భారతీయ నృత్యశైలి విశిష్టమైనది
Published Saturday, 30 April 2016విజయవాడ కల్చరల్, ఏప్రిల్ 29: ప్రపంచ దేశాలలో భారతీయ నృత్యశైలి విశిష్టమైనదని పలువురు ప్రముఖులు అన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీశివరామకృష్ణక్షేత్ర శ్రవణ సదన వేదికపై అమ్మఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమి, తెలుగు కళావాహిని, ఆంధ్రఆర్ట్స్ అకాడమిల సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శాస్ర్తియ నృత్యరంగంలో పేరు గడిస్తూ గుభాళిస్తున్న కళాకుసుమాలైన పలువురు నర్తకీమణులకు సత్కారం జరిగింది. మంజులాచౌదరి, లౌఖ్యాభరణి, కె.రూపలక్ష్మి, శిరీషాప్రణవ్, చైతన్యలను పుష్పమాలాంకృతులను గావించి దుశ్శాలువతో జ్ఞాపికనందించి దేశకీర్తిని ఇనుమడింప చేయాలని నాట్యరంగ వారసత్వ సంపదను అందిపుచ్చుకుని ఉన్నతశ్రేణి నర్తకీమణులుగా కీర్తి గడించాలని అభినందించారు. వేదికపై అతిధులుగా పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు, గోళ్ళ నారాయణరావు, వేముల హజరత్తయ్యగుప్తలు మాట్లాడుతూ ఆంగికం, వాచకం, ఆహార్యం, సాత్వికం వంటివి పండిత పామరులను సమ్మోహనపర్చే భారతీయ నాట్యరీతిలో అభినయాలని అన్నారు. నిర్వహణ చింతకాయల చిట్టిబాబు, మల్లాది రామకృష్ణ చేశారు. తదుపరి అభినందన సత్కారాలందుకున్న వారు వారి నాట్య ప్రదర్శనలతో ఆహూతులను ముగ్ధులను గావించారు.