరువాత ఎంత జీవితానుభవం ఉన్నా ఉపయోగపడదు. అన్నీ చేతిలో ఉన్నప్పుడే సరైన తీరుగా నిర్ణయం తీసుకోవాలి.

-బి.మురళి