చేతిపంపులో పురుగుల మందు!
Published Friday, 29 April 2016బుట్టాయగూడెం, ఏప్రిల్ 29: తాగునీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొందరు ఆకతాయిలు చేసిన పని వందలాది మందిని దాహార్తికి గురిచేసింది. బుట్టాయగూడెం వార్డు మెంబర్ అందుగుల మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అంబేద్కర్ కాలనీ వద్ద పంచాయతీ ఏర్పాటుచేసిన చేతి పంపుపై సుమారు 1500 మంది తాగునీటికోసం ఆధారపడ్డారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పటికీ, ఈ చేతి పంపు కాలనీవాసుల దాహార్తిని, నీటి అవసరాలను తీరుస్తోంది. అటువంటి ఈ చేతి పంపులో కొందరు గుర్తుతెలియని ఆకతాయిలు గురువారం రాత్రి పురుగుల మందు కలిపినట్లు మోహన్ తెలిపారు. ఉదయానే్న నీరు తీసుకువెళ్లేందుకు వచ్చిన మహిళలు పంపు నుండి నురగలతో, ఘాటైన పురుగుల మందు వాసనతో నీరు వచ్చేటప్పటికీ భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కాలనీ పెద్దలకు తెలపడంతో, పంపు నుండి నీరు కొట్టకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు పంపు వద్దకు వెళ్లి పరిస్థితి పరిశీలించి పంపు బాగుచేసే వరకు నీరు వాడవద్దని ప్రజలను హెచ్చరించారు.