అమృతసర్లో బాంబు దాడి
Published Monday, 19 November 2018అమృతసర్, నవంబర్ 18: పంజాబ్లోని అమృతసర్లో ఆదివారం ఒక ప్రార్థనా మందిరం వద్ద బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, పది మంది వరకు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అమృతసర్ జిల్లా రాజసన్సి గ్రామంలో స్థానిక ప్రార్థనా మందిరమైన నిరంకరి వద్దకు ఆదివారం సుమారు 200 మంది భక్తులు వచ్చారు. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు జనంమీదకు గ్రెనేడ్ విసరడంతో జరిగిన పేలుడులో ముగ్గురు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందనిఐజీపీ ఎస్ఎస్ పరమర్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్టు చెప్పారు. బైక్పై వచ్చిన ఇద్దరు నిందితుల వద్ద పిస్తోల్ ఉందని, వారు భక్తుల గుంపుపై గ్రెనేడ్ విసిరి వెంటనే అక్కడి నుంచి పరారయ్యరని, ఆవరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రార్థనా మందిరంలో 200 మంది భక్తులు ఉన్నారని, ఆ ప్రాంతంలో ఎలాంటి సీసీ టీవీలు ఏర్పాటు చేసి లేవని ఆయన చెప్పారు. కాగా, భక్తులపై బాంబు దాడిని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్రంగా ఖండించార. దీనిపై వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ జరపాలని ఆయన హోం కార్యదర్శి, లా అండ్ ఆర్డర్ డీజీపీ, డీజిలను ఆదేశించారు. కాగా మరికొందరి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మాస్క్ ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గేటు దగ్గర విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళకు గన్ చూపించి బెదిరించి లోపలికి చొరబడ్డారని, లోపలికి వచ్చిన వెంటనే వారు చేతిలోని గ్రెనేడ్ను అక్కడ ఉన్న భక్తుల మీదకు విసిరి పరారయ్యారని చెప్పారు. సంఘట అనంతరం పోలీసులు భవనాన్ని స్వాధీనం చేసుకుని సీల్ చేశారు. రాష్ట్రంలో ఉన్న మిగతా నిరంకారి భవన్ల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. కాగా జేఈఎంకు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
హోంమంత్రి రాజ్నాథ్ ఆరా
పంజాబ్లో పేలుడు సంఘటనపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమాయకులైన ముగ్గురు పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకోవడం పట్ల ఆయన ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సానుభూతి తెలుపుతూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం సమీక్ష
గ్రనేడ్ దాడి నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అన్ని నిరంకారి భవ్ల వల్ల భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయన ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ప్రకటించడంతో పాటు గాయపడిన వారికి అవసరమైన వైద్యాన్ని ఉచితంగా చేయాలని ఆదేశించారు.