ప్రజలతో మమేకమై పనిచేయాలి
Published Tuesday, 18 September 2018ఒంగోలు, సెప్టెంబర్ 18 : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమై పని చేయాలని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం వైవి నివాసంలో ఇటీవల రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కోలా ప్రభాకర్ మాజీ ఎంపీ సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. అనంతరం సుబ్బారెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైవి మాట్లాడుతూ రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు ప్రజలకు మరింత చేరువకావాలని సూచించారు. వరుసగా నాలుగేళ్ల నుండి కరవుతో అల్లాడిన జిల్లా ప్రజలకు ఈ ఏడాది మాగాణి పండించుకునే అవకాశం వచ్చిందన్నారు. ప్రభుత్వం సక్రమంగా సాగు, తాగునీరు అందించేటట్లు కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. మొత్తం 56 మండలాల్లో కరవు నివారణా చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు, కూలీలను ఆదుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణ అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి వేమూరి బుజ్జి, బీసీ నాయకులు జడా బాలనాగేంద్రం, విద్యార్థి విభాగం నాయకులు వి శ్రీనివాస్, కాపు నాయకులు ఎ మల్లికార్జున్, టి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.