చిన వెంకన్న ఆలయంలో సెల్ఫోన్ల నిషేధం
Published Friday, 29 April 2016ద్వారకాతిరుమల, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన చిన వెంకన్న ఆలయంలో ఆదివారం నుండి సెల్ఫోన్ నిషేధాన్ని అమలు చేయనున్నారు. ఆలయ భద్రతతోపాటు భక్తుల ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడం, అలాగే దేవతా మూర్తులపై భక్తులు దృష్టి ఉంచేలా ఆలయ పరిసరాల్లో సెల్ఫోన్లను నిషేధించారు. ఇప్పటికే ఆలయ ప్రాకారంలో జామర్లను ఏర్పాటు చేసినా అవి కొన్ని నెట్వర్క్లను పూర్తిగా నియంత్రించలేక పోతున్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే భక్తుల నుండి సెల్ఫోన్లు సేకరించి, భద్రపరిచేందుకు ఆలయానికి నలు దిక్కులా ఉన్న గోపురాల వద్ద కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు నిమిత్తం ప్రైవేటు వ్యక్తులకు దేవస్థానం బహిరంగ వేలం ద్వారా భక్తుల సెల్ఫోన్లను భద్రపరిచే హక్కులను కల్పించింది. ఏడాదికి రూ.18 లక్షలతో విజయవాడకు చెందిన ఒక ప్రైవేటు కాంట్రాక్టరు ఈ హక్కును కైవసం చేసుకున్నారు. ఒక్కో సెల్ఫోన్ భద్రపరిచేందుకు భక్తుడి నుండి రూ.5 రుసుం వసూలు చేస్తారు. ఈ సెల్ఫోన్ నిషేధం ఆదివారం నుండి అమల్లోకి రానుంది.