కేంద్రం సహకరించట్లేదు
Published Saturday, 30 April 2016దాచేపల్లి, ఏప్రిల్ 29: ‘రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పెద్దలు మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపించారు. నిధులు లేవు. రాజధాని లేదు. కొత్తగా వచ్చిన కేంద్ర ప్రభుత్వం అయినా మనల్ని ఆదుకుంటుందని ఆశించాం. కాని కేంద్రం సహకరించటం లేదు. అయినా సర్దుకుపోతున్నాం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లిలో జరిగిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. సభకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఏవో అరకొర నిధులిస్తూ కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, దీంతో రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం మన రాష్ట్రం కంటే ఎక్కువగా ఉందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉండగా మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో సైతం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజల లాగానే తానూ మొండి వాడిని కాబట్టి సమస్యల వలయంలో సైతం అవకాశాలను వెతుక్కొని అమరావతి వంటి అద్భుతమైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి నిర్మాణపనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.