రాజ్భవన్ నిర్ణయం రాజ్యాంగబద్ధమే!
Published Monday, 13 April 2020విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగం పరిధికి లోబడే మొత్తం ప్రక్రియ కొనసాగిందని పలువురు న్యాయకోవిదులు అంటున్నారు. ప్రస్తుత ఎస్ఈసీ నియామకం కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే), ఏపీ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని 200 సెక్షన్ ప్రకారమే జరిగిందంటున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలంలో మార్పులు చేసే సంపూర్ణ అధికారం గవర్నర్, లేదా ప్రభుత్వానికి ఆయా సెక్షన్ల ప్రకారం భారత రాజ్యాంగం కల్పించింది. 2007లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఎన్నికల కమిషనర్ పదవీకాలంపై తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ఇక రెండో అంశం.. ఇక్కడ ఎన్నికల కమిషనర్ తొలగింపు అనేది జరగలేదంటున్నారు. రమేష్కుమార్కు స్వయంచాలిత పదవీ విరమణ మాత్రమే లభించింది. నూతన చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం మూడేళ్లు మాత్రమే.