ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకు 93 మంది విద్యార్థులు
Published Saturday, 30 April 2016గన్నవరం, ఏప్రిల్ 29: ప్రభుత్వ పాఠశాలలకు ప్రజల్లో, తల్లిదండ్రుల్లో ఆదరణ తగ్గలేదనడానకి ఈ పాఠశాల ఉదహరణంగా పేర్కొనవచ్చు. ఉపాధ్యాయుల కృషికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి మారుపేరుగా ఇప్పటికే 93 మంది విద్యార్థులను ప్రైవేట్ స్కూల్స్ నుంచి వెనక్కి రప్పించారు. కేసరపల్లి ఎంపియుపి స్కూల్ విద్యార్థులు గన్నవరం మండలం కేసరపల్లి యుపి స్కూల్ ఉపాధ్యాయులు ఈ నెల 25వ తేదీ నుండి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయిని ప్రసూనాంబ నాయకత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ఉచిత వసతి సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు ఉన్న తేడాలను, ఉపయోగాలను తెలియజేయడంలో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేందుకు అంగీకరించారు. గన్నవరం మండలంలో అత్యధికంగా 93 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చి కేసరపల్లి ఎంపియుపి స్కూల్ ప్రథమస్థానంలో వచ్చి రికార్డు సృష్టించింది. ఇందుకు సహకరించిన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రసూనాంబ అభినందించారు.