అంబేద్కర్ బోధనలను అనుసరించండి
Published Tuesday, 14 April 2020న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగ నిర్మాణ శిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బోధనలను అనుసరించండి అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బలమైన, సంపన్నమైన భారత దేశాన్ని సృష్టించడానికి దోహదం చేయాలని ఆయన కోరారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే కరోనా వైరస్ (కోవిడ్-19) నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి అర్పించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ విద్యావేత్త, సంఘ సంస్కర్త, ఆర్థిక వేత్త, న్యాయ కోవిధుడని ఆయన ప్రశంసించారు. అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం సాధించేందుకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని రాష్టప్రతి తెలిపారు. అంబేద్కర్ జయంతి శుభ సందర్భంలో దేశ ప్రజలు ఆయన ఆశయాలను, ఆకాంక్షలను స్మరించుకుంటూ వాటి సాధన కోసం పునరంకితం కావాలని రాష్ట్రపతి కోవింద్ పిలుపునిచ్చారు.
*చిత్రం... రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్