కార్తీకం...పికినిక్లకు పెరిగిన జనం...
Published Monday, 19 November 2018విశాఖపట్నం, నవంబర్ 18: అసలే కార్తీకమాసం...అదీ పిక్నిక్ల సీజన్...దీనికి తోడైన ఆదివారం...నగరంలోని ఇక చూడనక్కర్లేదు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా ముఖ్యంగా కొండ ప్రాంతాలు సైతం జనంతో నిండిపోతున్నాయి...పార్కులు,బీచ్లు, పర్యాటక ప్రదేశాలు, ఇలా ప్రతిఒక్కటీ జనంతో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన సందర్శకుల తాకిడి...ఇళ్ళ నుంచి బయలుదేరుతున్న కుటుంబాలు...యువకులు, కాలేజీ విద్యార్థులు, కుల సంఘాలు, స్వచ్ఛంధ సేవా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు, నిర్మాణ రంగ కార్మికులు, మహిళలు ఉదయం నుంచే నగరంలోని పలు పార్కులకు చేరుకోవడం కనిపిస్తోంది. ముఖ్యంగా జూపార్కు, కంబాలకొండ, వుడాపార్కు, ఆర్కె బీచ్, రుషికొండ బీచ్, భీమిలి డచ్హౌస్, ఎర్రమట్టిదిబ్బలు, ముడసర్లోవ పార్కు, ఫిషింగ్హార్బర్ల వద్ద ఎక్కువుగా పిక్నిక్లు నిర్వహిస్తున్నారు. పసందైన వంటకాలతో ఇళ్ళ నుంచే బయలుదేరే సందర్శకులు పిక్నిక్ స్పాట్ల వద్ద పలు రకాలైన ఆటపాటలతో సాయంత్రం వరకు గడుపుతున్నారు. నగరంలోని వన్టౌన్, మహారాణిపేట, చినవాల్తేరు, జగదాంబ జంక్షన్, అల్లిపురం, డాబాగార్డెన్స్, రామ్నగర్, పెదవాల్తేరు, ఎంవిపీ కాలనీ, మర్రిపాలెం వుడాకాలనీ, మురళీనగర్, కంచరపాలెం, అక్కయపాలెం, తాటిచెట్లపాలెం, కైలాపురం, దొండపర్తి, రైల్వేన్యూకాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్బీ కాలనీ, సీతమ్మధార, సీతమ్మపేట, వెంకోజీపాలెం, ఆరిలోవ, పీఎంపాలెం, మధురవాడ, మిథిలాపురి వుడాకాలనీ, ఎండాడ, సాగర్నగర్, రుషికొండ తదితర అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చే జనంతో జూపార్కు కిటకిటలాడింది. ఇంటిళ్ళపాది తమ పిల్లలతో చేరుకోవడంతో జూపార్కులో సందడి వాతావరణం నెలకొంది. పిల్లలు, విద్యార్థులు జంతువులను తిలకించి ఫొటోలు దిగడం ప్రత్యేకమైంది. అలాగే ఆట,పాటలతో సాయంత్రం వరకు గడిపారు. గత రెండు వారాలుగా జూపార్కు జనంతో నిండిపోతుంది. అలాగే దీని ఎదురుగా ఉండే కంబాలకొండ లోపల పిక్నిక్ స్పాట్లు నిర్వహిస్తుండటంతో జనం తాకిడి ఎక్కువుగానే ఉంటోంది. తెనే్నటిపార్కు, వుడాపార్కు, భీమిలి బీచ్, ఆర్కె బీచ్, ఎర్రమట్టిదిబ్బలు, రుషికొండ బీచ్ ప్రదేశాలు రోజంతా సందర్శకులతో నిండి కనిపిస్తున్నాయి. యువకులు సముద్రతీర ప్రాంతాల్లో కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగుతున్నారు. * చిల్లర దుకాణాలకు కాసులపంట...
వేరుశనగ పలుకలు, మొక్కజోన్న, దుంప, పల్లెలు, పానీపురి, ఐస్క్రీమ్, టీ,కాఫీ, బజ్జిలు వంటి దుకాణాలకు కాసులపంటే. సందర్శకుల తాకిడితో వీటికి డిమాండ్ పెరిగింది. ఒకవైపు వాకర్స్, మరోపక్క ఆదివారం కావడంతో ఆర్కె బీచ్లో సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారితో సిటీ సర్వీసులు రద్దీగా నడుస్తున్నాయి. పెందుర్తి, గోపాలపట్నం, సబ్బవరం, వేపగుంట, సుజాతనగర్, మధురవాడ, తగరపువలస, ఆనందపురం, గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి, స్టీల్ప్లాంట్ ఏరియా తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చేవారితో వుడాపార్కు, జూపార్కు, ఆర్కె బీచ్ సందడిగా మారింది.
* అందుబాటులో సిటీ సర్వీసులు...
కార్తీక మాసం పిక్నిక్ల సీజన్ కావడంతో సందర్శకులు, పర్యాటకుల కోసం ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ప్రతి శని,ఆదివారాల్లో ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి పిక్నిక్ స్పాట్ల వద్దకు పలు ప్రాంతాల నుంచి వీటిని నడుపుతున్నారు. రోజు తిరిగే వాటితోపాటు యారాడ, ఆర్కె బీచ్, జూపార్కు తదితర ప్రదేశాలకు పది నుంచి 20 బస్సులను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. వచ్చే నెలాఖరి వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించారు. సందర్శకుల ఆదరణనుబట్టి వీటిని పెంచాలని ఆలోచన చేస్తున్నారు. సిటీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు, ఆటోలకు ఈసారి డిమాండ్ పెరిగింది.
* పిక్నిక్ స్పాట్ల్లోనే వంటకాలు...
మునుపెన్నడూ లేనివిధంగా కొన్ని పిక్నిక్ స్పాట్ల వద్దనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవడం ప్రత్యేకమైంది. ఈసారి మాత్రం ఎక్కువుగా కాయగూరలు, స్వీట్లు వంటి వంటకాలకే అధిక ప్రధాన్యతనిస్తున్నారు. బృందాలుగా తరలివెళ్ళే వారిలో ఎక్కువ మంది ఇళ్ళ నుంచి వంటకాలు తయారు చేసి తీసుకువస్తుండగా, మరికొంతమంది భోజన సమయానికి ఆర్డర్లపై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా వనభోజనాలు సందడిని నింపుతున్నాయి.