పెడన రహదారి విస్తరణకు రంగం సిద్ధం
Published Saturday, 30 April 2016పెడన, ఏప్రిల్ 29: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పట్టణ ప్రధాన రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని చొరవతో రహదారి విస్తరణను ప్రారంభించగా, కొంత మంది కోర్టుకు వెళ్ళటంతో ఆగిపోయింది. అప్పటి నుంచి ఈ పనిని ప్రారంభించేందుకు ఎవ్వరూ చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయం, హోంమంత్రి చినరాజప్ప పట్టణంలో పర్యటించి రోడ్డు విస్తరణపై జోక్యం చేసుకున్నారు. విస్తరణను తప్పనిసరి చేయాలని, అవసరమైన మేరకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు.
దీంతో మున్సిపల్ అధికారులు విస్తరణ చేయటానికి తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కొలతలు చేయటం మొదలు పెట్టారు. గతంలో మార్కింగ్ చేసిన వరకే ఇప్పుడు కూడా ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన రహదారి 28 అడుగులు వరకు ఉంది. అయితే 10 అడుగులు పైగా ఆక్రమణలకు గురికాగా, 28 అడుగుల వరకు మిగిలిపోయింది. విస్తరణ జరిగితే 50 అడుగుల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద పెడన పట్టణంలో ప్రధాన సమస్య అయిన రోడ్డు విస్తరణ కార్యక్రమంలో అధికారులు ముందడుగు వేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. పెడనకు ఇదే పెద్ద సమస్యగా ఉంది.