కెనరా బ్యాంక్ వాచ్మన్ ఆత్మహత్య
Published Saturday, 30 April 2016ఏటూరునాగారం, ఏప్రిల్ 29: మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం కెనరాబ్యాంకులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్న సురేందర్రెడ్డి(45) పురుగులమందు సేవించి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక ఎస్సై మోతె నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్జిల్లా సిద్దిపేటకు చెందిన సురేందర్రెడ్డి గత మూడు సంవత్సరాలుగా కెనరాబ్యాంకులో వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత సంవత్సరంలో బ్యాంకులో జరిగిన కుంభకోణంలో నీకు సంబంధం ఉందంటూ గతంలో పనిచేసిన బ్యాంకు మేనేజర్ శర్మ, ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇరువురు గత కొద్ది రోజులుగా ఫోన్లో వేధిస్తుండండతో మానసికంగా కృంగిపోయిన రెడ్డి మనస్ధాపానికి గురై శుక్రవారం బ్యాంకులో విధులు నిర్వహించేందుకు వెళ్తున్నానని భార్యకు చెప్పి యూనిఫాంలో బ్యాంకుకు చేరుకున్న సురేందర్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో పురుగులమందు సేవించి అపస్మారక స్ధితికి చేరడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్ధితి విషమించడంతో స్ధానిక ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే మృతిచెందాడని తెలిపారు. భార్య గీత బ్యాంకు అధికారుల వేధింపులవల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోస్టుమార్టం నిర్వహించి, కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.