వలస కూలీలను స్వస్థలాలకు పంపించాలి
Published Tuesday, 14 April 2020విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ పొడిగించే అవకాశం ఉన్నందున తక్షణమే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగుళూరు, తదితర నగరాల్లో వివిధ పనులకు వెళ్లిన వలస కూలీలు స్థితి దయనీయంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆహారం, వసతి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయని అన్నారు. లాక్డౌన్ కారణంగా సొంత ఊర్లకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అన్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఉన్న కర్నూలుకు చెందిన వలస కూలీలను కర్నూలుకు వెళ్లనీయకుండా మార్గమధ్యం నుంచే పోలీసులు వెనక్కి పంపించారంటూ అలాగే హైదరాబాద్, బెంగుళూరులో ఉన్న వలస కూలీలను స్వస్థలాలకు చేర్చేందుకు పలు ఆటంకాలు కల్పిస్తున్నారని ఈ పరిస్థితుల దృష్ట్యా... వలస కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారంటూ తాజాగా సూరత్లో రోడ్డెక్కి ఆందోళనకు సిద్ధపడ్డారని అన్నారు. ఇటలీ నుంచి 33 మంది విద్యార్థులు, వారణాసి నుంచి వెయ్యి మంది యాత్రికులను ఏపీకి తీసుకు రావటంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు చూపిన చొరవ అభినందనీయమంటూ లేఖలో ప్రస్తుతించారు.